Begin typing your search above and press return to search.

రూ.లక్ష కోట్లు కాజేసిన మహిళ... దేశాన్ని కుదిపేస్తున్న వ్యవహారం!

అవును... ఒక మహిళ ఏకంగా బ్యాంక్ కార్యకలాపాలు నిలిచిపోయే స్థాయిలో మోసాలకు పాల్పడింది.

By:  Tupaki Desk   |   1 Feb 2024 3:52 AM GMT
రూ.లక్ష కోట్లు కాజేసిన మహిళ...  దేశాన్ని కుదిపేస్తున్న వ్యవహారం!
X

కలిసి రావడం మొదలవ్వాలి కానీ... రావడం మొదలుపెడితే రియల్ ఎస్టేట్ ఇచ్చినంతగా మరో వ్యాపారం ఇవ్వదని అంటుంటారు ఆ రంగంలో ఎదిగినవారు! "బిజినెస్ మేన్" సినిమాలో మహేష్ బాబు ముంబై గురించి చెప్పినట్లు.. ఇవ్వడం మొదలుపెడితే ఇస్తూనే ఉంటుంది! ఈ క్రమంలో ఇలా ఇంతింతై వటుడింతై అన్నట్లుగా రియల్‌ ఎస్టేట్‌ టైకూన్‌ గా పేరొందిన ఓ మహిళ ఏకంగా ఒక బ్యాంక్ కార్యకలాపాలు నిలిచిపోయే స్థాయిలో మోసాలకు పాల్పడింది.

అవును... ఒక మహిళ ఏకంగా బ్యాంక్ కార్యకలాపాలు నిలిచిపోయే స్థాయిలో మోసాలకు పాల్పడింది. దీంతో ఆ బ్యాంక్ లో డబ్బులు దాచుకున్న సుమారు 42వేల మందిపై ఈ ప్రభావం పడింది. అప్పులు తీసుకోవడం తిరిగి వాటిని చెల్లించకపోవడం ఈమె నిత్యకృత్యాల్లో ఒకటి. ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఆమె సంపద విలువ 2022 నాటికి దేశ జీడీపీలో 3 శాతం ఉంటుందని అంచనా!!

వివరాళ్లోకి వెళ్తే... వియత్నాంలోని ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్‌ కంపెనీ "వాన్‌ తిన్హ్‌ పాట్‌" ఛైర్‌ పర్సన్‌ గా ఒక మహిళ మాగ్నెట్ ట్రూంగ్ మై లాన్‌ ఉన్నారు! ఈమెకు స్థానిక సైగాన్‌ కమర్షియల్‌ బ్యాంకు (ఎస్.సీ.బీ.)లో సుమారు 90 శాతం వాటా ఉంది. ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా ఆమె ఈ బ్యాంకులోనే మోసాలకు పాల్పడ్డారు.

ఇందులో భాగంగా ఫేక్ లోన్‌ అప్లికేషన్లు పెట్టి కోట్ల మేర డబ్బులు తీసుకున్నారు. తీరా లోన్ తీసుకున్న తర్వాత తిరిగి చెల్లించే ఆలోచనకు చెల్లుచీటీ ఇచ్చేశారు! దీంతో... ఏకంగా ఆ బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి. దీంతో అందులో డబ్బులు దాచుకున్న దాదాపు 42వేల మందిపై ఈ ప్రభావం పడింది. ఫలితంగా ఆమెతో పాటు ఆ బ్యాంక్ లో ఖాతాదారులైన సుమారు 42వేల మందిపై ఈ ప్రభావం పడింది.

వాస్తవానికి 2018 నుంచే ఆమె ఈ దందా మొదలుపెట్టిందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... 2018 నుంచి 2022 మధ్య మై లాన్‌.. ఇలా సుమారు 916 ఫేక్ లోన్ అప్లికేషన్లు తయారు చేసి బ్యాంకులో సమర్పించిందని, ఫలితంగా బ్యాంకు నుంచి వియత్నాం కరెన్సీలో 304 ట్రిలియన్‌ డాంగ్‌.. అంటే 12.5 బిలియన్ డాలర్లు.. ఇక మన రూపాయిల్లో చూసుకుంటే ఏకంగా లక్షకోట్లు దాటి తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ క్రమంలో 2019 నుంచి 2022 మధ్య ఆమె డ్రైవర్‌ బ్యాంకు హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి సుమారు 4.4 బిలియన్‌ డాలర్ల (రూ.36.5 కోట్లు) నగదును ఆమె ఇంటికి తరలించినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో అదే ఏడాది అక్టోబరు నెలలో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. నాటి నుంచి సదరు బ్యాంకులో ఖాతాదారులుగా ఉన్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాము దాచుకున్న డబ్బులను విత్‌ డ్రా చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆఖరికి వారి పరిస్థితి ఎంతవరకూ వచ్చిందంటే... అసలు సొమ్ము సంగతి అటుంచితే కనీసం దాచుకున్న సొమ్ముపై వడ్డీ అయినా ఇవ్వండి అంటూ విన్నవించుకుంటున్నారు.. అదికూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో వందలాది మంది బాధితులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఈ కుంభకోణంలో లాన్‌ తో పాటు 85 మందిపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.