Begin typing your search above and press return to search.

అత్తాపూర్లో కండక్టర్ ను చెప్పుతో కొట్టిన మహిళ

తాను ఆపమన్న చోట బస్సు ఆపలేదన్న కోపంతో ఊగిపోయిన ఒక మహిళా ప్రయాణికురాలు కండక్టర్ మీద దాడికి పాల్పడింది.

By:  Tupaki Desk   |   10 Feb 2024 8:17 AM GMT
అత్తాపూర్లో కండక్టర్ ను చెప్పుతో కొట్టిన మహిళ
X

పద్దతి మారుతోంది. కొత్త అలవాట్లు తరచూ ప్రదర్శిస్తున్న మహిళా ప్రయాణికుల తీరు ఇప్పుడు షాకింగ్ గా మారుతోంది. గతానికి భిన్నంగా తరచూ ఆర్టీసీ కండక్టర్ మీద దాడి చేసే ఘటనలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. మొన్నటికి మొన్న పాతబస్తీకి చెందిన ఒక యువతి ఫుల్ గా తాగేసి.. బస్సు ఎక్కటమే కాదు. సంబంధం లేని అంశాల్ని ప్రస్తావిస్తూ.. రాయలేని.. వినలేని రీతిలో బూతులు తిట్టటమే కాదు.. కాలితో తన్నటం.. లేపేస్తానంటూ వార్నింగ్ ఇవ్వటం తెలిసిందే.

ఆమెకు సంబంధించిన వీడియో వైరల్ కావటంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు ఆర్టీసీ సైతం ఈ అంశాన్నిసీరియస్ గా పరిగణించి.. ఆ యువతిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు పంపారు. బాగా చదువుకున్న అమ్మాయి సైతం ఇలా వ్యవహరించటం షాకిచ్చేలా చేసింది. తాజాగా అలాంటి ఉదంతమే మరొకటి చోటు చేసుకుంది.

తాను ఆపమన్న చోట బస్సు ఆపలేదన్న కోపంతో ఊగిపోయిన ఒక మహిళా ప్రయాణికురాలు కండక్టర్ మీద దాడికి పాల్పడింది. చెప్పుతో కండక్టర్ చెంపల్ని విచక్షణరహితంగా కొట్టిన వైనంపై విస్మయం వ్యక్తమవుతోంది. మరీ.. ఇంత ఆవేశం ఏమిటి? అన్నది ప్రశ్న. అంతేకాదు.. చిన్న విషయాలకు కోపాలకు పోవటం..భౌతిక దాడులకు పాల్పడే వరకు విషయాలు వెళ్లటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

మెహిదీపట్నం నుంచి ఉప్పల్ వెళ్లే సర్వీసు నెంబరు 300లో ఈ ఘటన చోటు చేసుకుంది. కండక్టర్ మీద దాడి చేసిన మహిళను శివరాంపల్లికి చెందిన ప్రసన్నగా గుర్తించారు. బస్సు అడిగిన చోట ఆపలేదన్న కోపంతో ఈ తరహా దాడి చేయటంపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ సిబ్బంది మనోస్థైర్యం దెబ్బ తినేలా తరచూ ఎవరోఒకరు ఏదో పేరుతో భౌతిక దాడులకు పాల్పడుతున్న వైనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇలాంటి ఉదంతాలపై చర్యలు తీసుకోవాలని.. కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.