Begin typing your search above and press return to search.

అతడి ఆత్మహత్యకు కారణమైన మహిళకు మూడేళ్ల జైలు!

ఈ నేపథ్యంలో కేసు నమోదైంది. నిందితురాలిని సంగారెడ్డి కోర్టుకు తరలించారు. దాదాపు నాలుగున్నరేళ్ల పాటు సాగిన విచారణ తాజాగా తీర్పునిచ్చారు న్యాయమూర్తి.

By:  Tupaki Desk   |   18 Jan 2024 8:30 AM GMT
అతడి ఆత్మహత్యకు కారణమైన మహిళకు మూడేళ్ల జైలు!
X

ఒక వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన మహిళకు సంగారెడ్డి కోర్టు జైలుశిక్షతో షాకిచ్చింది. ఒకరి మరణానికి ప్రేరేపించిందన్న ఆరోపణలతో ఏకీభవించిన న్యాయస్థానం జైలుశిక్షను విధిస్తూ తీర్పును ఇచ్చింది. నాలుగేళ్లకు పైనే సాగిన ఈ కేసు విచారణ.. తాజాగా శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అసలేం జరిగిందంటే.. పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.

మెదక్ జిల్లాలోని వీరోజిపల్లికి చెందిన మొగులమ్మ ఒంటరి మహిళ. ఆమెకు భర్త చనిపోయారు. దీంతో ఆమె పటాన్ చెరు లో ఉంటూ కూలీగా పని చేసుకుంటూ ఉండేది. ఆమె నివాసం ఉండే కాలనీలోనే శివ్వాయిపల్లికి చెందిన కిషన్ కుటుంబం కూడా ఉండేది. కూలీ పని చేసుకునే కిషన్ పెద్ద కొడుకు లింగంనుమొగులమ్మ ప్రేమించాలని ఒత్తిడి తీసుకొచ్చేది.

ఇదిలా ఉంటే.. ఒకసారి రూ.60వేలు తీసుకురావాలని కోరింది. అందుకు అతను నిరాకరించటంతో అతడి మీద ఒత్తిడిని పెంచింది. ఈ ఒత్తిళ్లను తట్టుకోలేని లింగం 2019 జులై 24న ఇంట్లో ఎవరు లేని టైంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కొడుకు ఆత్మహత్యకు కారణం మొగులమ్మ అంటూ లింగం తండ్రి కిషన్ ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో కేసు నమోదైంది. నిందితురాలిని సంగారెడ్డి కోర్టుకు తరలించారు. దాదాపు నాలుగున్నరేళ్ల పాటు సాగిన విచారణ తాజాగా తీర్పునిచ్చారు న్యాయమూర్తి. ఆమెకు మూడేళ్ల సాధారణ జైలు.. రూ.వెయ్యి జరిమానా విదిస్తూ సంగారెడ్డి కోర్టు న్యాయాధికారి తీర్పును ఇచ్చారు. ఒకవేళ ఫైన్ గా విధించిన రూ.వెయ్యి కట్టని పక్షంలో మరో నెల పాటు జైలు అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.