Begin typing your search above and press return to search.

మహిళా సీఐకి ఊహించని మద్దతు... పవన్ పై ప్రశ్నల వర్షం!

గత కొన్నిరోజులుగా సీఐ అంజూ యాదవ్ టాక్ ఆఫ్ ది ఏపీగా మారారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   17 July 2023 2:24 PM GMT
మహిళా సీఐకి ఊహించని మద్దతు... పవన్ పై ప్రశ్నల వర్షం!
X

గత కొన్నిరోజులుగా సీఐ అంజూ యాదవ్ టాక్ ఆఫ్ ది ఏపీగా మారారని అంటున్నారు. జనసేన నేతలపై ఆమె చేయి చేసుకోవడం, ఆమెకు పవన్ కల్యాణ్ కౌంటర్ ఇవ్వడం, ఏకంగా ఆమెపై ఫిర్యాదు చేసేందుకు పవన్ తిరుపతి రావడం.. ఇలా వరుస ఎపిసోడ్ లతో అంజూ యాదవ్ అనే పేరు మారుమోగిపోయిందని తెలుస్తుంది. ఈ సమయంలో పవన్ ర్యాలీగా తిరుపతి వచ్చిన విషయం చర్చనీయాంశమైందనే చర్చ తెరపైకి వచ్చింది.

అవును... శ్రీకాళహస్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ అంజూ యాదవ్ దుందుడుకుగా వ్యవహరించారని ఆరోపిస్తూ... తమ కార్యకర్తను కొట్టడాన్ని నిరసిస్తూ... పవన్ కళ్యాణ్ చేసిన ర్యాలీ ఇప్పుడు చర్చనీయాంశం అయిందని అంటున్నారు. దీంతో... ధర్నా చేస్తున్న తమ కార్యకర్తను ఆమె చెంపదెబ్బలు కొట్టారు అని చెబుతున్న పవన్ కళ్యాణ్... అసలు ఆమె అలా ఎందుకు కొట్టాల్సి వచ్చింది.? అక్కడ అంతమంది కార్యకర్తలు ఉండగా... సదరు సాయి అనే కార్యకర్తను మాత్రమే ఎందుకు కొట్టారు? అనే దిశగా ఆలోచించాలని సూచిస్తున్నారు.

జనసేన కార్యకర్త సాయి మీద యాదవ సామాజిక వర్గానికి చెందిన అంజూ యాదవ్‌ కు ఏమైనా కక్షలు కార్పణ్యాలు ఆస్థి తగాదాలు లాంటివి లేనప్పుడు ఆయన్నే సెలక్టివ్ గా ఎందుకు కొట్టి ఉంటారనే ఆలోచన పవన్ చేయాలని అంటున్నారు. కోట్లమంది ప్రజలతో ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ... ఆ దిష్టిబొమ్మను తొక్కుతున్న కార్యకర్తలను చెదరగొట్టేందుకు అంజూ యాదవ్ ప్రయత్నించారని చెబుతున్నారు.

ఈ తరుణంలో జనసేన కార్యకర్తలు నియంత్రణ కోల్పోయి, శృతిమించిన పనులకు పాల్పడుతున్న పరిస్థితుల్లో.. పోలీసుల మీదకే దాడి చేసే పరిస్థితి నెలకొన్న తరుణంలో... మరో మార్గం లేక పరిస్థితి అదుపు చేసే క్రమంలో ఆమె ఒక చెంపదెబ్బ కొట్టి ఉంటారని అంటున్నారు. ఇదే సమయంలో... లాఠీఛార్జ్ చేయాల్సిన ఉద్రిక్తత ఉన్నా కూడా సామరస్యంగా పరిస్థితి అదుపు చేసే క్రమంలో ఆమె ఒక చెంప దెబ్బ కొటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సందర్భంగా... ఒక బీసీ మహిళా పోలీస్ ఇలా తమ మీద అధికారం చూపడాన్ని సహించలేకే పవన్ కళ్యాణ్ ఇలా ఆమె మీద రాజకీయ దాడి చేస్తున్నారని యాదవ వర్గాలు గుర్రుమంటున్నాయని తెలుస్తుంది. దీంతో ఆమె కెరీర్ ఎంత నిక్కచ్చిగా సాగింది.. పార్టీలకు అతీతంగా ఆమె శాంతిభద్రతల విషయంలో ఎంత కఠినంగా ఉంటారు అనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

అంజూ యాదవ్ డ్యూటీలో ఎంత క్రమశిక్షణలో ఉంటారో... తప్పు చేసినవాళ్ల విషయంలోనూ అంతే కఠినంగా ఉంటారనే పేరు స్థానికంగా ఉందని తెలుస్తుంది. దీనికి ఉదాహరణంగా... ఏడాది క్రితం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర విషయంలో జరిగిన విషయాన్ని ప్రస్థావిస్తున్నారట ఆమె సానుబూతిపరులు. గతంలో వైసీపీ ఎమ్మెల్యే కుమార్తె పవిత్ర ఒక ధర్నాలో పాల్గొంటే... ఆమె విషయంలో కూడా ఇలానే వ్యవహరించి శాంతి భద్రతలు కాపాడారని తెలుస్తుంది.

ఇలా కొన్ని ఉదాహారణలు తెరపైకి తెస్తూ... శాంతి భద్రతలు కాపాడే విషయంలో ఆమె పార్టీలకు అతీతంగానే ఉంటూ వచ్చారని అంటున్నారు. సామాజిక ప్రశాంతతకు విఘాతం కలిగితే ఏమాత్రం సహించలేని అంజూ యాదవ్... జనసేన కార్యకర్త విషయంలో కూడా అప్పటి పరిస్థితుల విషయంలో అలా రియాక్ట్ అయ్యి ఊంటారని అంటున్నారు. పైగా ఈ దెబ్బ అనంతరం పరిస్థితి అదుపులోకి వచ్చిందనే విషయాన్ని గుర్తుచేస్తున్నారట.

ఈస్థాయిలో స్ట్రిక్ట్ ఆఫీసర్ గా పేరుతెచ్చుకున్న అంజూ యాదవ్... ఒక బీసీ మహిళ అనే కారణంతో చిన్న చూపు చూస్తూ అవమానిస్తున్నారని ఆ వర్గం ప్రజలు పవన్ పై ఫైరవుతున్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో తమ ఆడబిడ్డ ఎదుగుదలను సహించలేని పవన్ కళ్యాణ్ ఇలా ఆమెను టార్గెట్ చేస్తున్నారని యాదవ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఇదే సమయంలో... మహిళలు స్ఫూర్తిమంతంగా ఉండాలి.. ధైర్యంగా ఉండాలి.. అన్యాయాలను ఎదిరించాలీ అని మైకులముందు చెప్పే పవన్... ఇప్పుడు సిన్సియర్ గా విధులు నిర్వర్తిస్తున్న బీసీ మహిళా పోలీస్ అధికారిని టార్గెట్ చేస్తూ ధర్నా చేయడం ఏంటని ప్రశ్నిస్తూ... ఇది ఆయన అహంకారపూరిత మనస్తత్వానికి ప్రతీక అని యాదవ యువత ఆరోపిస్తోందని అంటున్నారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కు తాము సరైన సమయంలో బుద్ధి చెబుతామని అంటుండటం గమనార్హం.