Begin typing your search above and press return to search.

కారెక్కిన విష్ణువర్ధన్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి... కామెట్స్ వైరల్!

అవును... ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి

By:  Tupaki Desk   |   31 Oct 2023 10:45 AM GMT
కారెక్కిన విష్ణువర్ధన్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి... కామెట్స్ వైరల్!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో పార్టీలు మారుతున్న వారి సందడి నెలకొంది. ఇందులో భాగంగా... బీజేపీ నుంచి, బీఆరెస్స్ నుంచి కొంతమంది నేతలు ఇటీవల ఢిల్లీ వెళ్లి ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు నేతలు కారెక్కేశారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలపై వారు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అవును... ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా... ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడిన అభ్యర్థులు పార్టీలు మారుతున్నారు. ఈ క్రమంలో తాజాగా విష్ణువర్ధన్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి బై చెబుతూ బీఆరెస్స్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా... విష్ణువర్ధన్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి లకు బీఆరెస్స్ భవన్ లో గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. ఈ సందర్భంగా వారిని హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లుగా ప్రకటించారు. ఇదే క్రమంలో నాగం జనార్దన్ రెడ్డి, తాను అనేక పోరాటాలు చేశామని వెల్లడించిన కేసీఆర్... విష్ణువర్ధన్ రెడ్డి భవిష్యత్తుకు తాను భరోసా ఇస్తున్నట్టు పేర్కొన్నారు.

ఈ సమయంలో... తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తోడుగా రావాలని వారిని కోరినట్టు తెలిపిన కేసీఆర్... పాత, కొత్త నేతలు అందరూ కలిసి పనిచేయాలని అన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందని.. పారిశ్రామిక రంగంలో ఎంతో పురోగ‌తి సాధించిందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు.

ఇందులో భాగంగా... తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎంతకాలమో మనుగడ సాగించలేదని, ప్రస్తుత నేతలు త్వరలో గాంధీభవన్ ను కూడా అమ్మేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి పీజేఆర్, తాను కాంగ్రెస్ పార్టీకి ఎన్నో ఏళ్ళు సేవలు అందించామని, కానీ ప్రస్తుతం ఇప్పుడున్న నేతలు డబ్బులకు అమ్ముడుపోయి తనకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నేతలకు రాష్ట్రాన్ని అప్పగిస్తే ఏ చైనాకో, అమెరికాకో అమ్మేస్తారని మండిపడ్డారు!

కాగా... జూబ్లీహిల్స్ టిక్కెట్ విషయంలో విష్ణువర్ధన్ రెడ్డి అసంతృప్తికి గురైన సంగతి తెలిసిందే. పార్టీ కష్టకాలంలో తోడుగా ఉన్న తనకు కాకుండా వేరేవారికి ఆ టిక్కేట్ ఇచ్చారంటూ ఫైరయ్యారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తాను జూబ్లీహిల్స్ నుంచే పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో తాజాగా బీఆరెస్స్ పార్టీలో చేరిపోయారు.