Begin typing your search above and press return to search.

తుస్సుమన్న బస్ బే... వైసీపీకి డైరెక్ట్ షాక్

ఇంతలోనే ఈ మొడ్రన్ బస్ స్టేషన్ ఇలా కుంగిపోవడం అంటే భారీ అవినీతి అంటూ విపక్షాలు గట్టిగా విమర్శలు చేస్తున్నారు

By:  Tupaki Desk   |   28 Aug 2023 4:14 AM GMT
తుస్సుమన్న బస్ బే... వైసీపీకి డైరెక్ట్ షాక్
X

విశాఖ అంటే వైసీపీ ఎక్కువ మక్కువ చూపిస్తుంది అన్నది తెలిసిందే. మూడు రాజధానులు అంటూ విశాఖలోనే మొత్తం పాలన షిఫ్ట్ చేయాలని వైసీపీ చూస్తున్న విషయం తెలిసిందే. అలాంటి విశాఖ విషయంలో ఏ చిన్నది జరిగినా విపక్షాలు ఫుల్ అలెర్ట్ గా ఉంటాయి.

విశాఖలో బ్యూటిఫికేషన్ పేరుతో జీవీఎంసీ పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది. అదే టైం లో ఓల్డ్ మోడల్ లో ఉన్న బస్ స్టాండ్స్ ని రూపు మార్చేస్ బస్ బే అంటూ సరికొత్తగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోంది. ఇది బిగ్ ప్రాజెక్ట్ గా జీవీఎంసీలోని 99 వార్డులలో చురుకుగా సాగుతోంది.

ఇదిలా ఉంటే బస్ బే అంటూ ఒక్కో దానిని మార్చేందుకు కొత్తగా డిజైన్ చేసేందుకు రమారమిగా నలభై నుంచి యాభై వేల ఖర్చుతో బడ్జెట్ ని కేటాయిస్తున్నారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ పనులను ఒకరికే అప్పగించారని అంటున్నారు. ఇటీవల నగర మేయర్ చేతుల మీదుగా ఒకటి రెండు బస్ బే లు ప్రారంభం అయ్యారు. చూడడానికి అందంగా సరికొత్తగా ఫారిన్ మోడెల్ గా ఉండడంతో ఇదేదో బాగుందని అంతా అనుకున్నారు.

వైసీపీ ప్రభుత్వం విశాఖను బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దుతోందని కూడా అనుకున్నారు. ఆ ముచ్చట అలా ఉండగానే ఏకంగా సిటీకి నడిబొడ్డున ఉన్న బస్ షెల్టర్ ఒకటి కుంగిపోయింది. ఒక్కసారిగా అది పక్కకు ఒరిగిపోయింది. ఆ టైంలో ప్రయాణీకులు ఎవరూ లేకపోవడమే లక్ అని అంటున్నారు. లేకపోతే పెద్ద ప్రమాదమే సంభవించేది అని అంటున్నారు. ఇది నలభై లక్షలతో నిర్మించారు. మేయర్ వచ్చి ప్రారంభించారు.

ఇంతలోనే ఈ మొడ్రన్ బస్ స్టేషన్ ఇలా కుంగిపోవడం అంటే భారీ అవినీతి అంటూ విపక్షాలు గట్టిగా విమర్శలు చేస్తున్నారు. మాజీ మంత్రి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అయితే బస్ స్టాండే కట్టలేని వారు మూడు రాజధానులు కడతారా పోలవరం కట్టగలరా అంటూ భారీ సెటైర్లే పేల్చారు. ఇక జనసేన వామపక్షాలు అయితే అసలు వదలడంలేదు, ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడమే అని అంటున్నారు. జీవీఎంసీ ఎదురుగా కట్టిన బస్ బే కే దిక్కు లేకపోతే మిగిలిన వాటి కధ ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

మొత్తానికి చూస్తే వైసీపీకి ఇది అతి పెద్ద దెబ్బగానే మారుతోంది. జస్ట్ కుంగింది కదా అని సరిపెట్టుకోవడానికి లేదు. వీటి నాణ్యతా ప్రమాణాలు ఇపుడు ముందుకు వస్తున్నాయి. ఇన్ని లక్షల ఖర్చు ఎందుకు అన్న చర్చ వస్తోంది. వీటికే భద్రత లేకపోతే భారీ ప్రాజెక్టులు టేకప్ చేస్తే వాటిలో అవినీతి అక్రమాలు జరిగితే జనం సంగతేంటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

విశాఖను ఏదో చేద్దామని వైసీపీ పెట్టుకున్న ఆశలు ఒక్క బస్ బే ప్రాజెక్టుతో తుస్సుమనిపించేశాయి అని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసిన వారి విషయంలో సరైన చర్యలు తీసుకుని వీటి మీద ఫుల్ ఫోకస్ పెట్టి జనాలకు మేలు చేయకపోతే ఈ మచ్చ మామూలుగా ఆరదని, ఇది చిచ్చు రేపి వైసీపీ హాట్ ఫేవరేట్ సిటీలో బిగ్ ట్రబుల్స్ ని క్రియేట్ చేస్తుంది అని అంటున్నారు.