Begin typing your search above and press return to search.

విశాఖ 2055 నాటికి ఎలా ఉండబోతోంది ?

ఇపుడు ప్రైవేట్ రంగం కూడా పెద్ద ఎత్తున దూసుకుని వస్తోంది. విశాఖలో ఎటు చూసినా వెల్లువలా పెట్టుబడులు వస్తున్నాయి.

By:  Satya P   |   21 May 2026 9:00 AM IST
విశాఖ 2055 నాటికి ఎలా ఉండబోతోంది ?
X

విశాఖ చరిత్ర సుదీర్ఘమైనది. విశాఖ ఇప్పటికి రెండు వందల ఏళ్ళ క్రితమే జిల్లాగా ఏర్పాటు అయింది. ఒడిషాలోని కొన్ని ప్రాంతాలతో కలుపుకుని అతి పెద్ద జిల్లాగా విశాఖ మొదట ఉంటూ వచ్చింది. విశాఖ అభివృద్ధి అంతా క్రమానుగతంగా సాగింది. ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఈ రోజున ఈ స్థాయిలో ఉంది. విశాఖ అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలే అని ఇంతకాలం ఒక భావన ఉంది. ఇపుడు ప్రైవేట్ రంగం కూడా పెద్ద ఎత్తున దూసుకుని వస్తోంది. విశాఖలో ఎటు చూసినా వెల్లువలా పెట్టుబడులు వస్తున్నాయి.

ఎల్లలు దాటిన అభివృద్ధి :

విశాఖ అంటే శివారు గ్రామాల వరకే అభివృద్ధి ఉండేది ఇపుడు మరింతంగా విస్తరిస్తూ ఎల్లలు లేని విధంగా వేగంగా సాగుతోంది. దాంతో విశాఖ మరో మూడు దశాబ్దాల తరువాత ఎలా ఉండబోతోంది ఆనాటి ట్రాఫిక్ పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది ముందే దృష్టిలో ఉంచుకుని సమగ్రమైన రవాణా ప్రణాళిక రూపకల్పన పైన జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. కూటమి ప్రభుత్వం కూడా విశాఖ మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన నేపథ్యంలో విశాఖకు సంబంధించిన అభివృద్ధి ఈనాటితో సరి కాదని మరిన్ని దశాబ్దాల తరువాత కూడా ముందే ఊహించి అంచనాకు వచ్చి ప్రగతి పధంలో నిలపాలని భావిస్తున్నారు.

మెట్రో రైలు ప్రాజెక్టులతో :

విశాఖపట్నం స్పీడ్ గా ఎదుగుతున్న మహా నగరంగా ఉంది. దాంతో విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ లో మెట్రో రైల్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణను రూపొందించాయి. రానున్న కాలంలో మెట్రో రైళ్ళు విశాఖ గుండా సాగుతాయి. ఇక ఈ మెట్రో రైలు ప్రాజెక్టులకు అనుబంధంగా ఏర్పాటు చేయాల్సిన సమగ్ర రవాణా ప్రణాళిక రూపకల్పనపై జిల్లా యంత్రాంగం కీలక సమావేశాన్ని స్టేక్ హోల్డర్స్ తో నిర్వహించారు.

జనాభా మరింతగా :

ఇక విశాఖ జనాభా ఈ రోజుకు పాతిక లక్షల పై దాటి ఉంది మరో ముప్పయ్యేళ్ళకు ఇంతకు ఇంత పెరుగుతుందని అంచనా ఉంది. దాంతో మెట్రో రైల్ ప్రాజెక్టులు ఏర్పాటులో విశేష అనుభవం కలిగి సిస్ట్రా సంస్థ ప్రతినిధులు 2055 నాటికి విశాఖ రీజయన్ లో జనాభా పెరుగుదలకు అనుగుణంగా నగరం మొత్తం మీద అవసరమైన చోట్ల అండర్ పాస్ లు, ఫుట్ పాత్ లు, సైకిల్ ట్రాకులు, ట్రాఫిక్ సర్వే, దశలవారీగా అమలు తదితర అంశాలపై తాజాగా జిల్లా అధికార యంత్రాంగంతో జరిగిన సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సిస్ట్రా సంస్థ విశాఖకు సంబంధించి సమగ్ర రవాణా ప్రణాళికను రూపొందించింది. ఇప్పటికే ప్రాథమిక సర్వే పూర్తి చేసింది.

అందరి భాగస్వామ్యంతో :

ఇక విశాఖ రీజియన్ లో కీలకపాత్ర వహించే సమగ్ర రవాణా ప్రణాళికలో భాగస్వాములైన జీవీఎంసీ, విఎంఆర్డీఏ పోలీస్ రైల్వే, నేషనల్ హైవేస్, తదితర అధికారులు సలహాలు, సూచనలు,అభ్యంతరాలను వ్రాత పూర్వకంగా తెలియచేసిన మీదట సమగ్ర రవాణా ప్రణాళిక రూపకల్పనకు రంగం సిద్ధం అవుతుంది. ఈ సమగ్ర రవాణా ప్రణాళిక విశాఖ రీజియన్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుందని, భవిష్యత్ తరాల దృష్టిలో ఉంచుకొని రూపొందించే ఈ కాంప్రెహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ ద్వారా నగర అభివృద్ధి మరింత సమర్థవంతంగా జరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.