Begin typing your search above and press return to search.

పేరెత్తకుండా ట్వీట్ చేసిన సాయిరెడ్డి... చిరంజీవిపై సెటైర్లు?

రాజ్యసభ ఎంపీ, వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి.. ట్విట్టర్ వేదికగా స్పందించారు

By:  Tupaki Desk   |   10 Aug 2023 11:20 AM GMT
పేరెత్తకుండా ట్వీట్ చేసిన సాయిరెడ్డి... చిరంజీవిపై సెటైర్లు?
X

ఏపీ ప్రభుత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మంత్రులు కౌంటర్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. వారిలో కొంతమంది స్మూత్ గా ఇవ్వగా.. మరికొంతమంది వాయించి వదిలారు. ఇంకొంతమంది సవాళ్లు విసిరారు. ఈ క్రమంలో తాజాగా విజయసాయి రెడ్డి స్పందించారు.

అవును... రాజ్యసభ ఎంపీ, వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి.. ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎక్కడా చిరంజీవి పేరు ప్రస్థావించకుండానే.. కౌంటర్ ఇచ్చారు! దీంతో వ్యవహారం మరింత ముదురుతుందా.. లేక, ఇది ఫినిషింగ్ టచ్చా అనే సందేహాలు మొదలవుతున్నాయి.

"సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు. ఫిలిం స్టార్స్‌ అయినా పొలిటిషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే. వాళ్ళూ మనుషులే. వారి గురించి మీకెందుకు, వీరి గురించి ప్రభుత్వానికి ఎందుకంటే కుదరదు. వారి యోగక్షేమాల పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది" అని సాయిరెడ్డి స్పందించారు.

దీంతో... పిచ్చుకమీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీపై పడతారెందుకు అనే వ్యాఖ్యలకు ఇవి కౌంటర్ అనే కామెంట్లు పడుతున్నాయి. ప్రభుత్వానికి ఒక ఇండస్ట్రీపై బాధ్యత ఉంటుంది.. మరో ఇండస్ట్రీపై ఉండదు.. అదేదో స్వతంత్రప్రతిపత్తి కలిగిన సంస్థలా వ్యవహారాలు నడిపిస్తే కుదరదు అన్నట్లుగా సాయిరెడ్డి స్పందించారని అంటున్నారు.

ఇదే సమయంలో... "కొందరు సినిమా హీరోలు పాపం చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొంటూ, వీలయితే ఉచితంగా నటిస్తూ... లక్షలాది డైలీ వేజ్ సినీ కార్మికులను బతికిస్తున్నారు. కళామతల్లిపై ప్రేమతో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. తలసరి ఆదాయం, స్థూల రాష్ట్ర ఉత్పత్తి వృద్ధి కోసం అహర్నిశలూ చెమటోడుస్తున్నారు. అలాంటి వారికి హాట్సాఫ్" అంటూ సాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.

దీంతో... కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటూ.. వారు మాత్రం కంఫర్ట్ గా ఉంటూ... కార్మికుల గురించి ఆలోచించలేని స్టార్ హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారని సాయిరెడ్డి చెప్పినట్లయ్యిందని అంటున్నారు పరిశీలకులు. అనంతరం... తాను రాజ్యసభలో మాట్లాడిన విషయాలపై కొంతమంది భుజాలు తడుముకుంటున్నారంటూ మరో ట్వీట్ చేశారు.

"సినిమాటోగ్రాఫ్ బిల్లుపై పార్లమెంట్లో మాట్లాడితే కోట్లకు పడగెత్తిన కొందరు హీరోలు భుజాలు తడుముకుంటారు ఎందుకో మరి! సినిమా పైరసీని అరికట్టడం ఎంత అవసరమో, సినీ కార్మికుల సంక్షేమం, సినీ పరిశ్రమలో పనిచేసే మహిళల భద్రత కూడా అంతే ముఖ్యం. ఉన్నమాటంటే ఉలుకెందుకు?" అంటూ మరొక ట్వీట్ చేశారు. దీంతో... ఈ ట్వీట్ అయితే మరింత డైరెక్ట్ గానే వేశారని అంటున్నారు!

కాగా... వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజులు వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. "యాక్టర్ల రెమ్యూనిషన్‌ పై ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడతాయి. పిచ్చుకలు మీద బ్రహ్మాస్త్రంగా ఫీల్మ్ ఇండస్ట్రీ పైన పడతారేంటి. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, ఉద్యోగ - ఉపాధి అవకాశల‌ గురించి ఆలోచించాలి, పేదవారి కడుపు నింపే ఆలోచనలు చేయ‌లి" అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే దీని పూర్తి వెర్షన్ వింటే విషయంలో మరోలా కన్వే అవుతుంది! అందులో... హీరోల రెమ్యునరేషన్ గురించి పెద్దల సభలో మాట్లాడుతున్నారని ఆయన ఇండైరెక్ట్ గా విజయసాయిరెడ్డి ప్రసంగాన్ని ప్రస్తావించారు. దేశంలో ఇక ఏ సమస్యా లేనట్లుగా కేవలం హీరోల రెమ్యునరేషన్ పైన పెద్దల సభలో ప్రస్థావించడమేంటి ఆయన అసహనం వ్యక్తం చేశారు.

చేతనైతే సినిమాకు చేయూతను ఇవ్వండి అంతే కానీ రెమ్యునరేషన్లు అంత ఎందుకు అని కామెంట్స్ చేయడమేంటి అని ఫైర్ అయ్యారు. హీరోలకు మార్కెట్ ఉంటేనే రెమ్యునరేషన్ ఇస్తారని చిరంజీవి అన్నారు. అక్కడితో ఆపకుండా ఏపీకి ప్రత్యేక హోదా, రోడ్లు, ప్రాజెక్టుల గురించి కానీ మౌలిక సదుపాయాల గురించి కానీ పనిచేయాలని అన్నారు.

అయితే రెమ్యునరేషన్స్ గురించి మాత్రమే మాట్లాడి వదిలేస్తే దానికి అది విజయసాయిరెడ్డి గురించి మాత్రమే ప్రస్థావించినట్లు అయ్యేది. ఎప్పుడైతే ఏపీలో ప్రభుత్వానికి సూచనలిస్తున్నట్లుగా వీడియో విడుదలయ్యిందో.. చిరంజీవిపై వితౌట్ గ్యాప్ ఫైరయ్యారు వైసీపీ నేతలు, మంత్రులు! ఈ క్రమంలో తాజాగా చిరంజీవి పేరెత్తకుండా సాయిరెడ్డి ట్విట్టర్ లో ఈ వ్యాఖ్యలు చేశారు.