Begin typing your search above and press return to search.

విజయసాయిరెడ్డిని అంచనా వేయకపోవడమే వైసీపీ వైఫల్యమా?

వృత్తి రీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన విజయసాయిరెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అన్న విషయం అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 April 2025 6:06 AM
విజయసాయిరెడ్డిని అంచనా వేయకపోవడమే వైసీపీ వైఫల్యమా?
X

వి.విజయసాయిరెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు. వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డికి నమ్మిన బంటుగా రాజకీయాల్లోకి వచ్చిన విజయసాయిరెడ్డి ఆ పార్టీ ఆవిర్భావం నుంచి రెండు నెలల క్రితం వరకు రాజకీయాల్లో.. వైసీపీ కార్యక్రమాల్లో అత్యంత క్రియాశీలంగా పనిచేశారు. విజయసాయి లేనిదే వైసీపీ లేదన్నట్లు తన మార్కు చూపించారు. అదే సాయిరెడ్డి ఇప్పుడు వైసీపీకి కంట్లో నలుసులా తయారయ్యారు. తాను రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన క్షణంలో వైసీపీ ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించింది. విజయసాయిరెడ్డి స్థానం పార్టీలో ప్రత్యేకమంటూ కీర్తించింది. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి రివర్స్ అవ్వడంతో వైసీపీ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయిందనే టాక్ వినిపిస్తోంది. గట్టిగా విమర్శంచలేక, అదే సమయంలో మౌనంగా ఉండలేక సతమతమవుతోంది. అసలు విజయసాయిరెడ్డి విషయంలో వైసీపీ గందరగోళం ఎదుర్కొంటున్నదా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

వృత్తి రీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన విజయసాయిరెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. 2010లో జగన్ కాంగ్రెస్ అధిష్ఠానాన్ని దిక్కరించడమే కాకుండా, అవినీతి కేసుల్లో జైలుకు కూడా వెళ్లారు. ఈ కేసులో జగన్ ఏ1 కాగా, విజయసాయిరెడ్డిని ఏ2గా సీబీఐ గుర్తించింది. ఇక అక్కడి నుంచి ప్రతి విషయంలోనూ జగన్ తర్వాతి స్థానం విజయసాయిరెడ్డిదే అన్నట్లు ఆయన ప్రయాణం సాగింది. పార్టీలోనూ.. వైసీపీ ప్రభుత్వంలోనూ చాలావరకు విజయసాయిరెడ్డి మాటే వేదవాక్కుగా సాగిపోయింది. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నా, ఆయన గత ఎన్నికల్లో తప్పితే అంతకుముందు ఎన్నడూ ప్రజాక్షేత్రంలో తలపడలేదు. కానీ, అధిష్ఠానంలో పట్టు ఉండటంతో పార్టీని దిశానిర్దేశం చేసే అధికారం వైసీపీ విజయసాయికి అప్పగించింది. అయితే ఎద్దు ఎప్పుడూ ఒకవైపే పడుకోదు అన్నట్లు.. కొన్నేళ్లుగా విజయసాయికి పార్టీకి మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఎన్నికల అనంతరం ఆ అంతరం పూర్తిగా తెగేవరకు వెళ్లింది. రాజకీయాల నుంచి విజయసాయి నిష్క్రమించారు. ఆ సమయంలో విజయసాయి ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారనేది వైసీపీ పట్టించుకోలేదు.

కేసులు, వేధింపుల వల్లే విజయసాయి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని వైసీపీ సానుభూతి వ్యక్తం చేసింది. కానీ, ఆయన గూడుకట్టుకున్న అసంతృప్తిని గుర్తించలేకపోయిందని అంటున్నారు. అందుకే మార్చి నెలలో సీఐడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి పార్టీ అధిష్టానంపై విమర్శలు చేసేసరికి వైసీపీ శ్రేణులు అవాక్కయ్యాయి. ఇన్నాళ్లు తమ పార్టీలో నెంబర్ టుగా చెప్పుకున్న నేత రివర్స్ లో కోటరీ ఉందని, కొందరు చేతుల్లో అధినేత బంధీగా మారిపోయారని, జగన్ ప్రజల మధ్యకు రావాలని చెప్పడం ద్వారా వైసీపీని ఆత్మరక్షణలోకి నెట్టేశారని అంటున్నారు. మూడున్నరేళ్ల పదవీకాలం ఉండగానే రాజ్యసభ స్థానాన్ని వదిలేయడానికి కారణాలు, అంతకుముందు చోటుచేసుకున్న పరిణామాలపై అధిష్టానం ఫోకస్ చేయకపోవడం వల్లే పార్టీ పునాదులు కదిలించేలా విజయసాయిరెడ్డి ఇప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు.

తొలుత పార్టీలో కొందరు కోటరీగా ఏర్పడ్డారని ధ్వజమెత్తిన విజయసాయిరెడ్డి ఇప్పుడు లిక్కర్ స్కాంలో దొరికన దొంగలు, దొరకని దొంగలు బట్టలు విప్పేస్తానని బెదిరించడం చర్చకు దారి తీస్తోంది. అధినేత తర్వాత నెంబర్ 2గా చెలామనీ అయిన వ్యక్తి.. తన స్థానం రెండు వేలు అంటూ చెప్పి.. అధినేతకు తనకు మధ్య చాలా అంతరం ఉందని వ్యాఖ్యానించడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై వైసీపీలో ఎవరూ స్పందించకపోవడం కూడా రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. విజయసాయి చేస్తున్న నష్టాన్ని గుర్తించి సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి మాత్రమే ఎదురుదాడి చేశారు. సహజంగా ఇలాంటి పరిస్థితి ఇంకో పార్టీలో ఉంటే దిగువ స్థాయి నుంచి అధిష్టానం వరకు ముప్పేట దాడి చేస్తారని పరిశీలకులు చెబుతున్నారు. కానీ, వైసీపీలో ఎవరూ నోరు విప్పకపోవడం ఆ పార్టీ పరిస్థితి అద్దం పడుతోందని అంటున్నారు. పార్టీ అధికార ప్రతినిధులు కూడా ఈ విషయంపై మాట్లాడకపోవడంతో విజయసాయిరెడ్డి మరింత చెలరేగిపోయే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదైనా సరే విజయసాయిరెడ్డి వ్యూహాన్ని పసిగట్టలేకపోవడం ఓ విధంగా నష్టం చేకూరిస్తే.. ఇప్పుడు ఆయనను అదుపు చేయలేని పరిస్థితిలో మున్ముందు మరింత ముప్పు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.