విజయసాయిరెడ్డిని కెలికితే మామూలుగా ఉండదా |
విజయసాయిరెడ్డి బోర్న్ పొలిటీషియన్ కాదు. కానీ ఆయనకు రాజకీయం బాగా తెలుసు. వ్యూహాలలో కూడా ఆయన దిట్ట అని చెబుతారు.
By: Tupaki Desk | 22 May 2025 9:30 PMవిజయసాయిరెడ్డి బోర్న్ పొలిటీషియన్ కాదు. కానీ ఆయనకు రాజకీయం బాగా తెలుసు. వ్యూహాలలో కూడా ఆయన దిట్ట అని చెబుతారు. ఆయన దాదాపుగా తొమ్మిదేళ్ళ పాటు ఢిల్లీలో ఎంపీగా ఉండి ఎలా కేంద్ర స్థాయిలో తన పలుకుబడిని పెంచుకున్నారో చూస్తే కనుక ఆయన రాజకీయ చాణక్యం అర్ధం అవుతుంది. ఆయన కంటే కూడా వైసీపీలో మూడు సార్లు ఎంపీలు అయిన వారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి ఎంపీలుగా చేస్తూ వైసీపీలో చేరి పార్లమెంట్ కి వెళ్ళిన వారు ఉన్నారు.
మరి అందరికీ విజయసాయిరెడ్డి మాదిరిగా జాతీయ స్థాయిలో పలుకుబడి పరిచయాలు అంతగా ఎందుకు లేవు అంటే విజయసాయిరెడ్డి స్పెషల్ అనే చెప్పాలి. ఆయన రాజకీయ మేధావిగానూ చెప్పాలి. ఆయన గురించి వైసీపీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని కూడా అంటున్నారు.
ఆయన మూడు తరాలుగా వైఎస్సార్ కుటుంబంతో ఉన్నారు. అనూహ్యంగా ఈ ఏడాది మొదట్లోనే అన్ని బంధాలు తెంచుకుని బయటకు వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయినా ఈ రోజు దాకా జగన్ మీద హార్ష్ గా విమర్శలు చేసినది లేదు జగన్ గురించి మంచి మాటలే చెప్పారు అయితే వైసీపీలో ఉన్న లోపాలను కోటరీ గురించి మాత్రం ఆయన ప్రస్తావించారు.
ఇక లిక్కర్ స్కాం విషయంలో తనకు తెలిసిన విషయాలను చెబుతున్నాను అని అన్నారు. అందులో తప్పు ఉంటే విచారణలో నిందితులుగా ఉన్న వారు పునీతులుగా బయటకు రావచ్చు విజయసాయిరెడ్డిదే అంతిమ నిర్ణయం కాదు కదా అన్న మాట ఉంది.
అయితే జగన్ మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి మీద పరుషమైన వ్యాఖ్యలే చేశారు. ఆయన కూటమిని తన మూడున్నరేళ్ళ పదవిని తాకట్టు పెట్టారు అని అన్నారు. దాంతో పాటు ఆయన ఆ వైపు నిలబడ్డారు కాబట్టి ఆయన మాటలకు విలువ ఉండదని అన్నారు.
ఇలా విజయసాయిరెడ్డి మీద జగన్ చాలానే వ్యాఖ్యానించారు కూటమికి మేలు చేసేందుకే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు అని అన్నారు. సరే ఇక్కడ జగన్ చెప్పినదే నిజమని అనుకున్నా ఆయనకు కూటమి మీద ప్రేమ ఉందని భావించినా వైసీపీ మీద ఎందుకు ద్వేషం పుట్టిందో కూడా ఆలోచించుకోవాలి కదా.
విజయసాయిరెడ్డి ఏ వైపు ఉన్నారని కాదు ఆయన చెప్పిన విషయాలు మరీ ముఖ్యంగా పార్టీకి సంబంధించిన వాటిలో నిజాలు ఏమైనా ఉన్నాయా అన్నది చెక్ చేసుకోవాలి కదా అన్న మాట వినిపిస్తోంది. పోయిన వారు అందరూ చంద్రబాబు ఆకర్షితులు అని ఒక ముద్ర వేసేసి కూర్చుంటే వైసీపీ లోపాలను రిపేర్లు చేసుకునేదెలా అన్న చర్చ వస్తోంది.
మరో వైపు చూస్తే విజయసాయిరెడ్డి గమ్మున ఉన్నారు. ఆయన వైసీపీని వీడి అయిదు నెలలు గడచినా జగన్ మీదకు అయితే నేరుగా మాటల దాడి చేసింది లేదు. ఇపుడు జగన్ స్వయంగా పిలిచి ఆయనకు ఆ చాన్స్ ఇస్తున్నారా అన్నదే చర్చగా ఉంది. వైఎస్సార్ కుటుంబంతో మూడు తరాలు ఉన్న పెద్దాయన వైసీపీ పునాదుల నుంచి ఉన్న పెద్ద మనిషీ అయిన విజయసాయిరెడ్డి దగ్గర మ్యాటర్ చాలానే ఉంటుందని అంటున్నారు.
ఆయన కనుక వేరేగా ఆలోచిస్తే మాత్రం వైసీపీకే కాదు అధినాయకత్వానికి ఇబ్బందే అని అంటున్నారు. అధినాయకత్వం ఈ విషయం ఎంతవరకూ ఆలోచించుకుంది అన్నదే చర్చగా ఉంది. సరే విజయసాయిరెడ్డితో ఢీ అంటే ఢీ కొడదామని అనుకున్నా అది అంతిమంగా వైసీపీకి చేసే మేలు ఏమిటి అన్నది కూడా చర్చగా ఉంది. ఆయనకు పోయేది ఉండదు కానీ వైసీపీ మరో బలమైన కొత్త శతృవుని కోరి మరీ తెచ్చి పెట్టుకున్నట్లుగా ఉంటుందని అంటున్నారు రాజకీయాలు అంటేనే లెక్కలు. అవి బుర్రకు ఎక్కించుకోకపోయినా సరిగ్గా లెక్క వేసుకోకపోయినా ఇబ్బందులే వస్తాయని అంటున్నారు.