Begin typing your search above and press return to search.

విజయసాయిరెడ్డి ట్వీట్...ఇంకా చాలా విషయాలు ఉన్నాయట !

విజయసాయిరెడ్డి వైసీపీ పునాదుల నుంచి ఉన్న నాయకుడు, వైసీపీ దురదృష్టమో లేక ఆయన వ్యూహమో తెలియదు కానీ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు.

By:  Tupaki Desk   |   24 May 2025 6:32 AM
విజయసాయిరెడ్డి ట్వీట్...ఇంకా చాలా విషయాలు ఉన్నాయట !
X

విజయసాయిరెడ్డి వైసీపీ పునాదుల నుంచి ఉన్న నాయకుడు, వైసీపీ దురదృష్టమో లేక ఆయన వ్యూహమో తెలియదు కానీ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. నిజానికి ఏ రాజకీయ పార్టీలో అయినా పునాదుల నుంచి ఉన్న వారిని కోర్ కమిటీ మెంబర్స్ గా చూస్తారు. వారే పార్టీకి అసలైన బలాలు. వారు కనుక బయటకు పోతే పార్టీకే ఇబ్బందులు వస్తాయి. గట్టిగా చెప్పాలీ అంటే అసలుకే ఎసరు వస్తుంది.

అందుకే ఎవరూ కోర్ టీం మెంబర్స్ ని దూరం చేసుకోరు. అభిప్రాయ భేదాలు ఎన్ని ఉన్నా వాటిని ఏదో కాటికి సర్దుబాటు చేసుకుంటారు. కానీ వైసీపీలో మాత్రం అధినేత తీరే వేరు అన్నట్లుగా ఉంటుంది అని అంటారు. అందుకే మూలాలైన వారు, పార్టీతో పుట్టిన వారు కూడా కాడె వదిలేస్తున్నారు. అయితే అలా బయటకు వెళ్ళిన వారు అంతా గుట్టు విప్పుతారు.

కానీ ఇక్కడ వైసీపీకి కొంత లక్ కలసి వచ్చి విజయసాయిరెడ్డి దాదాపుగా మౌనంగానే ఉంటున్నారు. నన్ను కెలకద్దు అని ఆయన పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు కూడా. విజయసాయిరెడ్డితో పెట్టుకుంటే వైసీపీకి లాభం ఏమీ లేదు సరికదా ఎనలేని నష్టం వాటిల్లుతుంది. అయినా సరే తాజాగా జరిగిన ఒక మీడియా మీటింగులో జగన్ కోరి మరీ విజయసాయిరెడ్డిని కెలికారు.

ఆయన చంద్రబాబుకు తన మూడున్నరేళ్ల రాజ్యసభ పదవినీ తాకట్టు పెట్టారని పెద్ద మాటలే మాట్లాడారు. దానికి భారీ కౌంటర్ నే ట్వీట్ చేస్తూ విజయసాయిరెడ్డి ఇచ్చారు చంద్రబాబుకు అమ్ముడు పోయారు అన్నది పెద్ద ఆరోపణ. దాంతో విజయసాయిరెడ్డి రెస్పాండ్ అవుతూ తాను ఏ ప్రలోభాలకూ లొంగే వాడిని కాను అని స్పష్టం చేశారు. అంతే కాదు తాను ఎవరికీ భయపడను అని కూడా చెప్పారు.

తనకు మూడు దశాబ్దాలుగా రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో అనుబంధం ఉంది అని చెప్పారు అయితే ముఖ్యమంత్రి పదవి వచ్చాక జగన్ పూర్తిగా మారిపోయారు అని విజయసాయిరెడ్డి భారీ ఆరోపణ చేశారు. మద్యం కేసు విషయాన్ని ప్రస్తావిస్తూ కర్త కర్మ క్రియ అందులో పూర్తిగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డే అని కుండ బద్దలు కొట్టారు. ఈ కేసుకు సంబంధించి భవిష్యత్తులో ఇంకా చెప్పాల్సి వస్తే చెబుతాను అని వైసీపీ అధినాయకత్వానికి షాక్ ఇచ్చేలా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.

అంటే తన దగ్గర ఇంకా చాలా మ్యాటర్ ఉందని ఆయన అంటున్నారు. మరో వైపు చూస్తే కనుక విజయసాయిరెడ్డి ఈ రోజుకీ వైఎస్సార్ రక్తంగా జగన్ ని చూస్తున్నారు. ఆయన మీద అభిమానం చూపిస్తున్నారు అని అర్ధం అవుతోంది. అంతే కాదు జగన్ తన మీద నేరుగా ఆరోపణలు చేసినా ఆయన కసిరెడ్డి రాజశేఖర్ వద్దనే ఆగిపోతున్నారు.

ఆయన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మీదనే ఆరోపణలకు పరిమితం అవుతున్నారు. జగన్ తన మీద చేస్తున్న ఆరోపణలు ఆపేందుకు విజయసాయిరెడ్డి ఆయనకు ఇంకా ఒక చాన్స్ ఇచ్చారని అంటున్నారు. అది వైఎస్సార్ మీద విజయసాయిరెడ్డికి ఉన్న అభిమానంతోనే అని అంటున్నారు.

ఇలా డిప్లమాటిక్ గానే విజయసాయిరెడ్డి రియాక్ట్ అయ్యారని అంటున్నారు. అదే కనుక జగన్ మీద కోపం ఉంటే ఆయన అన్న మాటలకు ఆగ్రహం చెందితే విజయసాయిరెడ్డి ట్వీట్ వేరే లెవెల్ లో ఉండేదని అంటున్నారు. ఏది ఏమైనా విజయసాయిరెడ్డిని కెలకడం జగన్ తో పాటు వైసీపీ నేతలు మానుకుంటేనే మేలు అని అంటున్నారు. అన్నీ తెలిసిన అపర బ్రహ్మలా విజయసాయిరెడ్డి ఉన్నారు. ఆయనతో పెట్టుకుంటే ఇబ్బంది పడేది కచ్చితంగా వైసీపీయే అని అంటున్నారు. సో విజయసాయిరెడ్డి ట్వీట్ చూసిన వారు జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేసినా ఆయన చాలానే తగ్గారని అంటున్నారు. చూడాలి మరి ఇక మీదట వైసీపీ అధినాయకత్వం ఎలా రియాక్టు అవుతుందో.