విజయసాయి కాదు విధేయ సాయి
అవును ఆయన వీర విధేయుడి కిందకే లెక్క. ఆయన వైఎస్సార్ కుటుంబానికి వీర విధేయుడు.
By: Tupaki Desk | 31 May 2025 7:04 AMఅవును ఆయన వీర విధేయుడి కిందకే లెక్క. ఆయన వైఎస్సార్ కుటుంబానికి వీర విధేయుడు. వైఎస్ రాజారెడ్డి నుంచి వైఎస్సార్ నుంచి జగన్ దాకా మూడు తరాల మనుషులతో పనిచేయడం ఎంతో కష్టమైన క్లిష్టమైన ప్రక్రియ. వరసకు ఆ ముగ్గురూ తాత తండ్రి మనవడు అయినా ముగ్గురు మధ్య ఎన్నో వ్యత్యాసాలు ఉంటాయి. వాటిని అన్నీ చూసి వారితో సుదీర్ఘ కాలం ప్రయాణం చేసిన విజయసాయిరెడ్డి లాంటి వారు అరుదుగా ఉంటారు.
సరే ఆయనకు ఇబ్బంది కలిగి జగన్ నుంచి వేరు పడ్డారు. అయితే ఆయన తాజాగా చేసిన ఒక ట్వీట్ చూస్తే ఆయన పేరు విధేయ సాయిగా చెప్పవచ్చేమో అనిపిస్తోంది. తాజా ట్వీట్ లో విజయసాయిరెడ్డి ఒక మాట అన్నారు. తాను జగన్ కి హాని తలపెట్టే పని ఏదీ చేయబోను అని. జగన్ గురించి తాను పల్లెత్తి వ్యతిరేకంగా మాట్లాడింది లేదని చెప్పారు.
తాను జగన్ అరెస్టు ఫలానా రోజు జరుగుతుందని సన్నిహితులతో జోస్యం చెప్పినట్లుగా గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తల పట్ల ఆ తరహా ప్రచారం పట్ల విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తాను జగన్ కి వ్యతిరేకంగా ఎపుడూ ఎక్కదా చెప్పలేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
తనకు తేడా వచ్చింది జగన్ కోటరీతోనే అని ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను జగన్ కి హాని కలిగించే పనులు ఇప్పటిదాకా చేయలేదు, ఎపుడూ చేయను అని ఖండితంగా చెప్పారు. ఇక తాను రాజకీయాల్లో లేనని అందువల్ల తనకు ఏ నాయకుడితోనూ వ్యక్తిగతంగా విభేదాలు లేవని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
మొత్తం మీద విజయసాయిరెడ్డి చెప్పేది ఏంటి అంటే జగన్ మీద తాను ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని, ఇక ముందు చేయబోమని. నిజానికి విజయసాయిరెడ్డి ఎపుడూ జగన్ పట్ల అదే గౌరవం అభిమానం చూపిస్తూనే వచ్చారు. జగన్ గారూ అనే మీడియాతో మాట్లాడుతూ ఉండేవారు. అంతే కాదు జగన్ కి తన లాంటి వారు ఎంత మంది పార్టీ నుంచి బయటకు వెళ్ళినా నష్టం లేదని కూడా చెప్పారు.
జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారు అన్న ఆశాభావం వ్యక్తం చేస్తూనే వచ్చారు. అయితే జగన్ వైపు నుంచి చూస్తే ఆయన ఇటీవల విజయసాయిరెడ్డి అమ్ముడుపోయారు అని ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఆయన పదవిని తాకట్టు పెట్టారని కూడా ఫైర్ అయ్యారు. ఆయన వైసీపీకి నష్టం చేకూర్చారు అని కూడా అన్నారు.
మరి విజయసాయిరెడ్డి మాత్రం తనను కెలికి జగన్ కి నష్టం కలిగించాలని జగన్ కోటరీ చూస్తోందని మాత్రమే అన్నారు. దీనిని బట్టి చూస్తే జగన్ విషయంలో విజయసాయిరెడ్డి ఏ మాత్రం తొందరపడదలచుకోలేదనే అంటున్నారు. అయితే ఆయనను కెలికితే మాత్రం ఏమి జరుగుతుందో కూడా తెలియదు అని అంటున్నారు. ఎందుకంటే పరిణామాలు ఎపుడూ ఎవరి చేతులలో ఉండవు కాబట్టి. ఇక విజయసాయిరెడ్డి నుంచి ఈ తరహా ట్వీట్ వచ్చింది కాబట్టి ఆయన విషయం వైసీపీ మరచిపోవడమే మేలు అని అంటున్నారు. అయితే కోటరీ ఏమి చేస్తుంది అన్నదే ఇపుడు ఆసక్తికరంగా ఉంది.