Begin typing your search above and press return to search.

ఆ ప్రకటనతో సంబంధం లేదంటున్న విజయసాయిరెడ్డి

మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేరిట వచ్చిన ప్రకటనలపై ఆయన వివరణ ఇచ్చారు.

By:  Tupaki Desk   |   24 May 2025 9:49 AM
ఆ ప్రకటనతో సంబంధం లేదంటున్న విజయసాయిరెడ్డి
X

మాజీ ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేరిట వచ్చిన ప్రకటనలపై ఆయన వివరణ ఇచ్చారు. ఆ ప్రకటనలకు తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను ఏది చెప్పాలని అనుకున్నా అధికారిక 'ఎక్స్'ఖాతాలోనే చెబుతానన్నారు. జగన్ వ్యాఖ్యలను తాను ఖండిస్తూ పత్రికా ప్రకటనలో ఇచ్చానంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తన ఎక్స్ అకౌంటులో ఈ మేరకు ట్వీట్ చేశారు.

‘‘నా పేరు మీద సర్క్యులేట్ అవుతున్న పత్రికా ప్రకటన విషయం మీడియాలో కొందరు మిత్రుల ద్వారా తెలిసింది. ఆ ప్రకటన నాది కాదు. నేను చేసిన, చేయబోయే పత్రికా ప్రకటనలు నా అధికారిక 'ఎక్స్' ఖాతా ద్వారా మాత్రమే వెలువడతాయి . గమనించగలరు.’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి తన మూడున్నరేళ్ల ఎంపీ పదవిని వదులుకుని ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమ్ముడుపోయారంటూ రెండు రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి జగన్ విమర్శించిన విషయం తెలిసిందే. దీనిపై విజయసాయిరెడ్డి స్పందించి జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు శనివారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

‘‘నేను ప్రలోభాలకు లొంగను.. ఎవరికీ భయపడను. నా వ్యక్తిత్వం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. మూడు దశాబ్దాలుగా నాకు రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో అనుబంధం ఉంది. పదవి వచ్చాక నువ్వే మారిపోయావు.’’ అంటూ జగన్ ను ఉద్దేశించి విజయసాయిరెడ్డి విమర్శలు చేసినట్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. అయితే ఈ ప్రకటన మాత్రం విజయసాయిరెడ్డి ట్విటర్ అకౌంటులో కనిపించలేదు. దీంతో ఆయన సన్నిహితులు విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు చెబుతున్నారు.

తాను చేయని ప్రకటన తనపేరుతో సర్క్యులేట్ అవడంపై విజయసాయిరెడ్డి స్పందించారు. తాను ఏది చెప్పాలన్నా తన అధికారిక ట్విటర్ అకౌంటు ద్వారానే చెబుతానని స్పష్టం చేశారు. దీంతో ఉదయం నుంచి జగన్ కు విజయసాయిరెడ్డి కౌంటరు ఇచ్చారంటూ జరుగుతున్న ప్రచారం ఫేక్ గా తేలిపోయింది. అయితే విజయసాయిరెడ్డి పేరుతో ఆ ప్రకటన ఎవరు తెరపైకి తెచ్చారనేది చర్చకు దారితీస్తోంది.

గత కొంతకాలంగా వైసీపీ అధినేత జగన్ పై విజయసాయిరెడ్డి వ్యతిరేకతతో ఉన్నారు. ఆయన చుట్టూ ఉన్న కోటరీ వల్ల తనకు స్థానం లేకపోయిందన్న ఆవేదనతో వైసీపీకి రాజీనామా చేశారు. ఏకంగా రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో లిక్కర్ స్కాంపై జరుగుతున్న దర్యాప్తులో ప్రభుత్వానికి విజయసాయిరెడ్డి సహకరిస్తు వైసీపీ నేతలను ఇరికించేలా కీలక సమాచారం ఇస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ తన పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డిపై విమర్శలు చేశారని అంటున్నారు.