Begin typing your search above and press return to search.

భారత్ - పాక్ యుద్ధంపై జోస్యం... ఇది వేణుస్వామికే సాధ్యం!

ఓ పక్క భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తత నెలకొన్న వేళ.. ఈ రెండు దేశాల మధ్య "యుద్ధం వస్తుందని" తాను ముందే చెప్పానని చెబుతూ వేణుస్వామి ఓ వీడియో విడుదల చేశారు.

By:  Tupaki Desk   |   10 May 2025 5:52 PM IST
Venu Swamys 2025 Prediction Goes Viral: India Will Destroy 80% of Pakistan?
X

ఓ పక్క భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తత నెలకొన్న వేళ.. ఈ రెండు దేశాల మధ్య "యుద్ధం వస్తుందని" తాను ముందే చెప్పానని చెబుతూ వేణుస్వామి ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో తన పాతవీడియో ప్రదర్శించిన ఆయన.. 2025 ఉగాదికి పది రోజుల ముందు తాను ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగిందని చెబుతూ ఆ వీడియోలో బైట్ ని ప్రదర్శించారు.

ఆ వీడియోలో స్పందించిన వేణుస్వామి... 'జనాల మధ్య గొడవలు "అవ్వొచ్చు", రాష్ట్రాల మధ్య గొడవలు "అవ్వొచ్చు", దేశాల మధ్య గొడవలు "అవ్వొచ్చు", ముఖ్యమంత్రుల మధ్య గొడవలు "అవ్వొచ్చు", యుద్ధ వాతావరణం "రావ్వొచ్చు", యుద్ధమే "జరగొచ్చు", పాకిస్థాన్ కు మనకూ యుద్ధమే "జరగొచ్చు" ' అని అన్నారు.

ఈ వీడియో బైట్ అక్కడితో కట్ చేసిన ఆయన... 'చూశారు కదా! నాకు తెలిసి పాకిస్థాన్ కు ఇండియాకు యుద్ధం "వస్తుంది" అని ఇంత “క్లియర్” గా చెప్పింది నేను ఒక్కడినే’ అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో... 2025 నుంచి 2032 లోపు పాకిస్థాన్ లో 80శాతం వరకూ నాశనం అయ్యే "అవకాశం ఉంది" అని అన్నారు.

ఇదే సమయంలో.. ‘మోడీది అనురాధ నక్షత్రం, వృషభ రాశి అని.. పాకిస్థాన్ ప్రధానిది ఆరుద్ర నక్షత్రం, మిథున రాశి అని.. అందువల్ల వీరిద్దరి మధ్య రాశుల కారణంగా షష్టాష్టక దోషము ఉందని.. అంటే, ఇద్దరికీ ఎప్పుడూ పడదని, వీళ్లిద్దరిదీ గొడవలకు దిగే కాంబినేషన్’ అని వేణుస్వామి చెప్పుకొచ్చారు.

ఈ కారణాల వల్ల 2025 మే 30 నుంచి 2032 వరకూ పాకిస్థాన్ దేశం 80 శాతం నాశనం అయిపోతుందని.. ఈ విషయాన్ని అండర్ లైన్ చేసుకోవాలని స్వామి నొక్కి చెప్పారు. అనంతరం.. ప్రస్తుతం మహాభారత యుద్ధ కాలంలో ఉన్న గ్రహాల కలయిక ఉన్నందు వల్ల.. దీని ఫలితంగా పాకిస్థాన్ ను 80% నాశనం చేసెటువంటి "అవకాశం ఉంటుంది" అని వేణుస్వామి తెలిపారు.

ఇదే క్రమంలో... ప్రపంచ వ్యాప్తంగా చాలా సంచలనాలు ఉంటాయని మొదలుపెట్టిన ఆయన... అతిముఖ్యమైనటువంటి పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద సినిమా నటుల మరణం అనేది సంభవించే "అవకాశం ఉంది".. అలాగే ఇతర దేశాల్లో కూడా యుద్ధ వాతావరణం ఉంటుంది.. ఆర్థిక మధ్యం ప్రపంచాన్ని అతలాకుతలం చేసే “అవకాశం ఉంది”.. ప్రకృతి వైపరిత్యాలు చాలా ఎక్కువగా ఉండెటువంటి “అవకాశం ఉంది” అని తెలిపారు!

దీంతో... ఇండియా పాకిస్థాన్ యుద్ధం జరగొచ్చు.. జనాలు పోవచ్చు.. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పోవచ్చు.. హీరోలు పోవచ్చు.. ఆర్ధిక మాంద్య రావొచ్చు.. ప్రకృటి విపత్తులు ఎక్కువగా ఉండొచ్చు.. అంటూ ఇలాంటి జోస్యం చెప్పడం వేణుస్వామికి మాత్రమే సాధ్యమని, ఇలా చెప్పడం చిన్నవిషయం కాదని, దానికి చాలా అన్నుభవం అవసరమని ఆయన అభిమానులు స్పందిస్తున్నారు.

ఇదే సమయంలో... పాక్ లో 40% బలుచిస్తాన్ ఆక్రమించుకుని.. పీఓకే ను భారత్ తిరిగి తీసుకుని.. సింధూ నదీ జలాలను అడ్డుకున్న కారణంగా పాక్ లోని సుమారు 16 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమిలో చాలా వరకూ పోవచ్చు.. ఇవన్నీ కలిపితే పాకిస్థాన్ “80% వరకూ” నాశనం అయ్యే అవకాశం ఉందని చెప్పడం చిన్న విషయం కాదని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు!

ఇక, ప్రపంచ వ్యాప్తంగా "పెద్ద పెద్ద" నాయకులంటే సుమారు 60 - 70 ఏళ్లు పైబడిన వారే ఉంటారని.. 70 - 80 ఏళ్లు దాటిన "పెద్ద" నటులు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఉన్నారని అలాంటి వారిలో ఎవరొకరు మరణించడం సహజమని.. కానీ వారి మరణానికి ముందే ఇలా గ్రహించి చెప్పడం చిన్న విషయం కాదని చెబుతున్నారు!

ఇక ఇప్పటికే రష్యా – ఉక్రెయిన్ వార్... ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం నడుస్తున్న వేళ... ప్రపంచంలో ఇతర దేశాల మధ్య కూడా యుద్ధ వాతావరణం ఉండోచ్చని చెప్పడం కూడా అంత ఈజీ అయిన విషయం కాదని.. అది వేణుస్వామికి మాత్రమే సొంతమని, సాధ్యమని ఆయన అభిమానులు చెబుతున్నారు.. హర్షం వ్యక్తం చేస్తున్నారు!