వారణాసి అత్యాచార ఘటనపై మోదీ ఆరా: నిందితులపై కఠిన చర్యలకు ఆదేశం
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సొంత నియోజకవర్గం యూపీలోని వారణాసి. వరుసగా మూడు సార్లు ఆయ న విజయం దక్కించుకున్నారు.
By: Tupaki Desk | 11 April 2025 8:23 AMఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఇటీవల వెలుగుచూసిన దారుణ సామూహిక అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. కేవలం ఆరు రోజుల్లో ఏకంగా 23 మంది వ్యక్తులు కలిసి 19 ఏళ్ల యువతిపై అమానుషంగా అత్యాచారానికి పాల్పడిన ఈ ఘటన ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి చేరడంతో ఆయన వెంటనే స్పందించారు.
శుక్రవారం వారణాసిలో పర్యటించిన మోదీ, ఉదయం అక్కడ దిగిన వెంటనే జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, డివిజనల్ కమిషనర్లతో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.
ఈ నెల 29వ తేదీన బాధిత యువతి తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్లగా, తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ దారుణ సామూహిక అత్యాచారం విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, కొందరు యువకులు ఆమెను పలు హోటళ్లకు, హుక్కా బార్లకు తిప్పుతూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో పోలీసులు తక్షణమే స్పందించి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటివరకు తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించగా, వారిని న్యాయమూర్తి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
మరోవైపు, వారణాసి పర్యటనలో భాగంగా జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 70 ఏళ్లు పైబడిన ముగ్గురు లబ్ధిదారులకు ఆయన ఆయుష్మాన్ కార్డులను స్వయంగా అందజేశారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘కాశీ నాది.. నేను కాశీకి చెందినవాడిని’’ అని తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
వారణాసి ప్రధాని మోదీ సొంత నియోజకవర్గం కావడం విశేషం. ఆయన 2014 నుంచి ఇప్పటివరకు మూడుసార్లు ఇక్కడి నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. తన సొంత నియోజకవర్గంలో జరిగిన ఈ దారుణ ఘటనపై మోదీ తక్షణమే స్పందించడం, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం గమనార్హం. ఈ ఘటన బాధితురాలికి న్యాయం జరుగుతుందని, భవిష్యత్తులో ఇలాంటి నేరాలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ప్రజలు ఆశిస్తున్నారు.