Begin typing your search above and press return to search.

వందే భారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ లో మంటలు... తృటిలో తప్పిన పెనుప్రమాదం!

పొగలు వస్తోన్న విషయాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది

By:  Tupaki Desk   |   17 July 2023 7:03 AM GMT
వందే భారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ లో మంటలు... తృటిలో తప్పిన పెనుప్రమాదం!
X

గతకొంతకాలంగా వరుసగా రైలు ప్రమదాలకు సంబంధించిన వార్తలు ఆందోళనకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తాజాగా మరోసారి రైలు భోగీలో మంటలు చెలరేగిన సంఘటన తెరపైకి వచ్చింది. మంటలు వ్యాపించిన కోచ్ లో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది.

అవును... మ‌ధ్యప్రదేశ్ రాజ‌ధాని భోపాల్ నుంచి ఢిల్లీ బ‌య‌ల్దేరిన వందే భార‌త్ ఎక్స్‌ ప్రెస్‌ లో సోమ‌వారం ఉద‌యం అగ్నిప్రమాదం సంభ‌వించిందని తెలుస్తుంది. కుర్వాయి కేథోరా రైల్వే స్టేష‌న్ వ‌ద్ద ఉద‌యం 8 గంట‌ల‌కు వందే భార‌త్‌ లోని ఓ కోచ్‌ లో మంట‌లు చెల‌రేగాయని సమాచారం. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురవ్వగా... అధికారులు అప్రమత్తమవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని తెల్లుస్తుంది.

వివరాళ్లోకి వెళ్తే... రాణి కమలాపతి - హజ్రత్‌ నిజాముద్దీన్‌ వందే భారత్‌ రైలు సోమవారం తెల్లవారుజామున 5.40 గంటల ప్రాంతంలో భోపాల్‌ నుంచి బయల్దేరిందని తెలుస్తుంది. ఈ సమయంలో ఉదయం 6.45 గంటల ప్రాంతంలో సీ-12 బోగీ చక్రాల్లో నుంచి పొగలు రావడాన్ని రైల్వే సిబ్బంది గుర్తించారని అంటున్నారు.

ఇలా పొగలు వస్తోన్న విషయాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది.. వెంటనే రైలును విదిశ జిల్లాలోని కుర్వాయ్‌ - కేథోరా స్టేషన్ల మధ్య నిలిపివేసి తనిఖీ చేశారట. ఈ తనిఖీల్లో బ్యాటరీ బాక్సుల్లో మంటలు చెలరేగినట్లు తెలిసిందట. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే ప్రయాణికులను దించేశారట. అనంతరం అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారని తెలుస్తుంది.

అయితే ఈ విషయాలపై స్పందించిన రైల్వే అధికారులు ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు వెళ్లడించారని తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారని సమాచారం. ఘటన సమయంలో సీ-12 బోగీలో ఉన్న 36 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని చెబుతున్నారు.

ఈ సందర్భంగా ఏర్పడిన మంటలు బ్యాటరీ బాక్స్‌ కు మాత్రమే పరిమితమయ్యాయని.. తగిన సమయంలో గుర్తించడం వల్ల వాటిని పూర్తిగా అదుపు చేసినట్లు అధికారులు చెబుతున్నారని తెలుస్తుంది.