Begin typing your search above and press return to search.

వంశీ విడుదల ఇప్పట్లో లేనట్లే!? ఊహించని షాకిచ్చిన పోలీసులు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కిడ్నాప్ కేసులో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 May 2025 6:26 PM IST
వంశీ విడుదల ఇప్పట్లో లేనట్లే!? ఊహించని షాకిచ్చిన పోలీసులు
X

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కూటమి ప్రభుత్వ పెద్దల ఆగ్రహం ఇంకా చల్లారలేదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే 90 రోజులకు పైగా రిమాండు ఖైదీగా జైలులో ఉన్న వంశీని మరికొన్నాళ్లు నిర్బంధంలోనే ఉంచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనకు నేడో రేపో బెయిలు వస్తుందని అనుకుంటున్న సమయంలో పోలీసులు మరో కేసు బయటకు తీశారు. హనుమాన్ జంక్షన్ పోలీసుస్టేషను పరిధిలో నమోదైన కేసులో ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పీటీ వారెంటు దాఖలు చేశారు. దీనిని న్యాయస్థానం అనుమతిస్తే వంశీకి బెయిల్ వచ్చినా ఈ కేసులో మళ్లీ జైలుకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కిడ్నాప్ కేసులో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 13న హైదరాబాదులో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ తర్వాత వరుస కేసులు తెరపైకి తెచ్చి మాజీ ఎమ్మెల్యేను రిమాండ్ పై రిమాండ్ విధించేలా వ్యవహరించారని చెబుతున్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసుతోపాటు ఫిర్యాదుదారు సత్యవర్థన కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఇలా మొత్తం ఆరు కేసులు వంశీపై ఉండగా, ఐదు కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరైంది. ఇంకా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనకు బెయిల్ లభించాల్సివుంది. దీనిపై శుక్రవారం వాదనలు జరిగే అవకాశం ఉండగా, గురువారం మరో పీటీ వారెంటు జారీ చేయడం గమనార్హం.

దీంతో వంశీపై కూటమి ప్రభుత్వ పెద్దల ఆగ్రహం చల్లారలేదనేనది స్పష్టమవుతోందని అంటున్నారు. జైలులో మూడు నెలల నుంచి ఉన్న వంశీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. బాగా నీరసించిపోయి, బరువు తగ్గి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయనకు కోర్టుల్లో ఎలాంటి ఉపశమనం దక్కడం లేదు. దీంతో రిమాండులోనే జైలులో కఠిన వేధన అనుభవిస్తున్నారని అంటున్నారు. ఇక పెండింగులో ఉన్న ఏకైక కేసులో బెయిల్ వస్తుందని వంశీ కుటుంబ సభ్యులు, అనుచరులు ఆశిస్తున్న సమయంలో పోలీసులు ఝలక్ ఇచ్చారు.