Begin typing your search above and press return to search.

మిగ్ 21 కెప్టెన్ ఉత్తమ్ రిపోర్టింగ్ సర్.. మన మంత్రి ఫైటర్ జెట్ పైలట్

ఇదే నేపథ్యంలో చూస్తే తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సైన్యం తరఫున యుద్ధానికి వెళ్తానని అంటున్నారు.

By:  Tupaki Desk   |   10 May 2025 3:06 PM IST
Telangana Minister Uttam Kumar Reddy Ready to Return to Battlefield
X

మిగ్ 21, మిగ్ 23... రష్యా డిజైన్డ్ ఫైటర్ జెట్లు.. మిగ్ 21 సూపర్ సోనిక్ ఇంటర్ సెప్టర్. సింగిల్ ఇంజిన్ ఫైటర్. దాడులు చేయడంతో పాటు గాల్లోంచి గాల్లోనే శత్రు విమానాలను కూల్చేసే ఫైటర్ జెట్ అన్నమాట. మిగ్ -23 అనేది వేరియబుల్ స్వీప్ వింగ్ ఫైటర్. ఇది గ్రౌండ్ అటాక్- వైమానిక దాడి రెండింట్లోనూ వినియోగిస్తారు. మిగ్ మెరుపు వేగం దీని సొంతం.

తెలుగు రాష్ట్రాల్లో బహుశా ఈ రెండు యుద్ధ విమానాలను నడిపిన ఏకైక వ్యక్తి తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయి ఉంటారు. రాజకీయాల్లోకి రాక పూర్వం యుద్ధ విమాన పైలట్ ఈయన. రాష్ట్రపతి భవన్ రక్షణ అధికారిగానూ పనిచేశారు.

తాజాగా పాకిస్థాన్ తో యుద్ధం నేపథ్యంలో టెరిటోరియల్ ఆర్మీ సేవలను కూడా వాడుకునేలా ఆర్మీ చీఫ్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ప్రాదేశిక సైన్యంగా భావించే వివిధ రంగాల్లో ఉన్నవారు యుద్ధంలోకి వెళ్లే అవకాశం వచ్చింది. అంటే.. సైన్యంలో గతంలో పనిచేసినవారు, గౌరవ హోదాలు పొందినవారు యుద్ధంలో పాల్గొనవచ్చు అన్నమాట.

ఇదే నేపథ్యంలో చూస్తే తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సైన్యం తరఫున యుద్ధానికి వెళ్తానని అంటున్నారు. పాకిస్థాన్‌ తో పూర్తిస్థాయి యుద్ధం జరిగితే.. తన అవసరం ఉందని ఆర్మీ భావించి పిలిస్తే తప్పకుండా పాల్గొంటానని తెలిపారు. ఉత్తమ్ 20 ఏళ్ల వయసులోనే.. అంటే 1982లోనే రక్షణ విభాగంలో చేరారు. యుద్ధ విమానాలను నడపడంలో తర్ఫీదు పొందారు. రాష్ట్రపతి భవన్ రక్షణ అధికారిగానూ పనిచేశారు.

1990ల మొదట్లో రాజకీయాల్లోకి వచ్చిన ఉత్తమ్.. 1994 ఎన్నికల్లో కోదాడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 1999, 2004లో గెలుపొందారు. 2009, 2014, 2018, 2023లో హుజూర్ నగర్ నుంచి విజయం సాధించారు. మధ్యలో 2019లో నల్లగొండ ఎంపీగానూ నెగ్గారు. తాజా యుద్ధం నేపథ్యంలో మళ్లీ సైన్యంలోకి వెళ్తానని ఉత్తమ్ అంటున్నారు. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ ను స్వాధీనం చేసుకోవడమే పాకిస్థాన్‌ తో సమస్యకు శాశ్వత పరిష్కారం అని కూడా చెబుతున్నారు. యుద్ధం అంటూ జరిగితే పాకిస్థాన్‌ పతనం ఖాయమని.. మన త్రివిధ దళాలు ప్రదర్శిస్తున్న ధైర్య సాహసాలు అద్భుతం అని కొనియాడారు.