మాజీ మంత్రి.. డబుల్ గేమ్.. !
ఇలాంటి వారిలో అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఉష శ్రీచరణ్ సీమలో ముందున్నారట.
By: Garuda Media | 6 April 2026 4:00 PM ISTవైసీపీకి చెందిన పలువురు నాయకులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. వారికి నియోజకవర్గాల విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఒక నియోజకవర్గంలో ఒక కాలు.. మరో నియోజకవర్గంలో మరో కాలు వేసి.. పార్టీ అధిష్టానం నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. ఒకరకంగా.. వారికి మనసొక చోట.. తనువొక చోట అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఇలాంటి వారిలో అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఉష శ్రీచరణ్ సీమలో ముందున్నారట.
2019 ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసిన ఉష.. వైసీపీ తరఫున కల్యాణదుర్గం నియోజకవర్గం నుంచి తొలిసారి విజయం దక్కించుకున్నారు. ఆ తర్వాత.. జగన్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. కురబ సామాజిక వర్గానికి చెందిన బీసీ మహిళా నాయకురాలు కావడంతో ఆమెకు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే.. 2024 నాటికి ఆమె ఫేట్ మారిపోయి.. కల్యాణదుర్గం నుంచి పెనుకొండకు మారాల్సి వచ్చింది. కాని.. ఇక్కడ పరాజయం పాలయ్యారు.
అయితే.. దీనిపై ఉష శ్రీచరణ్ భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. తన ఓటమి వ్యక్తిగతం కాదని.. పార్టీకి ఏర్పడిన వ్యతిరేకత కారణంగానే.. తాను ఓడానని అంటున్నారు. అయినప్పటికీ.. ఆమె ఎక్కడా స్థిరమైన రాజకీయాలు చేయలేక పోతున్నారు. పార్టీ పరంగా ఆమెకు ఇంకా నియోజకవర్గం పై క్లారిటీ రాలేదు. పెనుకొండలో కొన్ని రోజులు పర్యటిస్తున్నారు. మరొకొన్ని రోజులు కల్యాణదుర్గంలో పర్యటిస్తున్నారు. కార్యకర్తలు కూడా ఈ వ్యవహారంలో డైలమాలో ఉన్నారు.
పెనుకొండ, కల్యాణ దుర్గంలో ఏది స్థిరమైన నియోజకవర్గమో తెలియక మాజీ మంత్రి తల్లడిల్లుతున్నారు. మరోవైపు కార్యకర్తలు సైతం .. ఎన్నికల సమయం వరకు ఈమె ఉంటారోఉండరో అనే ధోరణిలో పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో ఉష పరిస్థితి ఉస్సూరుమనేలా చేస్తోందని టాక్. రెండు నియోజకవర్గాలపైనా ఆధిపత్యం సాగించాలని ప్రయత్నిస్తున్నా.. చివరకు ఏది నికరం అవుతుందన్న విషయంపై ఆమెకు కూడా గంరదగోళం నెలకొంది. దీంతో డబుల్ గేమ్లో విసిగిపోతున్నట్టు చెబుతున్నారు. పార్టీపరంగా ఆమెకు మంచి గ్రాఫ్ ఉన్నా.. నియోజకవర్గాలను నిర్ణయించకపోవడం మైనస్గా మారిపోయింది.
