Begin typing your search above and press return to search.

చైనా పై ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఇండియాలో ఏ వస్తువులు చౌకవుతాయో తెలుసా?

ఈ పరిణామాల వల్ల భారతదేశంలో ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏవి తగ్గుతాయి.. సామాన్యుడి మీద దీని ప్రభావం ఎలా ఉండబోతుందో ఈ కథనంలో తెలుసుకుందాం.

By:  Tupaki Desk   |   19 April 2025 1:00 PM IST
చైనా పై ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఇండియాలో ఏ వస్తువులు చౌకవుతాయో తెలుసా?
X

అగ్రరాజ్యం అమెరికా, పొరుగు దేశం చైనాల మధ్య సుంకాల యుద్ధం తీవ్రతరమవుతుంది. డొనాల్డ్ ట్రంప్ చైనాపై ఏకంగా 125శాతం సుంకాలు విధించడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అలజడి మొదలైంది. ఈ పరిణామాల వల్ల భారతదేశంలో ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏవి తగ్గుతాయి.. సామాన్యుడి మీద దీని ప్రభావం ఎలా ఉండబోతుందో ఈ కథనంలో తెలుసుకుందాం.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న చర్యల కారణంగా చైనా కష్టాల్లో పడింది. ట్రంప్ తాజాగా చైనాపై సుంకాలను 125శాతానికి పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు అమెరికా చైనా నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై 125శాతం సుంకం విధిస్తుంది. ఈ దెబ్బతో చైనా కంపెనీలు భారీ నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. చైనా అమెరికాకు ఎలక్ట్రానిక్ భాగాలతో సహా పెద్ద మొత్తంలో ఉత్పత్తులను విక్రయిస్తుంది. వీటి ద్వారానే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

అమెరికన్ మార్కెట్ కష్టతరంగా మారిపోవడంతో చైనా కంపెనీలు ఇప్పుడు మన దేశం మీద దృష్టి పెట్టాయి. చైనా కంపెనీలు మనదేశానికి మరిన్ని డిస్కౌంట్లను అందిస్తున్నాయి. అమెరికాతో టారీఫ్ యుద్ధంతో ఆందోళన చెందుతున్న చైనా ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీదారులు ఇప్పుడు భారత్ కు మరింత డిస్కౌంట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు.వాస్తవానికి ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కొత్త సోర్సింగ్ కాంట్రాక్టులపై చర్చలు జరుపుతున్నాయి. ఇలాంటి సమయంలో చైనా మన దేశానికి డిస్కౌంట్లను అందిస్తోంది.

చైనా ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీదారులు భారతీయ కంపెనీలకు మొత్తం ఎగుమతులపై 5శాతం తగ్గింపును అందిస్తున్నారు. ఈ విభాగంలో ఇప్పటికే తక్కువ లాభాలు ఉండడంతో ఈ తగ్గింపు పెద్ద ఊరటనిస్తుంది. చైనా నుంచి వచ్చే ఎలక్ట్రానిక్స్ భాగాలను రిఫ్రిజిరేటర్లు, టీవీలు, స్మార్ట్‌ఫోన్‌ల వంటి ఎలక్ట్రిక్ వస్తువులలో వీటిని ఉపయోగిస్తారు. డిమాండ్ పెంచడానికి భారతీయ తయారీదారులు చైనా నుంచి పొందిన డిస్కౌంట్ల ప్రయోజనాలను వినియోగదారులకు అందించవచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో రిఫ్రిజిరేటర్ల నుండి స్మార్ట్‌ఫోన్‌ల వరకు ప్రతి వస్తువు ధరలు తగ్గే ఛాన్స్ ఉంది.

అమెరికా తర్వాత, చైనాకు భారతే అతిపెద్ద మార్కెట్. చైనా అమెరికాకు స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు, బొమ్మలు, బట్టలు, వీడియో గేమ్స్, లిథియం-అయాన్ బ్యాటరీలు లాంటి ఎన్నో ఉత్పత్తులను విక్రయిస్తుంది. అమెరికా భారీ సుంకాలను విధిస్తుండటంతో అమెరికా చైనాకు దూరం అయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో చైనా కంపెనీలు భారతదేశంతో పెద్ద ఒప్పందం కుదుర్చుకోవాలని అనుకుంటున్నాయి. అందుకే డిస్కౌంట్లను అందించాల్సి ఉంటుంది.

సుంకాల విషయంలో చైనా తనదైన శైలిలో అమెరికాకు నిరంతరం షాకిస్తోంది. అమెరికా విధించిన 104శాతం సుంకానికి ప్రతిస్పందనగా, అమెరికా వస్తువులపై చైనా సుంకాన్ని 84శాతానికి పెంచింది. దీనిపై ఆగ్రహించిన డొనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై 125శాతం సుంకాన్ని ప్రకటించారు. దీని వలన చైనీస్, అమెరికన్ ప్రజలు ఒకరి వస్తువులను ఒకరు కొనడానికి గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది లేదా ఏదైనా ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సి ఉంటుంది.