యూపీఐ ట్రాన్సాక్షన్ రూ. 2000 దాటితే జీఎస్టీ ?
ప్రస్తుతం ఇంటర్నెట్ వాడకం ఏ రేంజ్ పెరిగిపోయిందో తెలిసిందే. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటుంది.
By: Tupaki Desk | 19 April 2025 5:12 AMప్రస్తుతం ఇంటర్నెట్ వాడకం ఏ రేంజ్ పెరిగిపోయిందో తెలిసిందే. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్ ఉంటుంది. దాదాపు చాలా పనులు స్మార్ట్ ఫోన్లలోనే జరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే డిజిటల్ పేమెంట్స్ కూడా భారీగా పెరిగిపోయాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) అందుబాటులోకి రావడంతో జనాలు దాదాపు జేబుల్లో డబ్బులు పెట్టుకోవడం మానేశారు. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్ లతో మీ బ్యాంకు ఖాతాలన్నింటినీ అనుసంధానం చేసి ఎవరికైనా ఎప్పుడైనా డబ్బు పంపవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో ఓ వార్త దావాలంలా వ్యాప్తి చెందుతుంది. దీంతో యూపీఐ వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. రూ.2000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలపై 18శాతం జీఎస్టీ విధించే అవకాశం ఉందన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సోషల్ మీడియా పుకార్ల ప్రకార కేంద్ర ప్రభుత్వం రూ.2000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ ట్రాన్సాక్షన్ల మీద జీఎస్టీని అమలు చేయాలనే ఆలోచనలో ఉంది. దీంతో ఈ జీఎస్టీకి సంబంధించిన వార్తలు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించాయి.
అయితే, తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ వార్తల మీద స్పష్టత ఇచ్చింది. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తల్లో నిజం లేదని తేల్చింది. యూపీఐ ట్రాన్సాక్షల మీద జీఎస్టీ విధించే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. "రూ.2,000 అంతకంటే ఎక్కువ విలువైన యూపీఐ ట్రాన్సాక్షన్ల మీద జీఎస్టీ విధించాలని ప్రభుత్వం పరిశీలిస్తోందనే వాదనలు పూర్తిగా అవాస్తవం. తప్పుదోవ పట్టించే వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వానికి అలాంటి ప్రతిపాదన అనేది లేదు" అని భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.
యూపీఐ ట్రాన్సాక్షన్ల విలువ ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగింది. ఆర్థిక సంవత్సరం 2019-20లో రూ.21.3 లక్షల కోట్లుగా ఉన్న లావాదేవీల విలువ మార్చి 2025 నాటికి రూ.260.56 లక్షల కోట్లకు చేరుకుంది. పీ2ఎం (పర్సన్ టు మర్చంట్) ట్రాన్సాక్షన్లు రూ.59.3 లక్షల కోట్లకు చేరుకున్నాయి. మనదేశం వేగంగా డిజిటల్ చెల్లింపుల కేంద్రంగా మారుతోందని ఇది స్పష్టం చేస్తుంది.