Begin typing your search above and press return to search.

80 ఏళ్లలో పది పాసైన ఒక్క మొనగాడు!

పదో తరగతి పాస్ అవ్వడం పెద్ద విశేషమా? కొందరికి విశేషం కాకపోవచ్చు. కానీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ గ్రామంలో పది పాస్ అయిన ఓ విద్యార్థి ఆ గ్రామానికి పండగ తెచ్చాడు.

By:  Tupaki Desk   |   6 May 2025 4:30 PM
a Village in UP Gets Its First 10th Pass Student Meet Ram Keval
X

పదో తరగతి పాస్ అవ్వడం పెద్ద విశేషమా? కొందరికి విశేషం కాకపోవచ్చు. కానీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ గ్రామంలో పది పాస్ అయిన ఓ విద్యార్థి ఆ గ్రామానికి పండగ తెచ్చాడు. ఎందుకంటే స్వాతంత్ర్యం వచ్చిన 8 దశాబ్దాల తర్వాత ఆ గ్రామంలో పదో తరగతి పరీక్షలు పాసైన ఏకైక విద్యార్థి అతడే..600కి 600 మార్కులు తెచ్చుకుంటున్న ఈ రోజుల్లో ఎలాగోలా పదో తరగతి పాస్ అయితే చాలనుకున్న ఆ గ్రామస్థుల కల నిజం చేసిన విద్యార్థికి జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా సన్మానించడం విశేషం.

కఠిక పేదరికాన్ని అనుభవిస్తూ, ఉదయం పూట పనిచేసుకుంటూ రాత్రిపూట చదివి పది పాసైన విద్యార్థిని అంతా అభినందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లోని బారాబంకీ జిల్లాలోని నిజాంపూర్ గ్రామానికి చెందిన రామ్ కేవల్ అనే విద్యార్థి పదో తరగతి పాసై చరిత్ర సృష్టించాడని గ్రామస్థులు పండగ చేసుకుంటున్నారు. జిల్లా కేంద్రానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామంలో సుమారు 300 మంది నివసిస్తున్నారు. వీరిలో పేదలు. దళితులే ఎక్కువ. ఈ గ్రామంలో ఇప్పటివరకు ఏ ఒక్కరు పదో తరగతి వరకు చదువు కోలేదు. కానీ, రామ్ కేవల్ అనే విద్యార్థి మాత్రం కష్టపడి పనిచేస్తూ మరోవైపు రాత్రులు చదువుకుంటూ పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ గ్రామ చరిత్రను తిరగరాశాడు.

అందరి పిల్లల్లా ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన సమయంలో రామ్ కేవల్ కుటుంబానికి చేదోడువాదోడుగా నిలుస్తూ రాత్రిపూట చదువుకుని టెన్త్ పరీక్షలు రాయడం విశేషం. గ్రామంలో వివాహాది శుభకార్యక్రమాలు జరిగే సమయంలో రాత్రిపూట లైట్లు పట్టుకుని డబ్బు సంపాదించేవాడు అలా రోజుకు రూ.250 నుంచి రూ.300 సంపాదించి ఆ డబ్బుతో పుస్తకాలు కొనుగోలు చేయడం, పరీక్ష ఫీజులు చెల్లించేవాడు. ‘‘రాత్రి పొద్దుపోయిన తర్వాత ఏ సమయంలో ఇంటికి వచ్చినా, కనీసం రెండు గంటలపాటు మేల్కొని చదివే వాడు. కుటుంబంలో నలుగురు పిల్లల్లో పెద్దవాడైన రామ్ కేవల్ విజయంపై గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తండ్రి దినసరి కూలి పనిచేసుకుంటుండగా, తల్లి పాఠశాలలో వంట మనిషిగా పనిచేస్తోంది.

ఇక రామ్ కేవల్ విజయాన్ని తెలుసుకున్న బారాబంకి కలెక్టర్ శశాంక్ త్రిపాఠి విద్యార్థిని పిలిపించి ఘనంగా సత్కరించారు. అతడి ఉన్నత చదువులకు ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని హామీ ఇచ్చాడు. గ్రామంలో మిగిలిన వారికి స్ఫూర్తినింపిన రామ్ కేవల్ సక్సెస్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 8 దశాబ్దాల చరిత్రను తిరగరాసిన రామ్ కేవల్ ను అంతా అభినందిస్తున్నారు.