శ్రీకృష్ణదేవరాయులు.. జగన్.. ఇద్దరికి లింకు.. వైసీపీ ఉగాది పంచాంగం
వైసీపీ ఉగాది పంచాంగ శ్రవణం వేడుకగా జరిగింది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ ఉత్సవాల్లో ప్రముఖ అవధాని నారాయణమూర్తి పంచాంగ శ్రవణం పఠనం చేశారు.
By: Tupaki Desk | 30 March 2025 6:12 PM ISTవైసీపీ ఉగాది పంచాంగ శ్రవణం వేడుకగా జరిగింది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ ఉత్సవాల్లో ప్రముఖ అవధాని నారాయణమూర్తి పంచాంగ శ్రవణం పఠనం చేశారు. వైసీపీ అధినేత జగన్ మిథునరాశిలో జన్మించారని, ఆ రాశి వారికి భయం అంటూ ఏంటో తెలియదని చెప్పారు. అందుకే గత ఎన్నికల్లో ఓడినా జగన్ భయపడకుండా ప్రభుత్వంపై పోరాడుతున్నారని సూత్రీకరించారు.
ప్రజల కోసం వైసీపీ అధినేత ఎంతో ధైర్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. మిథునరాశి వారి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుందని చెప్పారు. అదేవిధంగా విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయులు మాదిరిగా జగన్ కూడా చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు. 2019 ఎన్నికల్లో మాదిరిగా జగన్ త్వరలోనే మరోసారి విజయదుందుబి మోగిస్తారని పంచాంగకర్త తెలిపారు. ఆవేశంలో ప్రజలు గత ఎన్నికల్లో తప్పులు చేశారని, ఇప్పుడు చింతిస్తున్నారని పంచాంగకర్త చెప్పడం గమనార్హం.
అయితే, ఈ కార్యక్రమంలో జగన్ కానీ, ఆయన సతీమణి భారతి కానీ హాజరుకాకపోవడంపై చర్చ జరుగుతోంది. అదేవిధంగా తాడేపల్లి కార్యాలయంలోని పార్టీ పెద్దలు కూడా ఎవరూ కనిపించలేదు. విజయవాడ నగర మేయర్ సహా కొందరు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనడం గమనార్హం. వైసీపీ పంచాంగపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఇది ఉగాది పంచాంగం కాదు వైసీపీ పంచాంగమంటూ ట్రోల్ చేస్తున్నారు.
