భారత్ చేసిన సాయం మరిచిన దేశం.. కక్కుతోంది విషం!
టర్కీకి భారత ప్రధాని మోడీ సంఘీభావం తెలిపారు. టర్కీ ప్రజలకు భారత్ మద్దతుగా నిలుస్తుందని చెబుతూ.. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.
By: Tupaki Desk | 9 May 2025 9:00 PM ISTపహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఉగ్రవాదులు చేసిన పనిని ప్రపంచ దేశాలు ఖండించాయి. ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో భారత్ కు తమ మద్దతును ప్రకటించాయి. మరోవైపు ప్రతీకారంతో భారత్ రగిలిపోతుంటే.. భారత్ ఎప్పుడైన అటాక్ చేయొచ్చని పాక్ ఫిక్సై కూర్చుంది!
అలాంటి పరిస్థితుల నేపథ్యంలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో భారత సహాయం పొందిన ఓ దేశానికి చెందిన యుద్ధ నౌక పాక్ పోర్టులో కనిపించింది. దీంతో.. అడగకుండా, అందరికంటే ముందే సాయం చేసిన భారత్.. ఆ దేశపు క్యారెక్టర్ ని అర్ధం చేసుకుంది! ఆ దేశాన్ని బహిష్కరించాలని భారతీయులు గొంతెత్తారు. ఆ దేశం పేరు టర్కీ (రిపబ్లిక్ ఆఫ్ తుర్కియే)!
అవును... 2023 ఫిబ్రవరి 6. భూకంపవల్ల సిరియాతో పాటు టర్కీ అతలాకుతలం అయ్యింది. ఈ సమయంలో ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ముందుగా భారత్ స్పందించింది. టర్కీకి భారత ప్రధాని మోడీ సంఘీభావం తెలిపారు. టర్కీ ప్రజలకు భారత్ మద్దతుగా నిలుస్తుందని చెబుతూ.. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.
అనంతరం... టర్కీకి సహాయం చేయడానికి భారత్ "ఆపరేషన్ దోస్త్"ను ప్రారంభించింది. ఈ సమయంలో... టర్కీకి తక్షణం సహాయ చర్యలు ఏమి అందించాలనే విషయాన్ని నిర్ణయించడానికి ప్రధాని మోడీ సంబంధిత శాఖలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమయంలో 8,45,590 డాలర్ల సహాయ సామాగ్రిని పంపించారు.
మరోవైపు భారత ఎన్.డీ.ఆర్.ఎఫ్. బృందాలు టర్కీలో సహాయక చర్యల్లో నిమఘ్నమయ్యాయి. ఈ సమయంలో భారత వైమానిక దళం టర్కీకి సీ-17 విమానాలను పంపించింది. ఈ సందర్భంగా స్పందించిన టర్కీ రాయబారి ఫిరత్ సునేల్... భారత్ కు కృతజ్ఞతలు తెలిపారు. అవసరంలో నిలబడిన స్నేహితుడే నిజంగా స్నేహితుడని చెప్పుకొచ్చాడు. ఢిల్లీకి ధన్యవాదాలు తెలిపారు.
కట్ చేస్తే... ఏప్రిల్ 22 - 2025న భారత్ లోని పర్యాటకులే లక్ష్యంగా పాకిస్థాన్ పెంచి పోషిస్తోన్న ఉగ్రవాదులు పాశవిక దాడి చేశారు. ఆ దాడిలో 26 మంది పౌరులు మరణించారు. దీంతో... ప్రపంచమంతా ఉగ్రదాడిని ఖండించింది. ఇజ్రాయెల్ వంటి దేశమైతే.. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమ మద్దతు ఉంటుందన్నట్లుగా ప్రకటించింది.
అగ్రరాజ్యం అమెరికా నుంచి రష్యా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్ డమ్ మొదలైన దేశాలు భారత్ కు మద్దతుగా నిలిచాయి. పరోక్షంగా పాక్ వైఖరిని తప్పుబట్టాయి! ఈ సమయంలో అదే టర్కీకి చెందిన "టీజీసీ బుయుకడా" అనే భారీ యుద్ధ నౌక కరాచీ తీరంలో కనిపించింది. ఇదే సమయంలో... పాకిస్థాన్ కు తన మద్దతు ప్రకటిస్తున్నట్లు టర్కీ చెప్పింది!
తాజాగా భారత నగరల్లోని సైనిక స్థావరాలే లక్ష్యంగా పాకిస్థాన్ జరిపిన డ్రోన్లను టర్కీయే పంపినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు కేంద్రం ప్రకటించింది! దీంతో... సాయం చేసిన భారత్ కు నమ్మకద్రోహం చేసి వెన్నుపోటు పొడిచిందంటూ టర్కీపై నిప్పులు చెరుగుతున్నారు భారతీయులు. బాయ్ కాట్ టర్కీ అనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు.