భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం.. సుంకాల తగ్గింపుపై ట్రంప్ కీలక ప్రకటన!
భారత్, అమెరికా అధికారులు ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) మీద వాషింగ్టన్ డీసీలో ఈ నెల 23న చర్చలు ప్రారంభించారు.
By: Tupaki Desk | 24 April 2025 8:32 AMఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. భారత్ కొన్ని రకాల వస్తువులపై సుంకాలు తగ్గించడానికి సిద్ధంగా ఉందని.. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని ఆయన వెల్లడించారు. ఈ ప్రకటన ఇరు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చల్లో కీలక మలుపు తిప్పింది. అయితే ఏయే ఉత్పత్తుల మీద సుంకాలు తగ్గనున్నాయనే అంశం పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఓవల్ ఆఫీస్లో పాత్రికేయులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు.
భారత్, అమెరికా అధికారులు ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) మీద వాషింగ్టన్ డీసీలో ఈ నెల 23న చర్చలు ప్రారంభించారు. ఈ ఒప్పందం ద్వారా అమెరికా ఉత్పత్తులకు కొత్త మార్కెట్లు తెరుచుకుంటాయని.. ఇరు దేశాల్లోని ఉద్యోగులు, రైతులు, పారిశ్రామికవేత్తలకు నూతన అవకాశాలు లభిస్తాయని అమెరికా ఇప్పటికే ఆశాభావం వ్యక్తం చేసింది. టారిఫ్, టారిఫేతర అడ్డంకులను తగ్గించుకోవాలని అమెరికా భావిస్తున్నట్లు యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ తెలిపారు.
ఈ ఒప్పందానికి సంబంధించిన షరతులకు ఇరు దేశాలు తుది రూపం తీసుకొచ్చాయి. 90 రోజుల పాటు టారిఫ్ అమలుకు అమెరికా విరామం ప్రకటించిన నేపథ్యంలో ఈ మూడు రోజుల చర్చలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారత ప్రతినిధి బృందానికి కామర్స్ డిపార్ట్ మెంట్ అడిషనల్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్ నేతృత్వం వహిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లపై చాలా దేశాలు ప్రతీకార చర్యలకు సిద్ధమవుతున్న తరుణంలో భారత్ మాత్రం విభిన్నంగా ఆలోచించి ప్రతీకార సుంకాలను విధించే బదులు అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై దృష్టి పెట్టింది. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి గట్టి పునాది పడింది. పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందం చేసుకునేలా ఇరు దేశాధినేతలు ఓ ఒప్పందానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే చర్చలు జరుగుతున్నాయి.