Begin typing your search above and press return to search.

పవన్ మీద ట్రాన్స్ జెండర్ పోటీ !

ఇక్కడ వైసీపీ నుంచి కాకినాడ ఎంపీ వంగా గీత పోటీ చేస్తున్నారు. ఆమె ఇప్పటికే నియోజకవర్గాన్ని చుట్టేశారు.

By:  Tupaki Desk   |   9 April 2024 4:07 PM GMT
పవన్ మీద ట్రాన్స్ జెండర్ పోటీ !
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ ప్రధానంగా అధికార వైసీపీ విపక్ష టీడీపీ కూటమి మధ్యనే ఉంటుందన్నది తెలిసిందే. జనసేన తరఫున పవన్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు బీజేపీ టీడీపీ మద్దతు ఇస్తున్నాయి.

ఇక్కడ వైసీపీ నుంచి కాకినాడ ఎంపీ వంగా గీత పోటీ చేస్తున్నారు. ఆమె ఇప్పటికే నియోజకవర్గాన్ని చుట్టేశారు. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన అనుభవం ఉంది. మొత్తం మీద చూస్తే ఈ ఇద్దరి మధ్యనే పోరు సాగుతుందని అంతా భావిస్తున్న తరుణంలో ఇపుడు మరొకరు పోటీకి దిగుతున్నారు. ఒక ట్రాన్స్ జెండర్ గా ఉనన్ తమన్నా సింహాద్రి పిఠాపురం నుంచి పోటీ చేయడానికి రెడీ అయ్యారు.

ఆమె గతంలో అంటే 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి నారా లోకేష్ మీద పోటీ చేసి ఓడిపోయారు. ఆమెకు డిపాజిట్లు కూడా దక్కలేదు. అయితే ఆ ఎన్నికల తరువాత ఆమె జనసేన తరఫున కొన్నాళ్ళు ప్రచారం చేశారు. ఇపుడు ఆమె ఏకంగా పవన్ కళ్యాణ్ మీదనే పోటీకి దిగడం ఆసక్తిగా ఉంది.

ఆమె బిగ్ బాస్ లో ఒక కంటెస్టెంట్ గా గతంలో పాల్గొన్నారు. ఆమె ఉమ్మడి క్రిష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన వారు. తెలుగు సినీ రంగంలో అవకాశాల కోసం ఆమె ట్రాన్స్ జెండర్ గా మారి హైదరాబాద్ వెళ్లారు. ఆమె ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీ రామచంద్ర యాదవ్ కి చెందిన భారత చైతన్య యువజన పార్టీ తరఫున పిఠాపురంలో పోటీ చేస్తున్నారు.

ఇక అవనిగడ్డ వైసీపీ నేత సింహాద్రి తనకు వరసకు బాబాయ్ అవుతారు అని కూడా గతంలో తమన్నా సింహాద్రి చెప్పింది అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఆమె బలమైన సామాజిక వర్గానికి చెందిన వారే కావడం విశేషం. పిఠాపురంలో కాంగ్రెస్ అభ్యర్ధి బరిలో ఉన్నారు. ఇంకా ఇండిపెండెంట్లుగా కొంతమంది ఎన్నికల టైం కి బరిలో ఉంటారని అంటున్నారు. దాంతో పిఠాపురం మీద రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఇక్కడ గెలుపు ఎవరిదైనా ఏపీ రాజకీయాలను మలుపు తిప్పుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.