Begin typing your search above and press return to search.

తిరుపతి జూలో దారుణం... వ్యక్తి తల భాగాన్ని పూర్తిగా తినేసిన సింహం!!

ఈ సమయంలోనే సింహం దాడి చేసిందని... ఈ దాడిలో భాగంగా అతని తల భాగాన్ని పూర్తిగా తినేసిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   15 Feb 2024 11:28 AM GMT
తిరుపతి జూలో దారుణం... వ్యక్తి తల భాగాన్ని పూర్తిగా తినేసిన సింహం!!
X

తిరుపతి జూపార్క్‌ లో విషాదం చోటు చేసుకుంది. శ్రీ వేంకటేశ్వర జులాజికల్‌ పార్క్‌ సందర్శనకు వెళ్లిన ఓ వ్యక్తి పై సింహం దాడి చేసింది. ఎవరూ గుర్తించని సమయంలో సింహం ఎన్‌క్లోజర్‌ లోకి సదరు వ్యక్తి చొరబడి సెల్ఫీ కోసం ప్రయత్నం చేశాడని తెలుస్తుంది. ఈ సమయంలోనే సింహం దాడి చేసిందని... ఈ దాడిలో భాగంగా అతని తల భాగాన్ని పూర్తిగా తినేసిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

అవును... తిరుపతి జూపార్క్ లో దారుణం చోటుచేసుకుంది. జూ సందర్శనకు అని వెళ్లిన వ్య్కతి ఎవరూ గుర్తించని సమయంలో సింహం ఎన్ క్లోజర్ లోకి వెళ్లాడు! ఈ సమయంలో సింహం బిగ్గరగా అరవడంతో.. ఆ అరుపులకు చెట్టు ఎక్కి కుర్చున్నాడని తెలుస్తుంది. అనంతరం ఆ గాండ్రింపులకు చెట్టుపైనుంచి జారిపడటంతో సింహం ఒక్కసారిగా అతడిపైకి దూకి దాడి చేసింది! ఈ సమయంలో అతని శరీరాన్ని రెండు భాగాలుగా చేసిందని స్థానికులు చెబుతున్నారు.

దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడని తెలుస్తుంది. అయితే... నిషేదిత ప్రాంతం అని రాసి ఉన్నప్పటికీ సెల్ఫీ కోసమే అతడు వెళ్లాడని అంటున్నారు. ప్రస్తుతం ఆ జూలోకి ఎవరినీ అనుమతించడం లేదు. పోలీసులు, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు రాజస్థాన్‌ కు చెందిన ప్రహ్లాద గుజ్జర్‌ (38) గా గుర్తించారు. వృత్తిరీత్యా డ్రైవర్ పనిచేస్తున్న ప్రహ్లాద గుజ్జర్‌... మూడు రోజుల క్రితం హైదరాబాద్ నుండి టిక్కెట్ కొని బస్సులో తిరుపతి వచ్చినట్లు గుర్తించారు పోలీసులు.

అయితే అతడు ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతోనే నిషేదిత ప్రాంతమైన లయన్ ఎన్ క్లోజర్‌ లోకి దూకినట్లు భావిస్తున్నారు జూ పార్క్ అధికారులు. సమాచారం అందుకున్న తిరుపతి రూరల్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనపై డీఎస్పీ శరత్‌ రాజ్‌ జూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డెడ్ బాడిని పోస్టు మార్టం నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు.

కాగా... ఈ తరహా ఘటనలు గతంలో దేశంతో పాటు విదేశాల్లోని పలు జూపార్క్ లలో చోటు చేసుకున్నాయి. ఇందులో భాగంగా... 2019 జనవరి 20న జిరాక్ పూర్ లో మొహేంద్ర చౌదరి జులాజికల్ పార్క్ లో 22 ఏళ్ల వ్యక్తిని సింహం చంపింది. పంజాబ్ రాష్ట్రంలోని జూపార్క్ లో సింహల దాడిలో ఓ వ్యక్తి మరణించిన ఘటన 2019 జూన్ 21న మరొకటి జరిగింది.