గ్రేటర్ లో మూడు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు?
తెలంగాణలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని అంటున్నారు.
By: Tupaki Desk | 29 July 2025 2:00 AM ISTతెలంగాణలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని అంటున్నారు. రిజర్వేషన్ చిక్కుముడులు లేకపోతే జూబ్లీహిల్స్ కన్నా ముందుగా స్థానిక ఎన్నికలు లేదంటే డిసెంబరులో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అయితే జూబ్లీహిల్స్ తోపాటు మరో రెండు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగే పరిస్థితి ఉందని పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ హీట్ పుట్టిస్తోంది. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ సిట్టింగు స్థానం కాగా, మరో రెండు స్థానాలకు ప్రస్తుత ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలను ఎదుర్కోవాలని భావిస్తున్నారని అంటున్నారు. ఆ రెండు స్థానాలలో ఒకటి కాంగ్రెస్, మరొకటి బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో రాజీనామా వార్తలు ఆసక్తి రేపుతున్నాయి.
హీట్ పుట్టిస్తున్న రాజకీయం
తెలంగాణ రాజకీయం ఫుల్ హీట్ మీదుంది. నువ్వానేనా..తగ్గేదేలే అంటూ అధికార కాంగ్రెస్, అపోజిషన్ బీఆర్ఎస్ సవాళ్లు, ప్రతి సవాళ్లు..విమర్శలతో పొలిటికల్ వార్ను నెక్స్ట్ లెవల్కు తీసుకెళ్తున్నాయి. ఇదే టైమ్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పార్టీలు రెడీ అవుతున్నాయి. జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఆయన సతీమణి సునీతను బరిలోకి దింపాలని గులాబీ పార్టీ ఆల్రెడీ డిసైడ్ అయిందంటున్నారు. ఇప్పటికే గ్రౌండ్లో పరిస్థితులను అంచనా వేయడానికి సర్వే కూడా చేయించినట్లు తెలుస్తోంది. అయితే జూబ్లీహిల్స్తో పాటు గ్రేటర్లో మరో రెండు బైపోల్స్ రాబోతున్నాయన్న టాక్ ఊపందుకుంది. ప్రధానంగా ఖైరతాబాద్ అసెంబ్లీ సీటుకు కూడా ఉప ఎన్నిక రావొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరి హస్తం పార్టీ సింబల్ మీద ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్పై అనర్హత వేటు పడటం ఖాయమన్న చర్చ జరుగుతోంది. ఈ నెల 14 తర్వాత ఎప్పుడైనా కోర్టు తీర్పు రావొచ్చంటున్నారు. ఈ నేపథ్యంలోనే అనర్హత వేటు పడే కంటే ముందే రాజీనామా చేయాలనే ఆలోచనలో దానం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇక్కడే ఆయన ఓ కండీషన్ పెడుతున్నట్లు చెబుతున్నారు. తనకు మంత్రి పదవి ఇస్తానంటే..జూబ్లీహిల్స్లో పార్టీని గెలిపించడంతో పాటు తాను రిజైన్ చేసి ఖైరతాబాద్లో మళ్లీ గెలుస్తానని దానం చెబుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వారం రోజుల్లోపే దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని అంటున్నారు. నెలాఖరులో జరిగే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు చోటు దక్కడం పక్కా అని మినిస్టర్ హోదాలోనే ఆయన ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేస్తారని కూడా గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.
గోషామహల్ కు ఉప ఎన్నిక?
దానం రిజైన్ చేస్తే గ్రేటర్లో రెండు బైపోల్స్ పక్కా అంటున్నారు. ఇదే క్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఎపిసోడ్ వల్ల అక్కడా ఉప ఎన్నిక జరిగే పరిస్థితి ఉందని అంటున్నారు. బీజేపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ తన శాసనసభ్యత్వానికి త్వరలో రిజైన్ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు బీజేపీ నేతలు కూడా రాజాసింగ్ రాజీనామా చేయాలన్న డిమాండ్లు తెస్తున్నారు. అవసరమైతే అనర్హత వేటు కోసం స్పీకర్కు కంప్లైంట్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజాసింగ్ కూడా ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేయాలని భావిస్తున్నారట. అదే జరిగితే గ్రేటర్ హైదరాబాద్లో మూడు బైపోల్స్ రావడం పక్కా అన అంటున్నారు. అటు దానం..ఇటు రాజాసింగ్ జూబ్లీహిల్స్ బైపోల్ నోటిఫికేషన్ వచ్చే కంటే ముందే రిజైన్ చేస్తే మూడు బైపోల్స్కు ఒకేసారి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక రాజాసింగ్ విషయానికొస్తే బీజేపీ అధిష్టానం తన రాజీనామాను ఆమోదిస్తుందని ఆయన ఊహించలేదట. తన వెర్షన్ విని అంతా సెట్రైట్ చేస్తారని భావించారట. అయితే రాజీనామా ఆమోదంతో రాజాసింగ్ మహారాష్ట్ర రాజకీయాల్లోకి వెళ్లడం పక్కా అన్న టాక్ వినిపిస్తోంది. మహారాష్ట్రలోని ఉద్దవ్ శివసేనలో చేరి ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉంటూ అక్కడ ఇక్కడ పాలిటిక్స్ చేయాలనేది రాజాసింగ్ వ్యూహమని చెబుతున్నారు. లేకపోతే మహారాష్ట్రలోనే యాక్టీవ్ పాలిటిక్స్లో ఉండాలనేది రాజాసింగ్ ఆలోచన చేస్తున్నారని కూడా చెప్తున్నారు. ఈ క్రమంలో గోషామహల్ నుంచి మళ్లీ పోటీ చేసి గెలవాలనే కసితో రాజాసింగ్ ఉన్నా బీజేపీ ఆయనపై అనర్హత ఫిర్యాదు చేసినా బైపోలో రావడం ఖాయం. అదే జరిగితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు ముందే రాష్ట్ర రాజధానిలో మూడు అసెంబ్లీ సీట్ల ఎన్నికల సమరం పొలిటికల్ హీట్ను పెంచనుంది.
