Begin typing your search above and press return to search.

ఏపీ సీఎం కుర్చీని డిసైడ్ చేసేది ఆ రెండు జిల్లాలే....!?

అదే కృష్ణా గుంటూరు అని చెబుతున్నారు. ఈ రెండు జిల్లాలో కలుపుకుని మొత్తం 33 దాకా అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో సగానికి పైగా సీట్లు ఏ పార్టీ సాధిస్తే వారికే అధికారం దక్కుతుంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   7 Jan 2024 11:30 AM GMT
ఏపీ సీఎం కుర్చీని డిసైడ్ చేసేది ఆ రెండు జిల్లాలే....!?
X

ఏపీకి కొత్త సీఎం ఎవరు అవుతారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఇపుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఎందుకంటే అధికార వైసీపీ మీద వ్యతిరేకత ఉందని విపక్షం అంటున్నా ఇంకా అది పూర్తి స్థాయిలో కన్సాల్డేట్ కాలేదు వ్యతిరేక ఓట్లు పోలరైజ్ అయ్యే సీన్ ఇంకా కనిపించడంలేదు.

అధికార పార్టీకి యాంటీ ఇంకెంబెన్సీ ఉందని అంటున్నా అది ఎంత శాతం అన్నది ఇదమిద్దంగా తేలడంలేదు. సర్వేలు సైతం దాన్ని పట్టుకోలేకపోతున్నాయి. ఈ రోజుకు కూడా సర్వే నివేదికలు చూస్తే మొగ్గు వైసీపీ వైపే ఎంతో కొంత కనిపిస్తోంది. గత ఎన్నికలో దాదాపుగా యాభై శాతం ఓటు షేర్ సాధించిన వైసీపీకి ఈసారి ఆరేడు శాతం ఓటు షేర్ తగ్గుతుందని స్థూలంగా సర్వే సంస్థలు అన్నీ చెబుతున్న మాటగా ఉంది.

అదే టైం లో ఏపీలో విపక్ష తెలుగుదేశం పార్టీకి గతసారి వచ్చిన దాని కంటే ఓటు షేర్ బాగా పెరిగింది అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అది 46 శాతంగా ఉందని అంటున్నారు. అయితే ఓవరాల్ గా అన్ని సర్వేలు చూసుకున్నపుడు టీడీపీ ఓటు బ్యాంక్ నలభై శాతం పై దాటి ఉందని అంటున్నారు. ఇక జనసేన ఓటు బ్యాంక్ గతంలో ఆరు శాతం ఉంటే ఇపుడు అది డబుల్ అయింది అని అంటున్నారు. అంటే పదకొండు నుంచి పన్నెండు శాతంగా ఉంది అని అంటున్నారు.

ఇదిలా ఉంటే ఏపీలో ఉమ్మడి జిల్లాలు పదమూడు ఉంటే అందులో ఏడు జిల్లాలలో వైసీపీ ఆధిపత్యం రాజకీయంగా చలాయిస్తోంది అని అంటున్నారు. అదే టైం లో ప్రతిపక్ష టీడీపీ ఆరు జిల్లాలలో కచ్చితమైన మొగ్గుని చూపిస్తోంది. ఇక జిల్లాల వారీగా చూసినా వైసీపీ టీడీపీల మధ్య హోరాహోరీ పోరు సాగక తప్పని సీన్ ఉంది.

అయితే రెండు జిల్లాలలో ఫలితం మాత్రం ఏపీ రాజకీయాలు నిర్ణయిస్తుంది అని అంటుంది. అదే కృష్ణా గుంటూరు అని చెబుతున్నారు. ఈ రెండు జిల్లాలో కలుపుకుని మొత్తం 33 దాకా అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో సగానికి పైగా సీట్లు ఏ పార్టీ సాధిస్తే వారికే అధికారం దక్కుతుంది అని అంటున్నారు. 2019 ఎన్నికల్లో ఈ రెండు జిల్లాలలో అత్యధిక సీట్లను వైసీపీ సాధించింది.

ఈసారి వైసీపీ కొంత తగ్గినా టీడీపీ పెరిగినా పోటా పోటీగానే పరిస్థితి ఉంది అని అంటున్నారు.ఐతే వాతావరణం ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఇంకా మారుతుందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ రెండు జిల్లాలలో వైసీపీ ఆధిపత్యం చలాయిస్తుందా లేక టీడీపీ తన హవా గతంలో మాదిరిగా చాటుకుంటుందా అన్నదే చర్చగా ఉంది.

ఏది ఏమైనా తెలంగాణా ఫలితాలకు భిన్నంగా ఏపీ ఫలితాలు ఉంటాయని అంటున్నారు. తెలంగాణాలో అర్బన్ సెక్టార్ అధికార బీఆర్ఎస్ కి అండగా నిలిస్తే రూరల్ బేస్ అంతా కాంగ్రెస్ వైపు ఉంది. అదే ఏపీ విషయానికి వస్తే అర్బన్ సెక్టార్ అంతా టీడీపీకి బాసటగా నిలిచే చాన్స్ ఉంది అంటున్నారు. అదే రూరల్ సెక్టార్ అంతా వైసీపీకి గట్టి మద్దతుగా నిలుస్తోంది.

కొత్త ఏడాదిలో అడుగుపెట్టిన వేళ కూడా ఇదే రాజకీయ పరిస్థితి అయితే ఏపీలో ఉంది. అంటే ఈ రోజుకీ కొంత మొగ్గు అయితే వైసీపీకే ఉంది. అయితే రానున్న రోజులలో అభ్యర్ధులను ప్రకటిస్తారు. ఆ మీదట ఎన్నికల హామీలు నేతల ప్రచారాలతో రాజకీయం హీటెక్కనుంది అపుడు ఫలితాలు ఏమైనా అటూ ఇటూ అవుతాయా లేక ఇదే మొగ్గు మరింతగా వైసీపీకే కొనసాగుతుందా అన్నదే చూడాల్సి ఉందని అంటున్నారు.