Begin typing your search above and press return to search.

దేశ విభజన చారిత్రక తప్పిదమేనా...ఒవైసీ మాటల వెనక...?

ఇపుడు ముస్లింలకి నాయకత్వం వహించే మజ్లీస్ పార్టీ ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఒవైసీ దేశ విభజన చారిత్రక తప్పిదం అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   18 Oct 2023 8:00 AM GMT
దేశ విభజన చారిత్రక తప్పిదమేనా...ఒవైసీ మాటల వెనక...?
X

భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది అన్న సంతోషం నిజమైన దేశ భక్తులకు ఎపుడూ ఉందదు ఎందుకంటే బ్రిటిష్ వారి ఏలుబడిలోకి దేశం వెళ్ళినపుడు అఖండ భారతంగా ఉండేది. అందులో పాకిస్థాన్ ఉండేది. ఇక దేశ విభజన జరిగి అన్న దమ్ముల మధ్య చిచ్చు రేపింది. అలా పాకిస్థాన్ భారత్ గా విడిపోయాయి. గత ఏడున్నర దశాబ్దాల మధ్య పాక్ భారత్ ల మధ్య మంచి సంబంధాల కంటే వైషమ్యాలే ప్రధాన పాత్ర పోషించాయి.

భారత్ మీద యుద్ధం అంటూ పాక్ అప్పుల పాలు అయి ఈ రోజు దారుణమైన దుస్థితిని ఎదుర్కొంటోంది. భారత్ కూడా మూడు ప్రత్యక్ష యుద్ధాలతో పాటు ప్రచ్చన్న యుద్ధాలతో దారుణంగా దెబ్బ తింది. అయితే పెద్ద దేశం కాబట్టి భారత్ కోలుకుంది. ఇక పాక్ భారత్ వైరం మూలంగా అమెరికా, చైనా లాంటివి బాగుపడ్డాయని అంటారు. అలాగే ఆయుధాలు అమ్ముకునే వ్యాపార దేశాలకు ఇది ఉపయోగపడింది.

దేశ విభజన కాకుండా ఉంటే ఈ రోజుకు భారత్ ప్రపంచంలో నంబర్ వన్ గా అన్ని విధాలుగానూ ఉండేది అంటారు. అలాగే అగ్ర శ్రేణి ఆర్ధిక వ్యవస్థతో తులతూగేది అని అంటారు. కానీ జరిగినది మాత్రం వేరుగా ఉంది. ఇక పాకిస్థాన్ భారత్ నుంచి విడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి.

అయితే అది అనివార్యం అని కొందరు అంటే ఆపగలిగినా చేయాల్సింది చేశారు అని కొందరు అంటారు. ఆరెస్సెస్ మాత్రం అఖండ భారతం నినాదాన్ని ఈ రోజుకీ వినిపిస్తుంది. ఇపుడు ముస్లింలకి నాయకత్వం వహించే మజ్లీస్ పార్టీ ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఒవైసీ దేశ విభజన చారిత్రక తప్పిదం అని అంటున్నారు. అసలు దేశ విభజన జరగాల్సింది కానే కాదు అని ఆయన తాజాగా సంచలన కామెంట్స్ చేశారు.

ఆనాటి ఇస్లామిక్ పండితులు కూడా ఇరు దేశాల సిద్ధాంతాన్ని పూర్తిగా వ్యతిరేకించారు అని ఒవైసీ చరిత్ర సత్యాలను చెప్పుకొచ్చారు. స్వాతంత్ర సమరయోధుడు మౌలానా రాసిన ఇండినా విన్స్ ఫ్రీడం పుస్తకంలో అనేక నిజాలు ఉన్నాయని ఆయన అంటున్నారు. ఇక దేశ విభజన తప్పిందం అనే కాకుండా ముస్లిం మేధావులు వ్యతిరేకించారు అన్న దాని మీద తాను ఎవరితోనైనా డిబేట్ చేయడానికి సిద్ధం అని ఒవైసీ అంటున్నారు.

ఇక్కడ ఒవైసీ చెప్పిన దాంట్లో నిజం ఏంటి అంటే దేశ విభజన చారిత్రాత్మక తప్పిదం అన్నదే. నిజమే. ఈ దేశం నిండుగా ఒకటిగా ఉంటే ఆ ఖ్యాతి కీర్తి బలం బలగం వేరుగా ఉండేవి. దాయాది దేశాలు కొట్టుకుని దశాబ్దాల పాటు అలా వైరాన్ని పెంచుకోవడం వల్ల ఎంతో విలువైనవి వృధా అయిపోయాయి. అయితే ఒవైసీ వంటి వారు గతంలో ఇలాంటి మాటలు అన్నట్లుగా లేదని కూడా ప్రచారంలో ఉంది.

అయితే ఆయన ఎపుడు చెప్పారని కాదు చెప్పిన మాటలలో సత్యం ఉందా లేదా అన్నదే ముఖ్యం. ఇదిలా ఉంటే పాకిస్థాన్ ఇపుడు చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒక దేశంగా తన ఉనికిని నిలబెట్టుకుంటుందా అన్న డౌట్లు వస్తున్నాయి. ఆ దేశాన్ని ఒకనాడు పాలించిన వారు కూడా భారత్ ని మెచ్చుకుంటున్నారు. కరడు కట్టిన ముస్లిం సమాజంలో మార్పు వస్తోంది అని అంటున్నారు. విభజన వల్ల నిజంగా చెప్పాలంటే పాకిస్థాన్ దారుణంగా నష్టపోయింది అనే చెప్పాలి.

ఒక దేశం విడిపోవడానికి మతం ప్రాతిపదిక కారాదు, భావోద్వేగాలతో దేశాలు ప్రాంతాలు ఏర్పాటు కావు అన్న సత్యానికి నిలువెత్తు ఉదాహరణగా పాకిస్థాన్ ఈ రోజు నిలిచి ఉంది. ఒక దేశం అన్నది అందరితోనూ ఉంటుంది. కులాల వారీగా మతాల వారీగా రాజ్యాలు ఎపుడూ ఆవిర్భవించవు. ఈ సత్యం తెలుసుకునేసరికి పాకిస్థాన్ పతనం అంచున నిలబడి ఉంది. అందుకే ఇపుడు చాలా మంది భారత్ గ్రేట్ అంటున్నారు. పాక్ ఆక్రమిత వాసులు భారత్ లో విలీనానికి రెడీ అంటున్నారు. బెలూచిస్థాన్ ప్రాంతీయులు కూడా భారత్ మాట మాట్లాడుతున్నరు. పాకిస్థాన్ లోని సగటు పౌరులు కూడా భారత్ వైపు చూస్తున్నారు.

ఇదంతా ఎందుకు అంటే అసహజమైన ప్రక్రియగా దేశ విభజన జరిగి పాక్ అనే దేశం ఏర్పడింది. నాడు బ్రిటిష్ వారి ఎత్తులకు చిత్తు అయిన నేపధ్యంలో ఇలా జరిగింది అని చెప్పాలి. అలా కాకుండా ఉంటే భారత్ కి ఏనాడో ముస్లిమ్స్ నుంచి కూడా ప్రధానులు వచ్చి ఉండేవారు అన్న భావన చాలా మందిలో ఉంది. అలాగే మైనారిటీ మెజారిటీ అన్న లెక్కలు రాజకీయ కోణాలు లేకుండా దేశం ఉండేది అన్న వారూ ఉన్నారు. మరి దేశ విభజన తప్పు అని తేలుతోంది. దీనికి పరిష్కారం ఏమిటి అన్నది కూడా మేధావుల నుంచే రావాల్సి ఉంది.

ఆరెస్సెస్ అయితే ఏదో నాటికి పాకిస్తాన్ ఆఫ్గనిస్తాన్ సహా చాలా దేశాలు భారత్ లో కలుస్తాయని నమ్మకంగా చెబుతూ వస్తోంది. అలా కనుక జరిగితే భూ భాగంలో చైనాతో సరిసమానంగా భారత్ ఉంటూ పటిష్టంగా బలమైన శక్తిగా ప్రపంచంలో ఉండే వీలుంది. మరి పాక్ భారత్ లో కలుస్తుందా. ఏమో ఎవరు చెప్పగలరు. ఏదైనా సాధ్యమే. కాకపోతే కాలం కలసి రావాలి. అపుడు అది ఇచ్చే తీర్పు కొత్తగా ఉన్నా స్వీకరించక తప్పదు.