Begin typing your search above and press return to search.

ఆ సీటే కీలకం... కాంగ్రెస్‌ గూటికి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి?

ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి మునుగోడు లేదా ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి.

By:  Tupaki Desk   |   23 Oct 2023 9:13 AM GMT
ఆ సీటే కీలకం... కాంగ్రెస్‌  గూటికి కోమటిరెడ్డి రాజగోపాల్‌  రెడ్డి?
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఊహించనిస్థాయిలో అన్నట్లుగా... తెలంగాణ రాజకీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. ఇప్పటికే విపక్షాలు తొలివిడత జాబితాలను ప్రకటించాయి. దీంతో అసంతృప్తుల బుజ్జగింపులు అనేవి చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ సమయంలో... బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరటం ఖాయమైందనే ప్రచారం మొదలైంది. త్వరలో బీజేపీ రెండో జాబితా విడుదలవ్వబోతోందనే వార్తలొస్తున్న నేపథ్యంలో... ఈ టాపిక్ చర్చనీయాంశం అయ్యింది.

అవును... మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవడం ఇప్పటికే చర్చనీయాంశమైన నేపథ్యంలో రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ లో చేరనున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇదే సమయంలో... ఆయన కాంగ్రెస్ లో చేరడానికి ఓకే చెబుతున్నప్పటికీ... ఒక సీటు విషయంలో ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.

సీట్ల సర్దుబాట్ల విషయంలో ఉన్న కొన్ని సమస్యల కారణంగా బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌ లోకి వచ్చేస్తున్నారనే ప్రచారం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. ఇదే క్రమంలో మంగళవారం ఆయన ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ లో చేరుతున్నారని సైతం కథనాలొస్తున్నాయి. అయితే ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఒక సీటు అడుగుతుంటే.. కాంగ్రెస్ పార్టీ మరోసీటు ఆఫర్ చేస్తుందంట.

ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి మునుగోడు లేదా ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి. అవసరమైనే మునుగోడు నుంచి ఆయన సతీమణి పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. అయితే ఈ విషయంలో పార్టీ నాయకత్వం నుంచి మాత్రం స్పష్టత రాలేదని తెలుస్తోంది. ఈ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరు ముఖ్యులు రాజగోపాల్ కు టచ్ లోకి వచ్చారని సమాచారం.

దీంతో మునుగోడు అసెంబ్లీ సీటు రాజగోపాల్ సతీమణికి, భువనగిరి ఎంపీ సీటు ఆయనకు అడుగుతున్నారనే గాసిప్స్ కూడా హల్ చల్ చేస్తున్నాయి. అయితే... కాంగ్రెస్ - సీపీఐ పొత్తులో భాగంగా మునుగోడు అసెంబ్లీ సీటును కమ్యునిస్టులకు కేటాయించారని తెలుస్తుంది. దీంతో... మునుగోడు సీటు చుట్టూనే రాజగోపాల్ పార్టీ మార్పు నిర్ణయం ఆధారపడి ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇన్ని ఊహాగాణాలు, రాజకీయ చర్చలు, విశ్లేషణల నేపథ్యంలో... రాజగోపాల్‌ రెడ్డి స్పందించారు! ఇందులో భాగంగా తాను కాంగ్రెస్‌ లో చేరే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు! అయితే... ఆ పార్టీలో చేరాలన్న ఒత్తిడి అనుచరులు, ప్రజల నుంచి ఉందని చెప్పుకొచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరిక ఆల్ మోస్ట్ కన్ ఫా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా... ఈ రోజు సాయంత్రం, లేదా మంగళవారం మద్యాహ్నం లోపు ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశముందని తెలుస్తుంది.

కాగా... రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బీజేపీలో చేరిన రాజగోపాల్ మునుగోడు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత కొంత కాలం పార్టీలో యాక్టివ్ గానే ఉన్నా.. తిరిగి కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం సాగుతోంది!

ఇదే సమయంలో మరింత కీలకంగా... తాను కాంగ్రెస్ లో చేరాలంటే ముందుగా రేవంత్ రెడ్డి గతంలో తన పైన చేసిన వ్యాఖ్యలపైన వివరణ ఇవ్వాలని రాజగోపాల్ తో పాటు ఆయన అనుచరుల నుంచి డిమాండ్ వస్తున్నట్లు కథనాలొస్తున్నాయి! మరి ఈ విషయంపై తెరపైకి వస్తొన్న ఈ డిస్కషన్ ఎలాంటి కన్ క్లూజన్ ఇవ్వబోతోందనేది వేచిచూడాలి!