బోర్డర్ లో ఓ ఉగ్ర కుట్ర భగ్నం... జార్ఖండ్ లో ఏటీఎస్ కి దొరికన మరో బ్యాచ్!
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ - పాక్ ల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 1 May 2025 11:30 AMపహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ - పాక్ ల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఉగ్ర కుట్రలకు సంబంధించిన రెండు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఇందులో ఒకటి సరిహద్దుల్లో కాగా.. మరొకటి జార్ఖండ్ లో! దీంతో.. రెండు ఆపరేషన్స్ భగ్నం కాకపోయి ఉంటే మరింత ప్రమాదం జరిగి ఉండేదని అంటున్నారు!
అవును... తాజాగా భారత్ – పాక్ బోర్డర్ లో ఉగ్ర కుట్ర భగ్నమైంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), పంజాబ్ పోలీసులు అమృత్ సర్ సమీపంలో సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో భారీగా ఆయుధాలు పట్టుబడ్డాయి. వాటిలో గ్రనేడ్లు, తుపాకులు ఉన్నాయని తెలుస్తోంది. ఇలా సరిహద్దుల్లో ఆయుధాలు పట్టుబడటం తీవ్ర కలకలం రేపుతోంది.
బీఎస్ఎఫ్ ఇంటిలిజెన్స్ వింగ్ ఇన్ఫర్మేషన్ మేరకు బుధవారం సాయంత్రం ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా దొరికిన ఆయుధాలను స్వాధీనం చేసుకుని, పోలీసులకు అప్పగించారు. ఈ ఉగ్ర కుట్ర భగ్నమవ్వడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని అంటున్నారు.
మరోపక్క... జార్ఖండ్ లోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) ధన్ బాద్ లో నలుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. ఈ నిందితులకు ఐసిస్, ఇండియన్ ముజాహిద్దీన్ లతో సంబంధాలున్నాయని తెలుస్తోంది. ఈ సందర్భంగా అదుపులోకి తీసుకున్న అనుమానిత ఉగ్రవాదుల నుంచి పోలీసులు అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
అందుతున్న సమాచారం ప్రకారం... ధన్ బాద్ జిల్లాలోని భూలి ఓపీ పోలీస్ స్టేషన్ పరిధిలోని షమ్షేర్ నగర్ లో అదుపులోకి తీసుకున్న నలుగురు అనుమానితుల్లో ఒకరు నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దిన్ లోని క్రియాశీల సభ్యుడు అమ్మర్ యాషర్ గా గుర్తించినట్లు తెలుస్తోంది. మిగిలిన ముగ్గురికి ఐసిస్ తో సంబంధలున్నాయని తేలినట్లు సమాచారం.
ఆ సంగతి అలా ఉంటే... మరోపక్క బంగ్లా సరిహద్దుల్లోనూ కలకలం మొదలైంది. మహ్మద్ యూనస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బంగ్లా – పాక్ మధ్య బంధం బలోపేతం అయ్యిన నేపథ్యంలో.. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐ.ఎస్.ఐ., మిలటరీ అధికారులు బంగ్లాదేశ్ లోని భారత్ సరిహద్దుల వైపు రవడం పేరిగిందని తెలుస్తోంది.
దీంతో... బంగ్లా – భారత్ ర్యాడికల్ గ్రూపులను వాడుకునే ఆలోచనలో పాకిస్థాన్ ఉన్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాలు వల్లడించాయి. ఈ నేపథ్యంలో... భారత భద్రతా ఏజెన్సీలు బంగ్లా సరిహద్దుల్లోని ముర్షిదాబాద్ వంటి పలు ప్రాంతాల్లోని పోస్టులపై దృష్టిపెట్టాయి.