Begin typing your search above and press return to search.

మోడీకి చెప్పుకో...ఉగ్ర మూర్ఖత్వానికి పరాకాష్ట !

ఉగ్రవాదానికి కులం మతం లేదు ప్రాంతం లేదు అన్నది నిన్నటి మాట. వారికి కులం మతం, ప్రాంతం అన్నీ ఉన్నాయి.

By:  Tupaki Desk   |   23 April 2025 4:38 AM
మోడీకి చెప్పుకో...ఉగ్ర మూర్ఖత్వానికి పరాకాష్ట !
X

ఉగ్రవాదానికి కులం మతం లేదు ప్రాంతం లేదు అన్నది నిన్నటి మాట. వారికి కులం మతం, ప్రాంతం అన్నీ ఉన్నాయి. వాటికి మించి రాజకీయం కూడా ఉంది అన్నది నిన్నటి అనంతనాగ్ జిల్లా పహల్గాం లో బైసరన్ ప్రాంతంలో చేసిన ఉగ్రవాదుల భయంకర దాడి.

పేరు అడిగి మతం అడిగి మరీ మట్టుబెట్టిన ఈ తరహా ఘాతుకం ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదు. భారత్ లో అశాంతిని అసంతృప్తిని తిరుగుబాటును రగిలించడమే ఉగ్రమూకల లక్ష్యమని అర్ధం అవుతోంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న తెర వెనక శక్తులకు భారత దేశం కంటగింపుగా మారిందా అన్నది కూడా ఆలోచించాలి.

ఆ విధంగా చూస్తే ఉగ్రవాదుల విషయంలో మోడీ మరింత కఠినంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ దారుణ మారణ హోమం చాటి చెబుతోని. భారత దేశం అన్నది లౌకిక పునాదుల మీద నిర్మితమైంది. ఇక్కడ అన్ని మతాలు సమానం. అందరికీ ఒకే రకమైన హక్కులు ఉంటాయి. అలాగే మన రాజ్యాంగం చెబుతోంది.

కానీ ఒక మతం వారిని ఏరి ఎంపిక చేసి మరీ కాల్చి చంపడం ద్వారా ఉగ్ర మూకలు ఈ దేశం లౌకిక వాదం మీద దెబ్బ కొట్టాలని అనుకున్నారా అన్నది కూడా చర్చగా ఉంది. అంతే కాదు ఈ దేశంలో అంతా ఒక దారానికి గుదిగుచ్చిన పూవుల మాదిరిగా అల్లుకునిపోయి అన్న దమ్ములుగా ఉంటున్న వేళ ఇలాంటి ఉగ్ర చేష్టలతో మూర్ఖత్వపు ఆలోచనలతో ఉగ్రవాదులు ఒక వర్గాన్ని చంపి ఏ రకమైన హెచ్చరికలు జారీ చేయాలని అనుకుంటున్నారు అన్నది ఆలోచించాల్సి ఉంది.

ఏది ఏమైనా మత ప్రాతిపదికన ఉగ్ర దాడి జరగడం ఈ దేశంలో తొలిసారి అని అంటున్నారు. ఏకంగా ముప్పయి మందికి పైగా అమాయకులను పొట్టన పెట్టుకోవడం, ఒక వర్గాన్నే టార్గెట్ చేయడం, మోడీతో చెప్పుకో అని సవాల్ లాంటి మాటలు విసరడం ద్వారా ఈ ఉగ్ర మూకలు భారీ లక్ష్యంతో ఈ మానవ వినాశానికి ఒడిగట్టారు అని అర్ధం అవుతోంది.

మరీ లోతుగా ఆలోచిస్తే ఇది ఒక పకడ్బందీ పధకం ప్రకారం చేసిన దాడిగానే చూడాలి. దీని మూలాలు చాలా కీలకంగా ఉన్నాయి. ఇది ఒక విధంగా అంతం కాని ఆరంభంగానే చూడాల్సి ఉంది. ఈ దేశంలో కీలక వర్గాలుగా ఉన్న వారి మధ్య గొడవలు పెట్టాలని అలాగే అశాంతితో జనాలు తిరుగుబాటు చేయాలని కూడా కుట్ర కోణం ఉందని భావిస్తున్నారు.

ఇంతటి భారీ ఉగ్ర దాడి వెనక పొరుగు హస్తం కూడా కచ్చితంగా ఉంటుందని ఊహిస్తున్నారు. భారత దేశంలో ఎలాగైనా ఘర్షణలు గొడవలు తీసుకుని రావడం ద్వారా అగ్గి మీద ఉంచాలన్న దాయాదుల పన్నాగం కూడా స్పష్టంగా కనిపిస్తోంది అని అంటున్నారు. ఇది కేవలం ఉగ్ర దాడి మాత్రమే కాదు, భారత లౌకిక పునాదుల మీద దాడి, దేశంలో అశాంతిని రేపడానికి జరిగిన దాడి, దేశంలో బలమైన వర్గాల మధ్య సామరస్యం దెబ్బ తీసే దాడిగా చూడాల్సి ఉందని అంటున్నారు. కేంద్రం సీరియస్ గానే ఈ విషయంలో ఉంది, చూడాలి మరి ఏమి జరుగుతుందో.