Begin typing your search above and press return to search.

కమలం నలిగిపోతోందా...?

అవును నిజమే కమలం మధ్యలో పడి నలిగిపోతోంది. వ్యూహాలతో ప్రధాన పార్టీలు జోరు చేస్తున్నాయి. ఇక అధికారంలో ఉన్నది బీయారెస్

By:  Tupaki Desk   |   30 Oct 2023 4:30 PM GMT
కమలం నలిగిపోతోందా...?
X

అవును నిజమే కమలం మధ్యలో పడి నలిగిపోతోంది. వ్యూహాలతో ప్రధాన పార్టీలు జోరు చేస్తున్నాయి. ఇక అధికారంలో ఉన్నది బీయారెస్. విపక్షంలో ఉంటూ అధికారం కోసం చూస్తోంది కాంగ్రెస్ ఈ రెండు పార్టీలలో పోటాపోటీగా పోరు సాగుతోంది. అక్కడ అసంతృప్తి ఉంటే వెళ్ళి కాంగ్రెస్ లో చేరుతున్నారు. కాంగ్రెస్ లో ఎవరికైనా టికెట్ రాకపోతే వెళ్ళి బీయారెస్ తో చేతులు కలుపుతున్నారు.

ఇక ఆ రెండు పార్టీల వ్యూహకర్తలు కూడా యమ స్పీడ్ గా ఉన్నారు. గేలం వేసి మరీ అసంతృప్తి ఉన్న నేతలను పట్టుకుని వస్తున్నారు. కేటీయార్ అయితే అలా వచ్చి వాలిపోతున్నారు. మాజీ మంత్రులు కాంగ్రెస్ బిగ్ షాట్స్ అయిన పొన్నాల లక్ష్మయ్య, నాగం జనార్ధనరెడ్డిలను స్వయంగా ఇళ్లకు వెళ్ళి మరీ ఆహ్వానించారు.

వారి మెడలో గులాబీ కండువాను వేశారు. ఇక బీజేపీ మీద కాంగ్రెస్ ఫోకస్ పెట్టేసింది. ఇంతకు ముందు కాంగ్రెస్ లో ఉండి బీజేపీలోకి వెళ్ళిన వారిని తన దారిలోకి తెచ్చుకునేందుకు ఏకంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రంగంలోకి దిగిపోతున్నారు. ఆయన తాజాగా మాజీ ఎంపీ వివేక్ ని కలసి చర్చలు జరిపారు. రేపో మాపో ఆయనను చేర్చుకునే సీన్ కనిపిస్తోంది.

ఆయన కంటే ముందు మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీ నుంచి లాగేశారు. ఇపుడు గద్వాల్ మహిళా నేత డీకే అరుణ మీద కూడా చూపు సారించారని అంటున్నారు. ఆ మాత్రం ఈ మాత్రం పలుకుబడి ఉన్న నేతలు ఎవరైనా బీజేపీ లో ఉంటే వారిని తెచ్చి మరీ హస్తం పార్టీ తమతో కలుపుకుంటోంది.

దీంతో ఎన్నికల వేళ విపక్షం ఓట్లు చీలకుండా ఉండేలా పధక రచన చేస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే అసలు బీజేపీలోకి ఎవరూ రావడంలేదు. అసమ్మతి లేదా అంటే రెండు ప్రధాన పార్టీలలో టికెట్ రాని వారు అంతా గగ్గోలు పెడుతున్నారు. అయినా కానీ వారి చూపు బీజేపీ మీద పడకపోవడం అంటే సర్వేశ్వరుల కంటే వారే అసలైన జోస్యం చెబుతున్నట్లుగా ఉంది అంటున్నారు.

ఇక బీజేపీలోకి చేరే వారు లేకపోవడం ఒక ఎత్తు అయితే ఉన్న వారిని కూడా తీసుకుపోవడంతో రెండిందాలుగా నష్టపోతోంది అని అంటున్నారు. దీని మీదనే ఇపుడు బీజేపీ నేత బండి సంజయ్ తనదైన కామెంట్స్ చేశారు. అన్ని పార్టీలు బీజేపీనే టార్గెట్ చేస్తున్నాయని బండి అంటున్నారు.

ఒక్క పార్టీ కాదు, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు అన్నీ బీజేపీ మీదనే పడిపోతున్నాయని ఆయన మండిపడ్డారు. ఇక ఈ మూడు పార్టీలు ఎప్పుడూ కలిసే ఉంటాయని ఆయన కొత్త ఆరోపణలు చశారు. ఢిల్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం పెట్టడమే అందుకు నిదర్శనమని బండి సంజయ్ అంటున్నారు. .

బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలది రాజకీయ అక్రమ సంబంధం అంటూ హీటెక్కించే కామెంట్స్ చేశారు. తమకు తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఓటింగ్ శాతం పెరుగుతోందని వెల్లడించారు. ఇన్ని చెప్పిన బండి సంజయ్ సీట్లు ఎన్ని వస్తాయో చెప్పడం లేదని అంటున్నారు. ఓట్ల శాతం పెరిగితే సీట్లు కూడా దక్కాలి కదా అంటున్నారు. మొత్తానికి చూస్తే రెండు మదపుటేనుగుల మధ్యన పడి లేగ దూడ నలిగినట్లుగా కమలం ఆశలు కకావికలు అవుతున్నాయా అన్న చర్చ అయితే సాగుతోంది.