Begin typing your search above and press return to search.

అసెంబ్లీకి కేసీఆర్...రేవంత్ కి ఎదురుగానే...!

తెలంగాణాలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం చేయడంతోనే బడ్జెట్ సమావేశాలు మొదలు అయ్యాయి

By:  Tupaki Desk   |   8 Feb 2024 5:04 PM GMT
అసెంబ్లీకి కేసీఆర్...రేవంత్ కి ఎదురుగానే...!
X

తెలంగాణాలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం చేయడంతోనే బడ్జెట్ సమావేశాలు మొదలు అయ్యాయి. ఈ నెల 10న ఆర్ధిక మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక ఒక దఫా అసెంబ్లీ సెషన్ నడచింది. అందులో కొత్త సభ్యులు అంతా ప్రమాణం చేసారు.

అప్పట్లో తుంటి ఎముకకు గాయం తగలడంతో కేసీఅర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేయలేదు. ఇక ఇటీవల ఆయన స్పీకర్ చాంబర్లో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఇదిలా ఉంటే కీలకమైన బడ్జెట్ సమావేశాలు మొదలైన వేళ ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ హాజరు అవుతోంది. ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సభకు వస్తారా అన్న చర్చ అయితే ఇంతకాలం నడచింది.

కేసీఆర్ అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తారు అని కూడా ప్రచారం సాగింది. కానీ కేసీఆర్ మాత్రం ఎమ్మెల్యేగా ఉంటూ అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషించాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. అందులో భాగంగానే ఆయన ఈ నెల 10న అసెంబ్లీకి వస్తున్నారు అని అంటున్నారు.

దాంతో ఒక రేర్ సీన్ ని ఆ రోజున అంతా చూసే అవకాశం వస్తోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటే విపక్ష నేతగా కేసీఆర్ ఉండడం ఇద్దరూ ఎదురుగా ఉండడం మాత్రం ఆసక్తిని రేపే అంశంగా అంతా చూస్తున్నారు. ఇక కేసీఅర్ అసెంబ్లీకి హాజరై కాంగ్రెస్ ప్రభుత్వం మీద తనదైన శైలిలో విమర్శలు చేస్తారని నిలదీస్తారని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ రెండు నెలల పాలన వైఫల్యాలను ఆయన సభ నుంచే ఘాటైన విమర్శలు చేయడం ద్వారా జనంలో చర్చకు పెడతారు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి 2014లో టైం లో విపక్షంలో ఉండేవారు. ఆయన టీడీపీ తరఫున నాయకుడిగా ఉంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ని నిలదీసేవారు. అయితే అప్పట్లో ఆయన ప్రశ్నలకు కేసీఆర్ లైట్ తీసుకుంటూ జవాబు చెప్పేవారు. ఒక్కోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా రేవంత్ మీద మాటల దాడి చేసేవారు.

ఆ తరువాత 2018 నాటికి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓటమి చూశారు. తిరిగి 2023లో ఆయన ఎమ్మెల్యేగా గెలవడం సీఎం కావడం జరిగిపోయాయి. ఒక విధంగా చూస్తే దాదాపుగా ఆరేళ్ల తరువాత కేసీఆర్ రేవంత్ రెడ్డి ఒకే సభలో కనిపించబోతున్నారు. ఇక ఈ ఇద్దరు పాత్రలు పొజిషన్లూ కూడా మారిపోయాయి. ఆనాడు అపోజిషన్ బెంచ్ లలో ఒక విపక్ష నేతగా రేవంత్ రెడ్డి ఉంటే ఇపుడు ఆయనే సభా నాయకుడిగా సీఎం గా ఉంటున్నారు.

అదే టైం లో కేసీఆర్ పదేళ్లుగా ఎదురులేకుండా అసెంబ్లీని ముఖ్యమంత్రి హోదాలో నడిపించారు. ఇపుడు ఆయన అధ్యక్షా అంటూ ప్రభుత్వం మీద విమర్శలు చేయాల్సి ఉంది. మరి కేసీఆర్ విమర్శలకు రేవంత్ కూడా తగిన జవాబు ఇస్తారు. ఇద్దరూ మాటకారులే. .దాంతో ఈ నెల 10న సభ మాత్రం రసవత్తరంగా ఉండే చాన్స్ ఉంది అంటున్నారు.