Begin typing your search above and press return to search.

తెలంగాణ మంత్రికి హైకోర్టులో ఊరట!

ఇదే క్రమంలో తెలంగాణ మంత్రి, మహబూబ్‌ నగర్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక వివాదంపైన హైకోర్టులో పిటిషన్‌ ఉన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 Oct 2023 8:25 AM GMT
తెలంగాణ మంత్రికి హైకోర్టులో ఊరట!
X

తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో పలు అక్రమాలకు పాల్పడ్డారని, అఫిడవిట్లలోనూ తప్పుడు సమాచారం ఇచ్చారని పలువురు బీఆర్‌ఎస్‌ నేతలపై హైకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుల సభ్యత్వాలను హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరూ సుప్రీంకోర్టుకు వెళ్లి ఊరట పొందారు.

ఇదే క్రమంలో తెలంగాణ మంత్రి, మహబూబ్‌ నగర్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక వివాదంపైన హైకోర్టులో పిటిషన్‌ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ పిటిషన్‌ ను హైకోర్టు కొట్టేసింది. శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక చెల్లదని.. ఈ మేరకు ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్‌ ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక చెల్లదంటూ 2019లో మహబూబ్‌ నగర్‌ కు చెందిన రాఘవేంద్రరాజు పిటిషన్‌ దాఖలు చేశారు.

శ్రీనివాస్‌గౌడ్‌ 2018లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం అందించారని రాఘవేంద్రరాజు తన పిటిషన్‌ లో పేర్కొన్నారు. ఎన్నికల అఫిడవిట్‌ ను ఒకసారి రిటర్నింగ్‌ అధికారికి సమర్పించి.. మళ్లీ వెనక్కి తీసుకుని సవరించి అందజేశారని ఆరోపించారు. ఇది చట్టవిరుద్ధమని.. ఆయన ఎన్నికను రద్దు చేయాలని తన పిటిషన్‌ లో హైకోర్టుకు విన్నవించారు. ఇరు వర్గాల తరఫున వాదనలు విన్న ధర్మాసనం తాజాగా పిటిషన్‌ ను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది.

విచారణలో భాగంగా గతంలో అడ్వకేట్‌ కమీషన్‌ ను హైకోర్టు నియమించగా.. అడ్వకేట్‌ కమీషన్‌ ముందు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ నేరుగా విచారణకు హాజరయ్యారు. అనంతరం అడ్వకేట్‌ కమిషన్‌ తన నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో ఇరువురి వాదనలు పూర్తి అవగా... చివరకు శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దీంతో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కు ఊరట లభించింది.