Begin typing your search above and press return to search.

లోకేష్ కో లక్ష... చంద్రబాబుకో లక్ష....!

లక్షలు కావాలి. అది కూడా తండ్రీ కొడుకులు ఇద్దరికీనూ. చంద్రబాబుకు లక్ష లోకేష్ కి మరో లక్ష

By:  Tupaki Desk   |   28 Dec 2023 3:58 AM GMT
లోకేష్ కో లక్ష... చంద్రబాబుకో లక్ష....!
X

లక్షలు కావాలి. అది కూడా తండ్రీ కొడుకులు ఇద్దరికీనూ. చంద్రబాబుకు లక్ష లోకేష్ కి మరో లక్ష. సొమ్ములు అనుకుంటున్నారా కాదు. మెజారిటీ. లక్ష ఓట్ల మెజారిటీతో ఇద్దరినీ గెలిపించాలని పార్టీ నేతలు కోరుతున్నారు. ఇటీవల చంద్రబాబు కుప్పం నియోజకవర్గం విషయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో లక్షకు తగ్గకుండా మెజారిటీ రావాలని కోరారు. ఆ విధంగా క్యాడర్ మొత్తం పనిచేయాలని పిలుపు ఇచ్చారు.

ఇపుడు చూస్తే లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. పాదయాత్ర తర్వాత లోకేష్ మంగళగిరి వచ్చారు. అంతే పదకొండు నెలల తరువాత అన్న మాట. ఈ సందర్భంగా లోకేష్ ని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని పార్టీ నేతలు కోరారు.

ఓడినా ప్రజల వద్దనే లోకేష్ ఉన్నారని పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. సొంత నిధులు వెచ్చించి లోకేష్ మంగళగిరిని అభివృద్ధి చేసారని కూడా వారు క్యాడర్ కి వివరించారు. లోకేష్ మాట్లాడుతూ తన తొలి ఓటమి కసిని పెంచిందని అన్నారు లోకేష్ అంటే ఎవరో తెలియక 2019 ఎన్నికల్లో ప్రజలు ఓడించారు అన్నారు. ప్రజలు చాలా మంచి వారు అని లోకేష్ చెప్పారు. వారి తప్పు ఏమీ లేదని అన్నారు.

ఇదిలా ఉంటే తన తండ్రి చంద్రబాబు మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేస్తావా అని అడిగారు అని లోకేష్ చెప్పారు. అయితే తప్పకుండా అక్కడ నుంచే చేస్తాను అని చెప్పానని లోకేష్ అన్నారు. ఈసారి తన విజయం ఖాయమని చెప్పారు.

మంగళగిరిలో టీడీపీ గెలిచి చాలా దశాబ్దాలు అయిందని అటువంటి సీటుని తాను ఎంచుకున్నానని ఈసారి మాత్రం కంచుకోటను చేసి తీరుతాను అని లోకేష్ చెప్పారు. మొత్తానికి చూస్తే లోకేష్ కి లక్ష ఓట్ల మెజారిటీ ఇవ్వాలని టీడీపీ పిలుపు ఇవ్వడం విశేషం. మరి అనుకున్నట్లుగా కుప్పంలో బాబుకు లక్ష మంగళగిరిలో చినబాబుకు లక్ష ఓట్లు మెజారిటీని తమ్ముళ్ళు తెస్తారా అంటే వెయిట్ అండ్ సీ.