Begin typing your search above and press return to search.

టీడీపీ సేన కూటమికి ఓట్లు ట్రాన్స్ ఫర్ అవుతాయా...!?

By:  Tupaki Desk   |   25 Feb 2024 2:45 AM GMT
టీడీపీ సేన కూటమికి ఓట్లు ట్రాన్స్ ఫర్ అవుతాయా...!?
X

టీడీపీ జనసేన కూటమి అసలు లక్ష్యం వైసీపీని గద్దె దించడం. పై స్థాయిలో చూస్తే పవన్ చంద్రబాబు గురి అటు వైపే ఉంది. సరే వారికి కరెక్ట్ గానే ఉంది అనుకుంటే గ్రౌండ్ లెవెల్ లో కూడా అలాగే ఉండాలి కదా. వారికి ఆ గురి ఎపుడు వస్తుంది అంటే రెండు పార్టీల పొత్తుల మీద సీట్ల మీద గురి కుదిరినపుడు. ఇపుడు జనసేనకు టీడీపీ ఇచ్చే సీట్లు చూస్తే ఆ నమ్మకం ఎవరికైనా వస్తుందా అంటే అది మిలియన్ డాలర్ ప్రశ్న అయితే కావచ్చు కానీ జవాబు వెరీ సింపుల్ ఓట్లు ట్రాన్స్ ఫర్ కావు అని.

ఆ మాట తలపండిన రాజకీయ నేత చెప్పడం లేదు సగటు జనసేన క్యాడర్ చెబుతోంది. ఇక జనసేన కీలక నేతలు కూడా ఇదే విషయం మీద రగిలిపోతున్నారు. మరీ ఇంత తక్కువ నంబరా అని ఒక టీవీ చానల్ లో జనసేన సీనియర్ నేత బొలిశెట్టి సత్య ఆవేదన వ్యక్తం చేశారు. జనసేనకు ఇచ్చిన ఈ తక్కువ నంబర్ చూసి పవన్ కళ్యాణ్ కూడా ఏ మాత్రం సంతోషంగా ఉండరు అని తాను కచ్చితంగా చెప్పగలను అని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ కి ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు అని బొలిశెట్టి సత్య అన్నారు. ఆయనే కాదు చాలా మంది ఇదే అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో గట్టిగా సీట్లు బేరమాడాల్సింది అని కూడా అంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలలో పవన్ కళ్యాణ్ గత ఏడాది చేసిన వారాహి యాత్రకు జనాలు పోటెత్తారు. అయితే పవన్ చివరికి పొత్తు కలిపారు. దాంతో సీట్లు కోసం చూసిన వారు అంతా నీరు కారారు.

కాపు నేతలతో పాటు జనసేన నేతలు అంతా అంటున్నది ఒక్కటే తమకు డెబ్బై సీట్లలో బలం ఉంది. సొంతంగా పోటీ చేస్తే ఉభయ గోదావరి ఉత్తరాంధ్రలో ఏకంగా ముప్పయి అయిదు నుంచి నలభై సీట్ల దాకా గెలవవచ్చు. కానీ ఏపీ ప్రయోజనాలే ముఖ్యం అనుకుని పొత్తుకు పవన్ వచ్చారు అని.

టీడీపీ కష్టకాలంలో అండగా నిలిస్తే తమకు ఇంత తక్కువ సీట్లు ఇస్తారా ఇది గౌరవప్రదం కానే కాదు పూర్తి అవమానం అని అంటున్నారు. ఈ విధంగా అయితే ఓట్ల బదిలీ జరగనే జరగదు అని హెచ్చరిస్తున్నారు. టీడీపీ తమకు తగిన షేరింగ్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

అంతే కాదు, రేపు టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే పవన్ కి ఇచ్చే పోస్టు ఏమిటి, జనసేనకు ఇచ్చే అవకాశాలు ఏమిటి అన్ని జనంలో పెట్టి ఎన్నికలకు వెళ్తేనే ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. లేకపోతే మాత్రం వైసీపెయే గెలుస్తుంది అని తేల్చేస్తున్నారు.

ఇదే విషయం కాపు నేత రాజకీయ కురు వృద్ధుడు చేగొండి హరిరామ జోగయ్య కూడా చెప్పారని అంటున్నారు. చంద్రబాబు అయినా పవన్ అయినా మరోసారి కూర్చుని జనసేనకు ఇచ్చే సీట్లు కచ్చితంగా ఇంతకు ఇంతా పెంచాలని కోరుతున్నారు. టీడీపీ జనసేనతో పొత్తు ఎందుకు పెట్టుకుంది అన్నాది బాబుకు తెలుసు అని అధికారంలోకి రావడం కోసమే ఈ పొత్తు లక్ష్యం అయినపుడు సీట్ల షేరింగ్ వద్ద కూడా అదే కనిపించాలి కదా అని నిలదీస్తున్నారు.

మొత్తానికి చూస్తే జనసేనను కేవలం మైనర్ పార్టనర్ గా చూపించి ఎన్నికల్లో టీడీపీ లబ్ది పొందాలని చూస్తోందన్న భావన అయితే జనసైనికులలో ఏర్పడింది. పేరుకు ఎన్నో కొన్ని సీట్లు ఇవ్వడం తప్ప నిజానికి మిత్రపక్షంగా జనసేనకు తగిన గౌరవం అయితే దక్కలేదు అన్న ఆవేదన ప్రతీ జనసైనికునిలో ఉంది అని అంటున్నారు.

జనసేనను విశ్వాసంలోకి తీసుకోవాలని కనీసంగా అయిదు ఎంపీ అలాగే నలభైకి తగ్గకుండా ఎమ్మెల్యే సీట్లు ఇస్తేనే పొత్తు సఫలం అవుతుంది, ఎత్తుగడ పారుతుంది అని అంటున్నారు. మరి తొలి జాబితా రిలీజ్ చేసిన సందర్భంగా చంద్రబాబు అన్న మాటలు చూస్తే జనసేన 24 సీట్లలో పోటీ చేస్తుంది. మూడు ఎంపీ సీట్లు ఇస్తున్నామని చెప్పారు. అంటే మిగిలిన సీట్లలో టీడీపీ పోటీ చేస్తుందని ఆయన అంటున్నారు. దీనిని బట్టి జనసేనకు ఇవేనా సీట్లు అన్న చర్చ వస్తోంది. అదే జరిగితే ఓట్లు బదిలీ కానే కాదు అంటున్నారు. ఇదే జన సైనికుల మనోగతం అని అంటున్నారు.