Begin typing your search above and press return to search.

జూనియర్ తో చంద్రబాబు సంచలన భేటీ...వేదిక అక్కడ...?

నారా ప్లస్ నందమూరి ఇదీ చంద్రబాబు మాస్టర్ ప్లాన్. ఇప్పటికే తెలుగుదేశం పార్టీని పొత్తుల దిశగా బాబు నడిపిస్తున్నారు

By:  Tupaki Desk   |   26 Aug 2023 8:47 AM GMT
జూనియర్ తో చంద్రబాబు సంచలన భేటీ...వేదిక అక్కడ...?
X

నారా ప్లస్ నందమూరి ఇదీ చంద్రబాబు మాస్టర్ ప్లాన్. ఇప్పటికే తెలుగుదేశం పార్టీని పొత్తుల దిశగా బాబు నడిపిస్తున్నారు. జనాల్లో క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ జనసేనతో పొత్తులు ఉంటాయని భావిస్తున్నారు. ఇపుడు దానికి మరికాస్తా కొత్త శక్తులను జోడించడానికి బాబు చేస్తున్న మరో ప్రయత్నమే జూనియర్ ఎన్టీఆర్ తో సంచలన భేటీ అని అంటున్నారు.

టీడీపీకి నందమూరి ఫ్యామిలీ ఆక్సిజన్. అందునా మూడవ తరం హీరోగా పాన్ ఇండియా లెవెల్ నుంచి గ్లోబల్ స్థాయికి వెళ్ళిన జూనియర్ ఎన్టీఆర్ ని టీడీపీతో కనెక్ట్ చేస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. ఏపీలో 2024 ఎన్నికలు టీడీపీకి చావో రేవో అన్నట్లుగా మారాయి.

ఒక వైపు వైసీపీ పట్ల జనంలో పూర్తి వ్యతిరేకత ఉందని, 160 సీట్లు ఖాయమని టీడీపీ నేతలు చెబుతూ వస్తున్నారు. పవన్ జనసేనతో పొత్తులు కూడా ఉంటాయని అంటున్నారు. చివరి నిముషంలో బీజేపీని తమ దారిలోకి తెచ్చుకునే ఎత్తుగడ ఎటూ ఉంది. అయినా సరే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదు అన్నదే రాజకీయ చాణక్యుడు చంద్రబాబు ఆలోచన అని అంటున్నారు.

టీడీపీకి ఇంధనంగా జూనియర్ ఎన్టీఆర్ ఉపయోగడపడతారు అన్నది బాబుకు తెలుసు అంటున్నారు. జూనియర్ కోసం ఇప్పటికైతే చాలా ప్రయత్నాలు చేశారు. ఆ మధ్యన హైదరాబాద్ లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను నిర్వహించారు. దానికి చాలా మంది హాజరయ్యారు. జూనియర్ ని పిలిచినా ఆ టైం కి విదేశాలకు వెళ్లిపోయారు. అలా బాబుతో జూనియర్ భేటీ జరగకుండా పోయింది.

అయితే ఇపుడు మరో బంగారం లాంటి అవకాశం వస్తోంది. నిజానికి దాని కోసం చాలా కాలంగా చంద్రబాబు ఎదురు చూస్తున్నారు అని అంటున్నారు. ఈ నెల 28న ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్ లో ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయలు వెండి నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి మొత్తం ఎన్టీఆర్ ఫ్యామిలీతో పాటు సన్నిహితులు అంతా హాజరవుతున్నారు. ఇలా ఎవరెవరిని ఆహ్వానించాలి అన్న బాధ్యతను ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి మీద ఉంచారని అంటున్నారు. దాంతో ఆమె భవిష్యత్తు రాజకీయాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ ఆహ్వానాల లిస్ట్ ప్రిపేర్ చేశారు అని అంటున్నారు

ఈ కార్యక్రమానికి హాజరు కావాలని జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రాం ని ప్రత్యేకంగా పురంధేశ్వరి ఆహ్వానించారు అని అంటున్నారు. తప్పకుండా రావాలని కోరారని అంటున్నారు. ఇక చంద్రబాబు అయితే ఒక రోజు ముందే ఢిల్లీ చేరుకుంటారు అని అంటున్నారు. ఈ సందర్భంగా జూనియర్ బాబు ఒకే చోట ఒకే వేదిక మీద కనిపిస్తారు అని అంటున్నారు.

అది అక్కడితో ఆగిపోదని ఢిల్లీ వేదికగా ఈ ఇద్దరూ భేటీ అయ్యే చాన్స్ ఉందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ బ్లడ్ అయిన జూనియర్ టీడీపీకి విగరస్ గా ప్రచారం చేస్తే ఆ కిక్కే వేరు, ఆ లెక్కే వేరుగా ఉంటుందని భావిస్తున్నారు. జూనియర్ బాబు భేటీ అయితే మాత్రం కచ్చితంగా జూనియర్ ని ఒప్పించగలరని అంటున్నారు. మొత్తానికి అందరి చూపులూ ఈ నెల 28న ఢిల్లీలో ఏమి జరుగుంది అన్న దాని మీదనే ఉన్నాయని అంటున్నారు. జూనియర్ ఢిల్లీకి వచ్చి ఈ వేడుకలో పాలు పంచుకుంటే బాబు తో భేటీ అయినట్లే అంటున్నారు.