Begin typing your search above and press return to search.

నెట్టింట వైరల్ గా... టీడీపీ - బీజేపీ పాత వీడియోలు!

ఈ సమయంలో టీడీపీ - బీజేపీ పొత్తులు పెట్టుకున్న నేపథ్యంలో... గతంలో ఆయా నేతలు ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

By:  Tupaki Desk   |   10 March 2024 1:30 PM GMT
నెట్టింట వైరల్  గా... టీడీపీ - బీజేపీ పాత వీడియోలు!
X

ఒకప్పుడు రాజకీయ నాయకులు ఏమి మాట్లాడిన వాటికి సంబంధించిన పేపర్ కటింగ్స్ తప్ప ఆడియో, వీడియో ఆధారాలు ఉండేవి కావు! దీంతో... కాస్త అటు ఇటుగా మాట్లాడినా అది పెద్దగా ప్రజల్లోకి వెళ్లేది కాదు. అయితే ఇప్పుడు ఉన్నది డిజిటల్ యుగం. ఇక్కడ ప్రతీదీ రికార్డెడ్. టీవీల్లో సైతం స్క్రీన్ ని రెండుగా చూపిస్తూ బహిరంగంగా నిలబెట్టే పరిస్థితి వచ్చేసింది. అందుకే నేతలు ఏమి మాట్లాడినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలని అంటారు.

అవును.. ఇప్పుడున్నది డిజిటల్ యుగం. ప్రజలు ప్రతీదీ నిశితంగా పరిశీలిస్తున్న యుగం. ఎవరు ఏమి మాట్లాడినా.. ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా.. క్షణాల్లో చేతిలోని ఫోన్ లో ప్రత్యక్షమయ్యే రోజులు ఇవి. ఈ సమయంలో టీడీపీ - బీజేపీ పొత్తులు పెట్టుకున్న నేపథ్యంలో... గతంలో ఆయా నేతలు ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.

టీడీపీ - బీజేపీ మరోసారి జతకట్టిన సంగతి తెలిసిందే. ఎట్టిపరిస్థితుల్లోనూ 2014నాటి ఫలితాలు సాధించాలని భావిస్తున్న టీడీపీ... బీజేపీ, జనసేనలను కలుపుకుని ఎన్నికలకు వెళ్తుంది. అయితే... 2014 ఎన్నికల్లో కూడా పొత్తుపెట్టుకుని, గెలిచి, నాలుగేళ్ల తర్వాత ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఈ సందర్భంగా మోడీపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు చేసిన వ్యాఖ్యలు.. చంద్రబాబుపై మోడీ చేసిన విమర్శలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

ఇందులో భాగంగా... 2019 ఎన్నికలకు ముందు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో సైతం జకట్టిన చంద్రబాబు.. ఆ సమయానికి నాలుగు రోజుల ముందు, తర్వాత.. ప్రధానంగా నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. "నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది.. ఏపీకి అన్యాయం చేసిన వ్యక్తి మోడీ.. ఏపీలో బీజేపీ లేదు, మనతో కలిసాకే వాళ్లు గెలిచారు, బీజేపీతో పొత్తు లేకపోతే మరో 15 సీట్లు గెలిచేవాళ్లం" అని బాబు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

ఇదే సమయంలో మరింత ఫైరయిన బాబు... "నరేంద్ర మొడీ గౌరవం లేని వ్యక్తి.. అబద్ధాలు, అసత్యాల కోరు.. కనీసం దండం పెడితే తిరిగి దండం పెట్టే సంస్కారం లేని వ్యక్తి మోడీ.. భార్యనే చూసుకోనివాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు తమ్ముళ్లూ" అంటూ బాబు ఫైర్ అయిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలో బాబుకు తోడు పవన్ కలాణ్ కూడా "లడేంగే.. లడేంగే" అంటూ చేసిన వ్యాఖ్యల వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.

"యూటర్న్ బాబూ కేలియే, టీడీపీ కేలియే, పోలవరం ప్రాజెక్ట్ ఏటీఎం హై.. ఏటీఎం... " అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలకు సంబందించిన వీడియోలూ నెట్టింట సజీవంగా ఉన్నాయి! దీంతో... వీరి నాటి విడాకుల వీడియోలు కొత్త కాపురంపై ఎలాంటి ప్రభావం చూపబోతాయో అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.