అమిత్ షాకు వరస ఫిర్యాదులు... వైసీపీ సంగతేంటి ?
కేంద్ర హోం మంత్రి గా దేశానికి పెద్దగా కీలకమైన స్థానంలో ఉన్నారు అమిత్ షా. ఆయన ఎన్డీయే కూటమికి అత్యంత ప్రధాన సూత్రధారి.
By: Tupaki Desk | 10 April 2025 7:30 PMకేంద్ర హోం మంత్రి గా దేశానికి పెద్దగా కీలకమైన స్థానంలో ఉన్నారు అమిత్ షా. ఆయన ఎన్డీయే కూటమికి అత్యంత ప్రధాన సూత్రధారి. ఇక ఎన్డీయేకు ఏపీలో తెలుగుదేశం పార్టీ ఇస్తున్న మద్దతు ప్రాణ వాయువుగా ఉంది. తెలుగుదేశం పార్టీకి కేంద్ర ప్రభుత్వం వద్ద మంచి పలుకుబడి ఉందని అనేక సార్లు రుజువు అయింది.
ఏపీ ఇప్పటిదాకా దానిని రాష్ట్ర అభివృద్ధి కోసమే వాడుకుంటోంది. ఏపీ పునర్ నిర్మాణమే తమ లక్ష్యంగా చేసుకుంది. అయితే ఇపుడు రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందా అన్న కొత్త చర్చ అయితే సాగుతోంది. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఇటీవల కాలంలో కేంద్ర హోం మంత్రికి వైసీపీ మీద దాని అధినాయకత్వం మీద వరస ఫిర్యాదులు వెళ్తున్నాయి.
ప్రతీ విషయం మీద సమగ్రమైన నివేదికతో తెలుగుదేశం పార్టీ ఎంపీ. లోక్ సభలో ఆ పార్టీ నాయకుడు అయిన లావు శ్రీకృష్ణదేవరాయలు అందిస్తున్నారు. లేటెస్ట్ గా ఆయన ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మీద కీలక అంశాలతో అమిత్ షాకు ఫిర్యాదు చేశారు.
ఏపీలో జగన్ పర్యటనలు లా అండ్ ఆర్డర్ కి విఘాతంగా ఉన్నాయని తీవ్ర వ్యాఖ్యలు అందులో చేశారు. ఆయన వ్యవహార శైలి వల్ల ఏపీలో శాంతి భద్రతల స్థానంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఇక జగన్ మీద 11 దాకా సీబీఐ కేసులు తొమ్మిది దాకా ఈడీ పెట్టిన కేసులు ఉన్నాయని ఆయన గత 12 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నారని కూడా పేర్కొన్నారు.
ఏపీలో ఆయన వైఖరి లా అండ్ ఆర్డర్ కి ముప్పుగా మారుతోందని కూడా ఆక్షేపించారు. ఇక జగన్ చేస్తున్న వ్యాఖ్యలు పోలీసుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీసేలా ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు. జగన్ బెయిల్ మీద ఉన్న వ్యక్తి అని ఆయన కీలక వ్యవస్థలను బెదిరిస్తున్నారని కూడా లావు పేర్కొన్నారు.
జగన్ ఈ విషయంలో బెయిల్ నిబంధనలను ఉల్లఘిస్తున్నారని కూడా ఆయన పేర్కొన్నారు. ఏకంగా ప్రజాస్వామ్యానికి కూడా హాని కలిగించేలా జగన్ తీరు ఉందని అన్నారు. ఇక దీనికి కొద్ది రోజుల క్రితమే లావు శ్రీకృష్ణదేవరాయలు ఏపీలో జగన్ హయాంలోనే లిక్కర్ స్కాం జరిగింది అని లోక్ సభ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు.
ఏపీలో వైసీపీ ఏలుబడిలో జరిగిన లిక్కర్ స్కాం మీద కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కూడా స్వయంగా కేంద్ర హోం మంత్రిని కలసి కోరారు. మరి ఈ విధంగా జగన్ మీద ఆయన చేస్తున్న ఫిర్యాదుల మీద కేంద్ర హోం శాఖ ఏ విధంగా తీసుకుంటుంది అన్నది చర్చగా ఉంది
జగన్ అయితే ఎన్డీయే కూటమిలో లేరు తాజాగా వైసీపీ వక్ఫ్ బిల్లుకు యాంటీగా ఓటు చేసింది. అయితే రాజకీయాల్లో రెండూ రెండూ నాలుగు కావు మూడూ కావు రెండూ కావు. ఎవరికి ఎలా అనుకుంటే అలాగే అవుతాయి అని అంటారు.
వైసీపీ విషయం తీసుకుంటే బీజేపీతో ఆ పార్టీ రిలేషన్స్ ఏమిటి అన్నవి ఎవరికీ తెలియవు అనే అంటున్నారు. ఇక బీజేపీ కూడా కాంగ్రెస్ ని టార్గెట్ చేసినట్లుగా మరే పార్టీని చేయదని అంటున్నారు. ఆ పార్టీకి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తోనే ఇబ్బంది అని అంటున్నారు. ఆ పార్టీతో అంటకాగిన పార్టీల విషయంలోనూ కొంత కన్నెర్ర చేస్తుంది అని గుర్తు చేస్తున్నారు
అయితే ఏపీలో ఎన్డీయే భాగస్వాములుగా తెలుగుదేశం జనసేన ఉన్నాయి. ఈ రెండు పార్టీలూ ఏపీలో వైసీపీని దెబ్బ తీయాలని చూస్తున్నాయి. వీటి ఒత్తిడి బీజేపీ మీద గట్టిగానే ఉండొచ్చు అని అంటున్నారు. అందువల్ల రాజకీయాల్లో ఏపుడు ఏమైనా జరగవచ్చు అన్నది కూడా ఉంది చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఏపీలో చూస్తే వైసీపీ వద్ద రాజకీయ వ్యూహాలు అయితే ఏమి ఉన్నాయో బాహాటంగా తెలియడం లేదు. ఆ పార్టీ ఇలాగే ఢీ కొడుతూ రాజకీయం చేస్తుందా లేక ఇబ్బందులో పడుతుందా అన్నది చూడాల్సి ఉంది