రోజా కబ్జా చేశారు.. టీడీపీ ఆఫీసుకు ఫిర్యాదు
ఏదైనా సమస్య ఎదురైతే ఎవరైనా ఏం చేస్తారు? సంబంధిత ప్రభుత్వ ఆఫీసులకు వెళతాడు. ఏదైనా తప్పుడు పనులు చేస్తే పోలీసుల్ని ఆశ్రయిస్తారు.
By: Tupaki Desk | 4 May 2025 7:55 AMఏదైనా సమస్య ఎదురైతే ఎవరైనా ఏం చేస్తారు? సంబంధిత ప్రభుత్వ ఆఫీసులకు వెళతాడు. ఏదైనా తప్పుడు పనులు చేస్తే పోలీసుల్ని ఆశ్రయిస్తారు. ఎక్కడైనా ఇలానే జరుగుతుంది. కానీ.. ఇలాంటి ఇష్యూలను సరికొత్తగా డీల్ చేసే టాలెంట్ ఏపీ ప్రజల్లో కనిపిస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి సీన్ ఒకటి వెలుగు చూసింది. ఏపీ మాజీ మంత్రి.. వైసీపీ సీనియర్ నేత.. ఫైర్ బ్రాండ్ గా పేరున్న సినీ నటి ఆర్కే రోజాపై భూకబ్జా ఆరోపణలు ఫిర్యాదు రూపంలో తెర మీదకు వచ్చాయి. అయితే.. ఈ భూకబ్జాకు సంబంధించిన కంప్లైంట్ పోలీసులకో.. రెవెన్యూ అధికారులకో కాకుండా.. ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం హెడ్డాఫీసులో చేయటం విశేషం.
చిత్తూరు జిల్లా విజజయపురం మండలం కలింబాకకు చెందిన టీఎన్ టీయూసీ నేత గుణశేఖర రెడ్డి కొత్త ట్రెండ్ కు తెర తీశారు. తాజాగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ఆయన.. తన ఫిర్యాదునుఅక్కడి వారికి ఇచ్చారు. ఆయన వాదన ఏమంటే.. తన తండ్రి నగరికొండ సమీపంలోని జ్యోతినగర్ లో 1982లో స్థలాన్ని కొన్నారని.. దాన్ని మాజీ మంత్రి ఆర్కే రోజా.. ఆమె భర్త సెల్వమణి.. నగరి పురపాలక సంఘం ఛైర్మన్ లతో కలిసి మీనాకుమార్ అనే వ్యక్తి కబ్జా పెట్టినట్లుగా ఆరోపించారు.
తన స్థలంలో రేకుల షెడ్ వేశారని.. పోలీసులు సైతం స్పందించటం లేదని.. వీరంతా కలిసి పోలీసులని ప్రలోభాలకు గురి చేసినట్లుగా ఆరోపించారు. ఇటీవల కాలంలో వివిధ సమస్యలతో పార్టీ హెడ్డాఫీసుకు వచ్చే వారి నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్న నేపథ్యంలో.. తాజా ఫిర్యాదు తెర మీదకు వచ్చింది. మరి.. మాజీ మంత్రి ఆర్కే రోజాపై వచ్చిన కంప్లైంట్ కు ఏ తరహా చర్యలు ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.