రామ్మోహన్ నాయుడికి కీలక బాధ్యతలు?
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనగానే యువత నారా లోకేశ్ గుర్తుకొస్తారు.
By: Tupaki Desk | 28 May 2025 11:30 AMతెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనగానే యువత నారా లోకేశ్ గుర్తుకొస్తారు. కానీ, పార్టీలో మరో జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్నారు ఆయనే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. లోకేశ్ పాటే రెండుసార్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రామ్మోహన్ నాయుడికి ఈ సారి కీలక బాధ్యతలు అప్పగిస్తారని టీడీపీ వర్గాల సమాచారం. ఇప్పటికే యువనేత లోకేశ్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఖరారు చేసిన నేపథ్యంలో రామ్మోహన్ నాయుడికి ఏ బాధ్యతలు అప్పగిస్తారనేది ఇంట్రస్టింగుగా మారింది.
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకి తెలుగుదేశం పార్టీలో ప్రత్యేక స్థానం ఉంది. వరుసగా మూడుసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన రామ్మోహన్ నాయుడికి ఈ సారి కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చారు. మరోవైపు ఆయన బాబాయ్ అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారుజ పార్టీ మరేనేతకు కూడా ఇలాంటి అవకాశం దక్కలేదు. దానికి కారణం దివంగత నేత ఎర్రన్నాయుడిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్న గౌరవంగానే చెబుతారు. తన కుమారుడు లోకేశ్ తోపాటు పార్టీలో రామ్మోహన్ కు చంద్రబాబు సమాన స్థానం అవకాశాలు కల్పిస్తున్నారు. పార్టీ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత జోడెద్దుల్లా ఆ ఇద్దరికీ అప్పగించాలని ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారని అంటున్నారు.
టీడీపీలో ఎందరో సీనియర్ నేతలు ఉన్నప్పటికీ మహానాడు నిర్వహణ బాధ్యతలను రామ్మోహన్ నాయుడికి అప్పగించడం ప్రత్యేక చర్చకు తావిచ్చింది. ఇది రామ్మోహన్ సామర్థ్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత లోకేశ్ కు ఉన్న నమ్మకాన్ని బయట పెట్టిందని అంటున్నారు. సభలో అందరి భావోద్వేగాలను అదుపు చేయడమే కాకుండా మహానాడు తొలిరోజు విజయవంతంగా పూర్తి చేసుకోవడం వెనుక రామ్మోహన్ నాయుడు కఠోర శ్రమ, చాణక్యం, మేనేజ్మెంట్ స్కిల్స్ ప్రధానమంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇక మూడు రోజులు జరిగే మహానాడులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విషయం తెలిసిందే. యువనేత లోకేశ్ కు పార్టీలో ప్రమోషన్ వస్తుందనే ఊహాగానాల నేపథ్యంలో రామ్మోహన్ పదవిపైనా ఆసక్తి కనిపిస్తోంది. మూడో సారి ఎంపీగా ఉన్న రామ్మోహన్ ను కేంద్ర పౌర విమానయాన మంత్రి పదవిని కట్టబెట్టిన పార్టీ.. ఈ సారి ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శితోపాటు పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా తీసుకునే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు రామ్మోహన్ నాయుడుకి తెలుగు యువత అధ్యక్ష బాధ్యతలు కూడా అప్పగించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మహానాడు ద్వారా తమకు రామ్మోహన్ నాయుడు ఎంత ప్రత్యేకమో చాటిచెప్పిన తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం.. ఆయన సేవలను వంద శాతం వినియోగించుకునేలా పనిచేస్తోందని అంటున్నారు. మహానాడులోనే రామ్మోహన్ కు పార్టీ పరమైన కీలక బాధ్యతలు అప్పగిస్తారని తెలుగుదేశంలో హైకమాండ్ లోని కీలక నేతలు చెబుతున్నారు