మహానాడు వంటలపై ప్రధాని మోదీ ఆరా? మెనూలో మార్పులపై సూచన!
టీడీపీ మహానాడు అంటే ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి సంప్రదాయంగా మహానాడు నిర్వహిస్తుంటారు.
By: Tupaki Desk | 25 May 2025 7:47 PMటీడీపీ మహానాడు అంటే ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి సంప్రదాయంగా మహానాడు నిర్వహిస్తుంటారు. దాదాపు 40 ఏళ్లలో ఒకటి రెండు సందర్భాలు తప్ప ఎప్పుడూ టీడీపీ మహానాడు మిస్ అవ్వలేదు. ఇక గత ఏడాది ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని మహానాడును టీడీపీ వాయిదా వేసింది. ఘన విజయం తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇలాగా అయిన కడపలో ఈ ఏడాది మహానాడు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి మహానాడును పార్టీ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ విషయంపై ప్రధాని మోదీ కూడా ఆసక్తి కనబరిచారని అంటున్నారు.
నీతి అయోగ్ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబును మహానాడు ప్రాధాన్యం, ప్రత్యేకతలపై పీఎం మోదీ అడిగి తెలుసుకున్నారని అంటున్నారు. రాష్ట్ర సమస్యలపై ప్రధానితో మాట్లాడేందుకు చంద్రబాబు ప్రయత్నించగా, ఆయన మాత్రం దాదాపు 5 నిమిషాల పాటు మహానాడు సంగతులను తెలుసుకోడానికే ఆసక్తి కనబరిచారంటున్నారు. ఈ సందర్భంగా అతిథుల కోసం ఏర్పాటు చేస్తున్న వంటకాలపైనా ఆరా తీశారట.. అంతేకాకుండా తనకు బాగా ఇష్టమైన మహారాష్ట్ర వంటకాన్ని కూడా మెనూలో చేర్చాలని సూచించారని అంటున్నారు.
మూడు రోజుల పాటు నిర్వహించే మహానాడులో తొలి రెండు రోజులు 30 వేల మంది, చివరి రోైజు అయిన 29న 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. అయితే తొలి రెండు రోజులు అతిథులు అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక చివరి రోజు కూడా లక్ష మందికి భోజనాలు పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 22 రకాల వంటకాలను తయారు చేయాలని ముందుగా నిర్ణయించారు. అందరికీ నోరూరించే రుచులు సిద్ధం చేస్తున్నారు. అల్పాహారంగా ఇడ్లీ, వడ, పొంగల్, చట్నీ, సాంబార్, కారంపొడి, నెయ్యి, టీ వంటివి ఉన్నాయి. ఇక మధ్యాహ్న భోజనంలో కాజు బర్ఫీ, మిరపకాయ బజ్జీ, టమాటా రైస్, కొబ్బరి అన్నం లేదా వెజ్ పులావ్, పుల్కా లేదా చపాతీ, సొరకాయ పప్పు, చట్నీ, కారంపొడి, తెల్ల అన్నం, టొమాటో కాజు ములక్కాయ, గుత్తి వంకాయ మసాలా ఉన్నాయి.
మధ్యాహ్న భోజనంలో నాన్ వెజ్ కర్రీలను కూడా వడ్డిస్తారు. ఎగ్ మసాలా, కాజు చికెన్ కర్రీ, గోంగూర మటన్ తయారు చేయించాలని టీడీపీ పెద్దలు నిర్ణయించారు. ఇక ఉలవ చారు, రసం, పెరుగు, పాన్, అప్పడాలు, ఐస్ క్రీమ్, కేక్, కూల్ డ్రింక్స్ వంటివి మెనూలో ఉన్నాయి. అయితే ప్రధాని మోదీ సూచనలతో వీటికి అదనంగా కొత్తగా మహారాష్ట్ర వంటకం మెనూలో చేర్చారు. ప్రధాని మోదీకి త్రుణధాన్యాలతో తయారు చేసే వంటకాలు అంటే చాలా ఇష్టమట. దీంతో మహానాడుకు వచ్చే అతిథులకు తృణధాన్యాలతో చేసిన వంటకాలు రుచి చూపించాలని ప్రధాని మోదీ సీఎం చంద్రబాబును కోరారని సమాచారం. తృణ ధాన్యాల సాగు, విక్రయాలను కేంద్రం ప్రోత్సహిస్తోందని, తృణధాన్యాలతో ఆరోగ్యం సిద్ధిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. మహానాడు జరిగే మూడు రోజులలో ఒకసారి ఏదో ఒక ప్రత్యేక వంటకంగా తృణ ధాన్యాలతో చేసిన పదార్థాలను వడ్డించాలని కోరినట్టు సమాచారం.
ప్రధాని సూచనలతో సీఎం చంద్రబాబు భోజన ఏర్పాట్లలో కొద్ది మార్పులు చేయాలని సూచించారని అంటున్నారు. త్రుణధాన్యాల వంటకాలను చేసే నిపుణులతో సంప్రదించాలని పార్టీ యంత్రాంగాన్ని ఆదేశించినట్లు సమాచారం. ఇక మహానాడు భోజన ఏర్పాట్లను టీడీపీ జర్మనీ విభాగం ఆధ్వర్యంలో చేపడుతున్నారు.