అనంతపురం అమాత్యుడి తీరుపై తమ్ముళ్ల గుస్సా.. రీజనేంటి?
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఓ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తీరుపై టీడీపీ నాయకులు రగిలిపోతున్నారు.
By: Tupaki Desk | 25 April 2025 1:30 PMఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఓ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తీరుపై టీడీపీ నాయకులు రగిలిపోతున్నారు. తన వారికి తప్ప.. ఇతరులకు పనులు చేయకుండా.. అధికారులను కట్టడి చేస్తున్నారని వీరు చెబుతున్నారు. వీటిపై ఆయననే ఇటీవల నిలదీసినట్టు తెలిసింది. అయితే.. సదరు మంత్రి మాత్రం.. నాదేమీ లేదు.. నిబంధనల ప్రకారం మీరు కూడా పనులు చేయించుకోవచ్చని చెప్పి చేతులు దులుపుకొన్నారు.
కానీ, చేయాల్సిందంతా చేస్తూ.. పైకి మాత్రం తనదేమీ లేదని మంత్రి చెప్పడంతో నాయకులు హర్ట్ అవు తున్నారు. విషయం ఏంటంటే.. టీడీపీ నాయకులకు అధికారుల వద్ద పెద్దగా వాల్యూలేకుండా పోయిందన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. చిన్న స్థాయి ఉద్యోగిని కూడా.. బదిలీ చేయించలేక పోతున్నారట. వారు చెప్పిన మాటను కూడా.. ఎవరూ వినిపించుకోవడం లేదు. పైకి అందరూ బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు చెప్పినట్టు టీ.. ఇచ్చి సమస్యలు వింటున్నారు.
కానీ, చేతల్లోకి వచ్చే సరికి మాత్రం నెలలు గడిచిపోతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదని నాయకులు తల్లడిల్లుతున్నారు. వీరిలో ఇద్దరు నుంచి నలుగురు కీలక ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఏ చిన్న పని చెప్పినా చేస్తామని అంటున్నారే .. తప్ప.. చేయడం లేదని.. దీనికి మంత్రి కారణమని అంటున్నారు. ``కూటమిలో ఉన్నాం. పైకి ఏమీ చెప్పలేక మౌనంగా ఉన్నాం. ఇలా చేయడం ఆ మంత్రికి సరికాదు. మా పార్టీ కాకపోయినా.. మేమంతా కష్టపడ్డాం. ఈ విషయం ఆయన తెలుసుకోవాలి`` అని అని కీలక నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.
అయితే.. సదరు మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ నాయకుల మాట వేరేగా ఉంది. జిల్లాలో అంతా బాగానే ఉందని వారు చెబుతున్నారు. కానీ, కొందరు నిఖార్సయిన ఉద్యోగులను కూడా.. తమకు అడ్డం వస్తున్నారని చెప్పి బదిలీ చేయమంటే ఎలా? అని వాపోతున్నారు. ఈ విషయంలో మంత్రి ప్రమేయం ఏమీ లేదని.. అధికారులు తమకు నచ్చినట్టు పనిచేయొచ్చని చెబుతున్నారు. కానీ, టీడీపీ నాయకులు మాత్రం మంత్రి ఆదేశాల ప్రకారమే.. అధికారులు తమ మాట వినడం లేదని అంటున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ముదరకముందే.. చర్యలు తీసుకుంటే బెటర్ అంటున్నారు పరిశీలకులు.