జగన్ మాజీ ఎమ్మెల్యేనట...వినిపిస్తోందా ?
ఇపుడు టీడీపీ కూటమి మెజారిటీ సీట్లు గెలుచుకుంది. అయితే కడప గడ్డ మీద మహానాడు మీటింగ్ ని పెట్టిన చంద్రబాబు తన ప్రసంగంలో క్యాడర్ కి ఎంతో ఉత్తేజం ఉత్సాహం ఇచ్చారు.
By: Tupaki Desk | 27 May 2025 10:28 AMవైసీపీ అధినేత జగన్ మాజీ సీఎం అయ్యారు. అయినా ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన పార్టీ తరఫున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలకు నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదా కోరుతున్నారు కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఆయనను జస్ట్ పులివెందుల ఎమ్మెల్యేగా చూస్తోంది. అలాగే పొలిటికల్ ర్యాంగింగ్ చేస్తోంది. అయితే అసెంబ్లీ నిబంధనల ప్రకారం చూస్తే కనుక 18 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సిందే.
ఇదిలా ఉంటే వైసీపీకి జగన్ కి అడ్డా లాంటి కడపలో పది అసెంబ్లీ సీట్లు ఉంటే 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి ఏకంగా ఏడు సీట్లను గెలించింది. కేవలం మూడు అంటే మూడు సీట్లు మాత్రమే వైసీపీకి దక్కాయన్న మాట. ఇదే వైసీపీ 2019 ఎన్నికల్లో పదికి పది సీట్లూ గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసి పారేసింది.
ఇపుడు టీడీపీ కూటమి మెజారిటీ సీట్లు గెలుచుకుంది. అయితే కడప గడ్డ మీద మహానాడు మీటింగ్ ని పెట్టిన చంద్రబాబు తన ప్రసంగంలో క్యాడర్ కి ఎంతో ఉత్తేజం ఉత్సాహం ఇచ్చారు. కడపలో పసుపు జెండా మరింత జోరుగా ఎగురుతుంది అని ధీమా వ్యక్తం చేశారు. అంతే కాదు 2029 ఎన్నికల్లో కడపలో పదికి పది అసెంబ్లీ సీట్లు గెలుచుకుని టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని బాబు జోస్యం చేప్పారు.
అంటే జగన్ సొంత సీటు అయిన పులివెందుల కూడా పోతుందని ఆయన మాజీ ఎమ్మెల్యే అవుతారు అన్నది చంద్రబాబు జోస్యం వెనకాల ఉన్న విషయం అన్న మాట. ఏకంగా కడప గడపలోనే మహానాడు పెట్టి బాబు చేసిన ఈ రీసౌండ్ వైసీపీ అధినాయకత్వానికి వినిపిస్తోందా అని తమ్ముళ్ళు అంటున్నారు.
వైసీపీ పని అయిపోయింది అన్నట్లుగానే బాబు చెప్పేశారు అని అంటున్నారు. ఎపుడు ఎన్నికలు అయినా పార్టీ ఓటమి కావచ్చు కానీ అధినాయకుడు ఓటమి పాలు కావడం అన్నది ఉండదని అంటారు. అదే చరిత్రలో కూడా ఉంది. ఎక్కడో ఒక చోట అలా ఓడిపోయి ఉండవచ్చు. కానీ చరిష్మాటిక్ లీడర్ గా పేరు గడించి తన రాజకీయ జీవితంలో ఎన్నో సంచలనాలు నమోదు చేసి అయిదేళ్ళ పాటు సీఎం గా ఏపీకి పనిచేసిన జగన్ కి ఈసారి పులివెందులలో సైతం కష్టమేనా అన్న చర్చ టీడీపీ మహానాడు తర్వాత వస్తోంది.
జగన్ పులివెందులతో పాటు అన్ని సీట్లు గెలుస్తామని టీడీపీ చెప్పడం అంటే దాని వెనక ఉద్దేశ్యం ఏమిటి అన్న చర్చ కూడా సాగుతోంది. జగనే ఓటమి పాలు అయితే ఇక వైసీపీకి ఎక్కడ గెలుపు దారి అన్నది కూడా ఆ పార్టీలో జనంలో రేకెత్తించడానికేనా ఈ నినాదం ఇచ్చారు అన్నది కూడా చర్చించుకుంటున్నారు. జగన్ అయితే 2024 ఎన్నికల ముందు వై నాట్ కుప్పం అని అన్నారు. అంటే బాబుని మాజీ ఎమ్మెల్యే చేయాలని అన్న మాట. అలాగే వైనాట్ 175 అని కూడా అన్నారు.
అయితే అది రివర్స్ అయింది. వైసీపీ రాజకీయంగా ఎన్నికల యుద్ధంలో బోల్తా కొట్టింది. అయితే చంద్రబాబు వై నాట్ పులివెందుల వై నాట్ 175 అని బాహాటంగా అనడం లేదు. కానీ ఆయన మాటలలో చూస్తే అర్ధం అదే అని అంటున్నారు. మొత్తానికి వైసీపీకి హెచ్చరికగానే ఈ నినాదం ఉందని అంటున్నారు. మరి వైసీపీ ఏమి చేస్తుంది. టీడీపీ దూకుడుకు ఏ విధంగా పై ఎత్తు వేస్తుంది అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.