Begin typing your search above and press return to search.

పీఎం కిసాన్ డేట్ వచ్చేసింది...మరి అన్న దాతా సుఖీభవ డేట్ ?

ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అవుతోంది. గత ఏడాది కాలంగా రైతుల ఖాతాలో అయితే ఒక్క పైసా కూడా పడలేదు.

By:  Tupaki Desk   |   6 Jun 2025 3:00 AM
పీఎం కిసాన్  డేట్ వచ్చేసింది...మరి అన్న దాతా సుఖీభవ డేట్ ?
X

ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అవుతోంది. గత ఏడాది కాలంగా రైతుల ఖాతాలో అయితే ఒక్క పైసా కూడా పడలేదు. ఎన్నికల్లో కూటమి పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేసినది అయితే చాలానే ఉంది. రైతులకు తాము రెట్టింపు పెట్టుబడి సాయం చేస్తామని ఒకటికి పదిసార్లు చెప్పారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసాను అమలు చేసింది. అయితే ఈ పధకం కింద 15 వేల రూపాయలనే ఇస్తున్నారు కానీ తాము ఇరవై వేలుగా పెంచి మరీ ఇస్తామని కూటమి పార్టీలు చెప్పాయి.

ఇక 2024 జూన్ 12న కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది. అపుడే ఖరీఫ్ సీజన్ కూడా స్టార్ట్ అయింది. కానీ కూటమి ప్రభుత్వం అయితే అన్న దాతా సుఖీభవ పేరుతో రైతుల ఖాతాలో నగదు అయితే వేయలేదు. దాంతో రైతాంగం తీవ్ర నిరాశకు గురి అయింది. పోనీ రబీ సీజన్ లో అయినా పడుతుందేమో అని అంతా ఎదురు చూశారు. కానీ నవంబర్ డిసెంబర్ లలో వచ్చిన రబీ సీజన్ లో కూడా పైసా పడలేదు. దాంతో రైతులు పూర్తి అసంతృప్తికి లోను అయ్యారు.

అయితే కూటమి ప్రభుత్వ పెద్దలు మాత్రం అన్న దాతా సుఖీ భవ పధకం విధి విధానాలను ఖరారు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ పధకం రూపకల్పనలో ఉన్నామని కూడా చెప్పారు. అలా ఒక ఏడాది దాటేసింది. ఇక 2025 జూన్ నెల రానే వచ్చింది. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండవ ఖరీఫ్ సీజన్ మరి కొద్ది రోజులలో మొదలు కాబోతోంది అన్న మాట. మరి ఈసారి ఖరీఫ్ సీజన్ కి అయినా నగదు రైతుల ఖాతాలో పడుతుందా అని లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ మధ్యనే విధి విధానాలలో ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. అదేంటి అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పధకంతో కలిపి అన్న దాతా సుఖీభవ ని అమలు చేస్తామని. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతీ నాలుగు నెలలకు ఒక మారు రెండు వేలు వంతున మొత్తం ఏడాదికి ఆరు వేల రూపాయలను రైతుల ఖాతాలో వేస్తోంది. దాంతో కలిపి అన్న దాతా సుఖీభవ పధకం అంటే ఏపీ ప్రభుత్వానికి ఆ ఆరు వేల రూపాయల ఖర్చు మిగిలినట్లే.

అంటే ఏపీ ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టుకుంటుంది అన్న మాట. ఇక్కడ మరో సవరణ కూడా చేశారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో పాటే మూడు విడతలుగా ఇస్తామని అంటే ఆ రెండు వేలతో కలుపుకుని కూటమి ఇచ్చే పద్నాలుగు వేల రూపాయలను మూడు భాగాలుగా విడగొట్టి ఇస్తారు అన్న మాట. మొదటి విడత ఏపీ ప్రభుత్వం అయిదు వేలు ప్లస్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రెండు వేలు అలా ఏడు వేలు రైతుల ఖాతాలోకి వస్తాయి. అలాగే రెండో విడత మరో ఏడు వేలు, మూడో విడత ఏపీ ప్రభుత్వం నాలుగు వేలు ప్లస్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రెండు వేలు కలిపి ఆరు వేలు వస్తాయన్న మాట.

ఈ విధంగా ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నామని కూటమి ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇపుడు చూస్తే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పధకం కింద ఈ ఆర్ధిక సంవత్సరంలో తొలి విడత నిధుల విడుదలకు డేట్ ఫిక్స్ చేశారు. ఈ నిధులను ఈ నెల 19న విడుదల చేస్తారని చెబుతున్నారు. అంటే దగ్గరకు వచ్చేసింది.

మరి ఏపీ ప్రభుత్వం తొలిసారిగా అమలు చేయబోతున్న అన్నదాతా సుఖీభవ పధకం కింద అయిదు వేల రూపాయలను ఈ నిధులతో జత చేసి ఈ నెల 19న చెల్లిస్తారా అన్న చర్చ సాగుతోంది. ఇప్పటికి అయితే అన్న దాతా సుఖీభవ పధకం గురించి కొత్త ప్రకటన ఏదీ వెలువడలేదు అని అంటున్నారు అంతే కాదు తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూడా ఈ పధకం గురించి చర్చించలేదు అని అంటున్నారు.

దాంతో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పధకం కింద నిధులే ముందు విడుదల అవుతాయేమో అని చర్చించుకుంటున్నారు. అలాంటప్పుడు అన్న దాతా నిధులు ఎపుడు విడుదల చేస్తారు అన్న ఆందోళన అయితే రైతులలో ఉంది అని అంటున్నారు ఇంకో వైపు చూస్తే ఏపీలో 65 లక్షల మంది రైతులు ఉన్నారు. కానీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పధకం మాత్రం కేవలం 40 లక్షల మందికే అందుతోంది. అర్హులైన వారు చాలా మంది లక్షలలో ఉన్నా వారికి దక్కడంలేదు.

మరి ఇదే జాబితాను ఏపీ ప్రభుత్వం తీసుకుంటే ఏకంగా పాతిక లక్షల మంది రైతులకు పధకం దక్కకుండా పోతుంది. వారికి ఆ విధంగా తీరని అన్యాయం జరుగుతుంది అని అంటున్నారు. ఏది ఏమైనా అన్న దాతా సుఖీ భవ పధకం కోసం రైతాంగం చాలా ఆశతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. డేట్ టైం ఫిక్స్ చేసి నగదుని రైతుల ఖాతాలో వేయాల్సిన బాధ్యత మాత్రం కూటమి ప్రభుత్వానికే ఉంది అని అంటున్నారు.