టీసీఎస్ పై వివక్ష ఆరోపణలు.. అమెరికాలో కలకలం !
భారతదేశానికి చెందిన ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ప్రస్తుతం అమెరికాలో చిక్కుల్లో పడింది.
By: Tupaki Desk | 18 April 2025 8:15 AMభారతదేశానికి చెందిన ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) ప్రస్తుతం అమెరికాలో చిక్కుల్లో పడింది. అమెరికన్ ఉద్యోగులను తొలగించి భారతీయులను కొనసాగిస్తున్నారనే ఆరోపణలపై అమెరికా ప్రభుత్వం సీరియస్ అయింది. వెంటనే ఫిర్యాదుల ఆధారంగా విచారణకు ఆదేశించింది.బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. 2023చివరి నుంచి దాఖలైన దాదాపు 20కి పైగా ఫిర్యాదుల నేపథ్యంలో అమెరికా ఈఈఓసీ టీసీఎస్పై విచారణ నిర్వహిస్తోంది.
ఫిర్యాదు చేసిన వారిలో చాలా మంది 40ఏళ్లకు పై బడిన వారే. పైగా దక్షిణాసియా నేపథ్యం లేని వారే ఉన్నారు. వారిని అన్యాయంగా తమ ఉద్యోగం నుంచి తొలగించారని అయితే భారతీయ ఉద్యోగులను మాత్రం ముఖ్యంగా హెచ్-1బీ వీసాలపై ఉన్నవారిని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. టీసీఎస్ ఈ ఆరోపణలను ఖండించింది. టీసీఎస్ చట్టవిరుద్థమైన వివక్షకు పాల్పడుతుందన్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. అమెరికా కార్యకలాపాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు తమ సంస్థ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
కాకపోతే దర్యాప్తు గురించి మాట్లాడేందుకు ఈఈఓసీ నిరాకరించింది. అయితే, ఈ విచారణ అధ్యక్షుడు బైడెన్ హయాంలో ప్రారంభమై, ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ పరిపాలనలో కూడా కొనసాగుతున్నట్లు బ్లూమ్ బర్గ్ నివేదించింది. ఇప్పుడు వచ్చిన ఈ ఫిర్యాదులు కరోనా సమయంలో అంటే 2020లో మరో అవుట్సోర్సింగ్ సంస్థ అయిన కాగ్నిజెంట్పై ఈఈఓసీ కేసును గుర్తు చేస్తున్నాయి.
టీసీఎస్ కేసు కూడా ఇదే తరహాలో సాగుతున్నట్లు కనిపిస్తోంది. కంపెనీ గ్లోబల్ హెచ్ఆర్ హెడ్ మిలింద్ లక్కడ్ భారతీయ మీడియాతో మాట్లాడుతూ.. టీసీఎస్ తన అమెరికా ఉద్యోగుల వాటాను 70శాతం నుండి 50శాతానికి తగ్గించి, భారతీయులను ఎక్కువగా నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఏప్రిల్ 2024లో అమెరికా ప్రతినిధి సెత్ మౌల్టన్ (డి-ఎంఏ) ఈఈఓసీని అధికారికంగా విచారణ నిర్వహించాలని కోరారు.
2023లో బ్లూమ్బెర్గ్ జరిపిన విచారణలో అవుట్సోర్సింగ్ సంస్థలు తమ భారీ విదేశీ ఉద్యోగుల సంఖ్యను ఉపయోగించి వార్షిక హెచ్-1బీ వీసా లాటరీని నింపేస్తున్నాయని, చిన్న కంపెనీలు, అమెరికన్ ఉద్యోగార్థులకు అందుబాటును పరిమితం చేస్తున్నట్లు కనుగొన్నారు. టీసీఎస్ కూడా హెచ్-1బీ లిమిట్స్ దాటేసేందుకు ఎల్-1ఏ వీసాను దుర్వినియోగం చేసిందని ఆరోపణలు వచ్చాయి. అయితే కంపెనీ ఈ ఆరోపణలను ఖండిస్తోంది. ఈ వివాదం అమెరికాకు మాత్రమే పరిమితం కాలేదు. యూకేలో ముగ్గురు మాజీ టీసీఎస్ ఉద్యోగులు 2023లో జరిగిన వయస్సు, జాతీయత వివక్ష కారణంగా తొలగించారని ఉద్యోగ ట్రిబ్యునల్ ముందు ఫిర్యాదు చేశారు. టీసీఎస్ ఆ ఆరోపణలను కూడా ఖండించింది.