Begin typing your search above and press return to search.

ఆ టికెట్ కు కాంగ్రెస్ లో మహా క్రేజ్.. 36 దరఖాస్తులు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇల్లందు నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం. సింగరేణి బొగ్గు గనులున్న ఈ నియోజకవర్గం ఉమ్మడి వరగంల్ కు సరిహద్దున ఉండేది

By:  Tupaki Desk   |   29 Aug 2023 7:18 AM GMT
ఆ టికెట్ కు కాంగ్రెస్ లో మహా క్రేజ్.. 36 దరఖాస్తులు
X

కాలం కలిసొచ్చో.. లక్ నడిచొచ్చో.. ఎమ్మెల్యే టికెట్ దొరకకపోతుందా? అని అనుకున్నారేమో? ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ కు ఏకంగా 36 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే అదేమీ జనరల్ స్థానం కూడా కాదు. గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గం. కానీ, కాంగ్రెస్ అంటే కాంగ్రెస్సే కదా? ఆ పార్టీ 20 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్నా కూడా మళ్లీ బతికి బట్టకట్టగలదు. ఇప్పుడు తెలంగాణలో అలాంటి పరిస్థితే ఉంది.

బొగ్గు గనుల నియోజకవర్గం

తెలంగాణలో పోటీకి ఆసక్తి ఉన్నవారి నుంచి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. దీనికి ఆగస్టు 25తో గడువు ముగిసింది. మంగళవారం ఈ దరఖాస్తులను పరిశీలస్తున్నారు. కాగా, 119 నియోజకవర్గాలకు ఏకంగా 10,25 దరఖాస్తులు వచ్చాయి. 34 స్థానాల్లో 10 మందిపైగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే, హైలైట్ ఏమిటంటే ఒక్క నియోజకవర్గంలోనే ఏకంగా 36 మంది అప్లై చేశారు. ఈ నియోజకవర్గం ఉమ్మడి ఖమ్మంలో ఉంది. అంతేకాదు.. సింగరేణి బొగ్గు గనులకు ఇది ప్రసిద్ధి చెందినది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గాన్ని గెలుచుకుంది. అయితే, ఎమ్మెల్యే ఫిరాయించడంతో హతాశురాలైంది. 2014 లోనూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీనే గెలుపొందింది.

పార్టీకి ఊపుతోనేనా?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇల్లందు నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం. సింగరేణి బొగ్గు గనులున్న ఈ నియోజకవర్గం ఉమ్మడి వరగంల్ కు సరిహద్దున ఉండేది. జిల్లాల పునర్విభన సందర్భంగా మొత్తం ఐదు మండలాల్లో 2 మహబూబాబాద్, రెండు ఖమ్మం, ఒకటి కొత్తగూడెం జిల్లాల్లోకి వెళ్లాయి. కాగా, ఇక్కడ విప్లవ పార్టీల ఆధిపత్యం ఎక్కువ. ఇదే కమ్రంలో గుమ్మడి నర్సయ్య వంటి నిస్వార్థ నాయకుడు ఏకంగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే, 2014 లో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య, 2018లో మహిళా అభ్యర్థి హరిప్రియ విజయం సాధించారు. అంటే వరుసగా రెండు సార్లు కాంగ్రెస్ పార్టీదే ఈ నియోజకవర్గం. ఇక్కడే కీలక పరిణామం జరిగింది. 2018లో గెలిచిన హరిప్రియ బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. ఆమెకు మళ్లీ టికెట్ దక్కింది. 2014లో నెగ్గిన కోరం కనకయ్య మధ్యలో బీఆర్ఎస్ లోకి వెళ్లినా పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు కాంగ్రెస్ లో చేరారు.

రేవంత్ రెడ్డి నాయకత్వం, కర్ణాటక ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ కు తెలంగాణలో ఊపు వచ్చింది. ఇదే సమయంలో టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానంతో భారీ స్పందన కనిపిస్తోంది. అందులోనూ గత రెండుసార్లు నెగ్గిన నియోజకవర్గం కావడంతో ఇల్లందు నుంచి 36 మంది ఔత్సాహికులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

అధిష్ఠానం ఏం చేయనుందో?

కాంగ్రెస్ అధిష్ఠానం ఒక్కో నియోజకవర్గం నుంచి ప్రాథమికంగా ముగ్గురు బలమైన అభ్యర్థులను ఎంపిక చేయనుంది. వీరితో పాటు క్షేత్ర స్థాయిలో దరఖాస్తు చేసుకున్నవారిపై అంతర్గత సర్వే చేయించనుంది. అన్నింటినీ క్రోడీకరించి చివరకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.