ప్రముఖ యోగా గురువు మృతిపై స్పందించిన మోడీ..
స్వామి శివానంద మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
By: Tupaki Desk | 4 May 2025 11:30 AMప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద (128) కన్నుమూశారు. వారణాసిలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు సన్నిహితులు వెల్లడించారు.
స్వామి శివానంద మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. యోగా రంగానికి ఆయన చేసిన అసమానమైన కృషిని, ఆధ్యాత్మిక సాధనను ప్రధాని మోదీ కొనియాడారు. దేశంలోని ప్రతి తరానికి ఆయన స్ఫూర్తినిస్తూనే ఉంటారని పేర్కొన్న ప్రధాని, శివానంద మృతి యోగా రంగానికి తీరని లోటని అన్నారు.
1896 ఆగస్టు 8న అవిభాజ్య భారత్లోని సిల్హెత్ (ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉంది) జిల్లాలో నిరుపేద కుటుంబంలో జన్మించిన స్వామి శివానంద, ఆరేళ్ల వయసులోనే తన తల్లిదండ్రులను కోల్పోయారు. దీంతో ఆయన పశ్చిమ బెంగాల్లోని ఓ ఆశ్రమంలో గురు ఓంకారానంద గోస్వామి సంరక్షణలో పెరిగారు. గురు ఓంకారానంద ఆయనకు యోగా వంటి ఆధ్యాత్మిక విషయాలను బోధించారు.
తన జీవితాన్ని సమాజసేవకు అంకితం చేసిన స్వామి శివానంద, గత 50 ఏళ్లుగా ఒడిశాలోని పూరిలో సుమారు 400-600 మంది కుష్టు రోగులకు సేవలందించారు.
యోగా రంగానికి ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా 2022లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం లభించింది. అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరించారు. తెల్లని ధోవతి, కుర్తా ధరించి, కాళ్లకు చెప్పులు లేకుండా అత్యంత సామాన్యంగా వేదికపైకి వచ్చి పురస్కారాన్ని స్వీకరించడం అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆయన మృతితో యోగా ప్రపంచం ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువును, నిస్వార్థ సేవా మూర్తిని కోల్పోయింది.